TS : తెలంగాణ అప్పు.. రూ.4,86,300కోట్లు

TS : తెలంగాణ అప్పు.. రూ.4,86,300కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థవి 66 వేల 854 కోట్లు..

తెలంగాణ అప్పులు 4 లక్షల 86 వేల 300 కోట్లకు చేరనున్నాయి. వచ్చే ఏడాది తీసుకునే కొత్త రుణాలతో కలిపి ఈ మొత్తం అవుతుందని ప్రభుత్వం బడ్జెట్‌లో వెల్లడించింది. FRBM పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాల్లో... గత ఏడాది 3 లక్షల 22 వేల 993 కోట్లుంటే.. ఈసారి 35 వేల కోట్లు అదనంగా పెరిగి.. 3 లక్షల 57 వేల 59 కోట్లకు చేరనున్నాయి. ఇవి కాక వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు పూచీకత్తు ఇచ్చినవి బడ్జెట్‌ వెలుపల అదనంగా ఉంటాయి. వాటితో కలిపితే మొత్తం 4.86 లక్షల కోట్లకు చేరతాయి. వచ్చే ఏడాదిలో రాష్ట్ర జనాభా 4 కోట్లు ఉంటుందనుకుంటే.. ఒక్కొక్కరిపై తలసరి రుణభారం లక్షా 21 వేల 575 ఉంటుందనేది అనధికార అంచనా.

2020-21లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో అప్పులు 25.4 శాతం ఉండగా.. వచ్చే ఏడాదికి 23.8 శాతానికి తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. కానీ ఈ శాతం తగ్గినట్లు చూపినా... FRBM పరిధిలో తీసుకున్న అప్పుల సొమ్ము మాత్రం 2020-24 మధ్య నాలుగేళ్లలో 2 లక్షల 44 వేల 19 కోట్ల నుంచి 3 లక్షల 57 వేల 59 కోట్లకు పెరుగుతోంది. జీఎస్‌డీపీ విలువ పెరిగినందునే అప్పుల శాతం తగ్గినట్లు కనిపిస్తోంది. తీసుకున్న అప్పులు మాత్రం నాలుగేళ్ల వ్యవధిలో 2.44 లక్షల కోట్ల నుంచి 3.57 లక్షల కోట్లకు చేరాయి.

ఇవి కాకుండా..... రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థవి 66 వేల 854 కోట్లు, మిషన్‌ భగీరథకు 23 వేల 364 కోట్లు, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థవి 7 వేల 435 కోట్లు, విద్యుత్‌ డిస్కంలవి 6 వేల 300 కోట్లు, విద్యుత్‌ ఆర్థిక సంస్థవి 2 వేల 917 కోట్లు... ఇలా వివిధ సంస్థలవి ఉన్నాయి. వివిధ రకాల అభివృద్ధి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థల ద్వారా రుణాలను తీసుకుంటోంది. వీటిలో కొన్ని సంస్థలు వాటికి వచ్చే ఆదాయంతోనే తిరిగి అప్పులు చెల్లించాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ని ప్రసుత్త ధరల్లో 13 లక్షల 27 వేల 495 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది కంటే 15.6 శాతం వృద్ధిరేటును రాష్ట్రం సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story