కేసీఆర్‌ కేంద్రానికి లేఖపై కిషన్‌రెడ్డి మండిపాటు

కేసీఆర్‌ కేంద్రానికి లేఖపై కిషన్‌రెడ్డి మండిపాటు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జల వివాదాలు నెలకొన్న నేపథ్యంలో... ఈ నెల 6న అపెక్స్‌ కౌన్సిల్‌... ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించనుంది. ఇప్పటికే వాయిదా పడుతూ వస్తున్న కౌన్సిల్‌ సమావేశం ఎట్టకేలకు 6న ఖరారైంది. అయితే.. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం జరగడానికి ముందు కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాయడం... ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ లేఖలో కేంద్రం వైఖరిని కేసీఆర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్-3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేళ్లుగా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే... కృష్ణా నదీ జలాల యాజమాన్యబోర్డు ఏం చేస్తోందని పేర్కొన్నారు.

జల వివాదాలను కేంద్రానికి ముడిపెట్టడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జగన్‌తో కలిసి కేసీఆర్ భోజనం చేయగాలేనిది... జల వివాదాలపై ఎందుకు మాట్లాడలేరని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుంటే.. మధ్యవర్తిత్వానికి కేంద్రం సిద్ధమని ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాట్లాడుకుంటే కేంద్రం అడ్డుపడిందా అని కిషన్‌రెడ్డి నిలదీశారు.

అటు... ఈ నెల 5న ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను జగన్ కలుస్తారని సమాచారం. ఏపీకి రావాల్సి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేయనున్నారని తెలుస్తోంది. పర్యటనలో భాగంగా పెండింగ్ ప్రాజెక్టుల అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందు జల వివాదాలపై చర్చ జరుగుతున్న తరుణంలో షెకావత్‌తో జరిగే సమావేశంలో ఏం చర్చిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story