మీలో ఎవరు కోటీశ్వరులు షో గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

మీలో ఎవరు కోటీశ్వరులు షో గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
ప్రేక్షకాదరణ పొందిన ఈ టీవీ షోని ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో 2014 జూన్‌లో తెలుగులోకి తీసుకువచ్చారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. బుల్లితెర పైన సూపర్ డూపర్ హిట్టైంది.

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా చేసిన "కౌన్ బనేగా కరోడ్ పతి" టీవీ షో దేశవ్యాప్తంగా ఎంత బాగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే.. ప్రేక్షకాదరణ పొందిన ఈ టీవీ షోని 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో 2014 జూన్‌లో తెలుగులోకి తీసుకువచ్చారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రారంభమైన ఈ షో.. బుల్లితెర పైన సూపర్ డూపర్ హిట్టైంది. హోస్ట్ గా నాగ్ కూడా ఫుల్ సక్సెస్ అయ్యారు. ఇక అదే ఏడాది డిసెంబర్‌లోనే రెండో సీజన్, 2015 నవంబర్‌లో మూడో సీజన్‌ లను నిర్వహించారు. అయితే ఈ మూడు సీజన్లకు నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించడం విశేషం.

ఇక నాలుగో సీజన్ (2017) లో మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ నాలుగు సీజన్లు మా టీవీలోనే ప్రసారమయ్యాయి. ఇక ఈ షో ద్వారా చాలా మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. అటు టీఆర్పీ రేటింగ్స్ లో కూడా దూసుకుపోయింది. అయితే ఇప్పుడు ఐదో సీజన్ మొదలవుతుంది. ఈ సీజన్ మాత్రం జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో ప్రోమో షూట్ కూడా కంప్లీట్ చేశారు. ఈ ప్రోమోకి ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేశారు.

ప్రోమోలో ఎప్పటిలానే తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్ .. అంతేకాకుండా చాలా హుందాగా కూడా వ్యవహరించారు.. ఇక్కడినుంచి ఎంత పట్టుకెళ్తారో నేను చెప్పలేను.. కానీ లైఫ్‌లో నేను గెలవగలను అనే కాన్ఫిడెన్స్ ని మాత్రం కచ్చితంగా పట్టుకెళ్తారు.. నాది గ్యారెంటీ అంటూ షో పైన అంచనాలను అమాంతం పెంచేశాడు. గతంలో బిగ్ బాస్ ను హోస్ట్ చేసిన అనుభవంతో ఈ షోని కూడా చాలా ఈజీగానే హిట్టు మెట్టు ఎక్కించగలడనే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించాడు ఎన్టీఆర్. విజ్ఞానం, వినోదంతో పాటు సామాన్యుడి కలను నిజం చేసే ఈ షో త్వరలోనే మొదలుకానుంది.

ఇక ఈ షో విషయానికి వచ్చేసరికి ప్రతి సోమవారం నుండి గురువారం వరకు మాటీవిలో రాత్రి 9 గంటల నుండి 10.30 గంటల వరకు అంటే దాదాపు గంటన్నర సేపు ప్రసారం అయ్యేది. చాలా మంది ఎస్.ఎం.ఎస్ లు పంపించగా చివరికి 10 మంది మాత్రమే హాట్ సీటు కోసం పోటీపడుతుంటారు. ముందుగా ఈ పది మందికి ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అనే ప్రక్రియలో మొదట మూడు ప్రశ్నలు అడుగుతారు. అందులో ఏ వ్యక్తి తక్కువ సమయంలో వాటికి జవాబులు చెప్తారో ఆ వ్యక్తిని హాట్ సీట్ లో కూర్చోబెడతారు.

అలా హాట్ సీటుకు వచ్చిన ఆ వ్యక్తికి సంబంధించిన జీవిత విశేషాలపై ఓ వీడియోని ప్లే చేస్తారు. ఆ తర్వాత అసలు గేమ్ మొదలవుతుంది. ఈ గేమ్ లో పదిహేను ప్రశ్నలను కంప్యూటర్ ద్వారా హోస్ట్ అడుగుతారు.. అయితే ఈ పదిహేను ప్రశ్నలకి గాను మూడు లైఫ్ లైన్ లు ఉంటాయి. అవే.. ఆడియన్స్ పోల్, ఫోన్ ఎ ఫ్రెండ్, 50-50.. ప్రశ్నల పైన ఏ మాత్రం సందేహం ఉన్నా ఈ మూడు లైఫ్ లైన్ లను వాడుకోవచ్చు.. అయితే వీటికి కేవలం ముప్పై సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది.

ఈ 15 ప్రశ్నలలో మొదటి ప్రశ్న యొక్క విలువ రూ.1000 ఉంటుంది. ఆ తర్వాత ప్రశ్నల విలువలు 2000, 3000, 5000, 10000 గానూ ఒక విభాగంగా ఐదు ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను 45 సెకన్లలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అయిదు ప్రశ్నలలో చివరి ప్రశ్న తప్పు చెప్పిన ఏ విధమైన ప్రైజ్ రాదు. ఇక 6 నుండి 10 ప్రశ్నల యొక్క విలువలు క్రమంగా 20,000, 40,000, 80,000, 1,60.000, 3,20.000 గా ఉంటాయి.ఈ ప్రశ్నలకు 60 సెకన్లు సమయం ఉంటుంది. ఈ ఐదు ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోతే 10 వేలు మాత్రమే ప్రైజ్ మనీ అందుకుంటారు.

ఒకవేళ ప్రశ్నకి సమాధానం తెలియక గేమ్‌ నుండి నిష్క్రమించాలని అనుకుంటే చివరి ప్రశ్న విలువెంతో అది మాత్రమే ఆ వ్యక్తి సొంతం అవుతుంది... ఇక 11 నుండి 15 ప్రశ్నల విలువలు క్రమంగా 6,40.000, 12,50,000, 25,00,000, 50,00,000, 1 కోటి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ ప్రశ్నలకు టైం లిమిట్ అంటూ ఉండదు.. ఈ ఐదు ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే 3 లక్షల ఇరవై వేలు మాత్రమే ప్రైజ్ మనీ అందుకుంటారు. లేదా ఏ ప్రశ్నకైనా సరైన సమాధానం తెలియక గేమ్ నుండి నిష్క్రమిస్తే వారికి చివరి ప్రశ్న విలువెంతో అంత ఇస్తారు.

ఇక ఈ షో మొదటి సీజన్ లో ఉమాకాంత్, అరుణ్ మెహర్ గంగరాజు అనే ఇద్దరు వ్యక్తులు 12,50,000 ప్రైజ్ మనీ గెలుచుకోగా, మూడవ సీజన్ లో మొట్ట మొదటిసారి రావణ శర్మ అనే వ్యక్తి 25 లక్షలు గెలుచుకున్నారు. ఇక ఆ తరువాత జనవరి 2016 మొదటి వారంలో అమరనాధ్ - రోహిత దంపతులు 50 లక్షలు గెలుచుకున్నారు. ఇప్పటివరకు ఒక్కరు కూడా కోటి రూపాయలు గెలుచుకోలేదు. మరి ఈ సారైనా ఆ కోటి శిఖరాన్ని అందుకుంటారో లేదో చూడాలి.



Tags

Read MoreRead Less
Next Story