Revanth Reddy : అమిత్‌షాపై ప్రశ్నల వర్షం..తొమ్మిది ప్రశ్నలు సంధించిన రేవంత్..!

Revanth Reddy :  అమిత్‌షాపై ప్రశ్నల వర్షం..తొమ్మిది ప్రశ్నలు సంధించిన రేవంత్..!
Revanth Reddy : మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలు గడప దాటడం లేదని కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు

Revanth Reddy : తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా అమిత్‌షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. మాటలు కోటలు దాటుతున్నాయి గానీ చేతలు గడప దాటడం లేదని కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మీ హామీ ఒట్టి బూటకమని అర్థమైయిందన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేస్తే... మీ పార్టీ రాష్ట్ర నాయకులేమో టీఆర్ఎస్ తో లడాయి అంటూ తొడలు కొడుతుంటారని... ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తున్న మీ రెండు పార్టీల చీకటి సంబంధం తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న మీకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానంటూ 9 ప్రశ్నలు అడిగారు.

1. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

2. వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే వరి రైతులు చనిపోయారు. దీనికి బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా అని నిలదీశారు.

3. తెలంగాణ ఏర్పాటు మీద మోదీ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందని అనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించారు.

4. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మూడేళ్లవుతోంది. హామీ అమలు కాకపోవడంపై మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను చీట్ చేయడం కాదా అని ప్రశ్నించారు.

5. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటీ మంగళం పాడారు. తెలంగాణ ప్రజలను నిలువునా వంచించిన మీ ఇద్దరినీ మేం ఎందుకు నమ్మాలి?.. మీకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలని నిలదీశారు.

6. ప్రతిష్టాత్మక రామాయణం సర్క్యూట్ దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా అని రేవంత్‌ ప్రశ్నించారు.

7. ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ అవినీతి విచారణలో అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే... అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

8. తెలంగాణలో ఒక్క దానికై హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. అడిగే బుద్ధి టీఆర్ఎస్ సర్కారుకు లేదు. మీ దుర్మార్గ చట్టాలకు వారి మద్ధతు... వారి అక్రమాలు అవినీతికి మీ మద్ధతు... ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది అంటూ నిలదీశారు తెలంగాణ పీసీసీ చీఫ్‌.

9. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు ఇంతలా పెంచుతూ.. జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలని రేవంత్‌ రెడ్డి నిలదీశారు.

Tags

Read MoreRead Less
Next Story