Vanasthalipuram: వనస్థలిపురం బ్యాంక్‌ చోరి కేసు.. మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నిందితుడు..

Vanasthalipuram: వనస్థలిపురం బ్యాంక్‌ చోరి కేసు.. మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన నిందితుడు..
Vanasthalipuram: హైదరాబాద్‌ వనస్థలిపురం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్యాషియర్‌ కేసు.. మలుపులు తిరుగుతోంది.

Vanasthalipuram: హైదరాబాద్‌ వనస్థలిపురం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్యాషియర్‌ కేసు.. మలుపులు తిరుగుతోంది. తొలుత తానే డబ్బు తానే తీసుకెళ్లినట్లు ఒప్పుకున్న ప్రవీణ్‌.. ఇప్పుడు తాను ఎలాంటి నగదు తీసుకెళ్లలేదంటూ సెల్ఫీ వీడియో పంపాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని.. బ్యాంకు మేనేజర్, సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

గతంలోనూ అనేక సార్లు నగదు తక్కువగా ఉండటంపై తాను నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదన్నాడు. బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు. తాను ఆఫీస్‌ నుంచి బయటకు వెళ్లినప్పుడు అందరూ చూశారని.. తన చేతిలో ఎలాంటి బ్యాగ్, డబ్బులు లేవని ప్రవీణ్‌ తెలిపాడు.

అయితే మూడు నెలల క్రితం క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయానని.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని మేనేజర్‌కు మెసేజ్ పెట్టానని ప్రవీణ్‌ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ఇక బ్యాంక్ ఆఫ్‌ బరోడాలో తాజాగా చోరీకి గురైన 22 లక్షలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తనమీద కావాలనే మేనేజర్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించిన ప్రవీణ్‌.. మేనేజర్‌ ఇలానే చేస్తే సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించాడు.

ఇక ప్రవీణ్‌ సెల్ఫీ వీడియోపై స్పందించిన వనస్థలిపురుం ఏసీపీ పురుషోత్తం రెడ్డి.. ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వనస్థలిపురం బ్యాంక్‌ ఆఫ్ బరోడా బ్యాంకులో రూ.22.53 లక్షలు చోరీకి గురైంది. డబ్బు మాయం కావడంతో.. బ్యాంకు అధికారులు క్యాషియర్ ప్రవీణ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. వారి అనుమానం నిజం చేస్తూ.. చోరీ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయిన క్యాషియరే ప్రవీణే.. డబ్బు దొంగిలించాడని తేలింది.

మంగళవారం మధ్యాహ్నం సమయంలో మేనేజర్ దగ్గకు వెళ్లి.. ఒంట్లో బాగోలేదని బయటకు వెళ్తానని చెప్పిన క్యాషియర్.. నగదు తీసుకొని పారిపోయినట్లు గుర్తించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అయితే చోరీ విషయం మీడియాలో రావడంతో నిందితుడిలో భయం మొదలైంది. తానే డబ్బు తీసుకెళ్లానని ప్రవీణ్ బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడు.

క్రికెట్ బెట్టింగ్‌లో నష్టాలు రావడంతోనే తాను దొంగతనం చేయాల్సి వచ్చిందని.. బెట్టింగ్‌లో డబ్బులు వస్తే.. చోరీ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మేనేజర్‌కు క్యాషియర్ మెసేజ్ పెట్టాడని తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ తాను ఎలాంటి చోరీ చేయలేదని సెల్ఫీ వీడియో పెట్టాడు. దీంతో ప్రవీణ్ కుమార్ ఆచూకీ కోసం మూడు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. .

Tags

Read MoreRead Less
Next Story