తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి నియామకం
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యు లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. షహీనా అఫ్రోజ్, కుమ్ర ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి యాదవ్, సుధం లక్ష్మి, గద్దల పద్మ, కటారి రేవతీరావు కమిటీలో ఇతర సభ్యులు. కమిషన్ చైర్మన్తో పాటు ఆరుగురు సభ్యులూ పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఐదేళ్లు పదవి లో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా త్రిపురాన వెంకట రత్నం పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2018 మార్చి వరకు ఆమె కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణలో మహిళా కమిషన్కు చైర్పర్సన్ నియామకం జరగలేదు. దీంతో సుమారు నాలుగేళ్లుగా కమిషన్ క్రియాశీల కార్యకలాపాలకు దూరంగా ఉంది.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సునీతా లక్ష్మారెడ్డి 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి మంత్రివ ర్గంలో చిన్న నీటి పారుదల, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2018లో నర్సాపూర్ శాసన సభ స్థానం నుంచి, 2015లో మెదక్ లోక్సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు.
ఏళ్ల తరబడి తెలంగాణ మహిళా కమిషన్కు చైర్పర్సన్ను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్.రమ్యారావు అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 18లోగా మహిళా కమిషన్కు చైర్పర్సన్ను నియమించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటించకపోవడం పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, డిసెంబర్ 31ని గడువుగా నిర్దేశించింది. గడువులోగా నియామకం జరగని పక్షంలో సీఎస్ కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ జనవరి 4వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మహిళా కమిషన్కు చైర్పర్సన్తో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com