NEW YEAR: న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల నజర్‌

NEW YEAR: న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల నజర్‌
డ్రగ్స్‌ వినియోగంపై ప్రత్యేక దృష్టి... వేడుకలకు అనుమతి తప్పనిసరి...

హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏడాది వేడుకలపై పోలీసులు నజర్‌ పెట్టారు. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక దృష్టిసారించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముందస్తు తనిఖీల్లో భాగంగా డ్రగ్స్‌, గంజాయి పెద్దఎత్తున పట్టుబడుతున్నాయి. హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఏటా పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. కొన్ని పబ్‌లు యథేచ్ఛగా డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్‌ పరిధిల్లోని మూడు పబ్‌లపై ఫిర్యాదులు రావటంతో నిర్వాహకులను పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం.


శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌ల్లో ప్రైవేటు పార్టీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి చేశారు . కొత్త ఏడాది వేడుకలకు డ్రగ్స్‌ను విక్రయించి సొమ్ము చేసుకునేందుకు అంతరాష్ట్ర ముఠాలు రంగంలోకి దిగాయి. గోవా, బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు చేరుతున్న మాదకద్రవ్యాలపై పోలీసులు నిఘా ఉంచారు. ఫిలింనగర్‌లోని ఓ పబ్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న యువకుడిని టీఎస్‌న్యాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 20 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. రెండ్రోజుల క్రితం పుణె నుంచి 102 గ్రాముల ఎండీఎంఏ తీసుకొచ్చిన అభియాస్‌ విక్కీని అరెస్ట్‌ చేశారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష రూపాయల విలువైన డ్రగ్స్‌ను పట్టుకున్నారు. గోవాలో ఉంటున్న రష్యా రష్యాకు దేశస్థురాలు వీటిని సరఫరా చేస్తున్నట్లు తేల్చారు. హైదరాబాద్‌లో గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్ర వ్యక్తిని ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.

36 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం వద్ద తనిఖీల్లో 4 లక్షల 43 వేల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త ఏడాది వేడుకల్లో వినియోగించేందుకు గంజాయి కొనుగులో చేశారని పోలీసులు వెల్లడిచారు. డిసెంబరు 31 అర్ధరాత్రి సంబరాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఒంటి గంట వరకే వేడుకలకు అనుమతినిచ్చారు. హైదరాబాద్‌లో డిసెంబరు 31 అర్ధరాత్రి తర్వాత ఫ్లెఓవర్లను కూడా మూసివేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story