నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

తెలంగాణ అసెంబ్లీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11:30 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. నాలా చట్టానికి సవరణ, రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు, జీహెచ్ఎంసీ చట్టం - 1955.. సవరణ బిల్లులపై చర్చించి అసెంబ్లీ ఆమోదించనుంది.

క్యాబినెట్‌లో చేపట్టిన తీర్మానాలు అన్నిటినీ బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నాలా చట్టానికి సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చేక్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందచేస్తూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తోంది. భూమార్పిడి సులభతరం చేస్తూ.. చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది. ఈ చట్ట సవరణకు రేపు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఇక రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ చట్టం-1955కు సవరణ చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్దత కల్పిస్తూ సవరణ తీసుకురానున్నారు. ఇక వార్డు కమిటీల పనివిధానం.. వార్డుల రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంలో చట్ట సవరణలు చేస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం. నేడు ప్రవేశపెట్టబోయే ఈ బిల్లులు అన్నింటినీ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత రేపు శాసనమండలిలో చర్చించి బిల్లులు పాస్ చేయించుకోవాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.

ఇక కరోనా నేపథ్యంలో గత శాసనసభ సమావేశాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అందుకే ఇప్పుడు కూడా కేవలం రెండు రోజుల్లోనే ఈ సమావేశాలు కూడా ముగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లను శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు. కరోనా దృష్ట్యా గతంలో సభలో సభ్యుల మధ్య భౌతికదూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్‌ విధానాన్ని కొనసాగించాలని సూచించారు. అసెంబ్లీ ప్రాంగణం, సభ లోపల పూర్థిస్థాయిలో శానిటైజేషన్‌ చేయించాలని మండలి కార్యదర్శిని ఆదేశించారు.

అసెంబ్లీ సమావేశాల బందోబస్తుపైనా స్పీకర్‌ ఆరా తీశారు. రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడారు. అలాగే సమావేశాల్లో అవసరమైన సమాచారంపై చీఫ్‌ సెక్రటరీతో మాట్లాడారు. కరోనా నెగెటివ్‌ వస్తేనే సమావేశాలకు హాజరుకావాలన్నారు. సమావేశాలకు హాజరయ్యే ఉభయసభల సభ్యులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టెస్టింగ్‌ కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story