యువకుడిని అడవిలోకి లాక్కెళ్లిన పెద్దపులి..ఒకటా లేక మరో పులి కూడా ఉందా?

యువకుడిని అడవిలోకి లాక్కెళ్లిన పెద్దపులి..ఒకటా లేక మరో పులి కూడా ఉందా?

కొమురంభీం జిల్లా దాహెగాం మండలంలోని దిగాడలో విషాదం నెలకొంది. పశువులు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లిన విజ్ఞేశ్వర్‌ అనే యువకుడిపై దాడి చేసిన పెద్దపులి.. నోటకరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెనుక భాగం మొత్తం తినేసింది. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

పెద్దపులి దాడితో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం పులి వచ్చి మీద పడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటే రైతులు భయపడిపోతున్నారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు పులి వేట ముమ్మరం చేశారు. బోన్లతో పులిని పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు.

ఇటీవల సమీప అటవీ ప్రాంతంలో పలుచోట్ల సంచరిస్తున్న పులులు అటవీశాఖ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. అక్టోబర్‌లో ఏటూరునాగారం సమీపంలోని కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పులి జాడ ఎక్కడా కనిపించలేదు. పది రోజుల క్రితం మహబూబాబాద్‌ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నెల 6న ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లోనూ పులి సంచరించిన అడుగు జాడలు కనిపించాయి.

ఒకటే పులి అన్ని ప్రాంతాల్లో సంచరిస్తోందా.. లేక మరో పులి కూడా ఉందా అని అధికారులు తెలుసుకునే పనిలో పడ్డారు. తాజా ఘటనతో ఆయా ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ప్రజలు అడవిలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story