వీరాభిమాని : వెంకీ కోసం 140 కి.మీ. పాదయాత్ర!
తమ అభిమాన నటుల కోసం ఏమైనా చేసేందుకు వెనకాడరు అభిమానులు. వారిని ఓ దైవం లాగా భావిస్తుంటారు. తాజాగా విక్టరీ వెంకటేష్ అభిమాని ఒకరు ఆయన్ని కలిసేందుకు 140కి. మీ పాదయాత్ర చేసి రామానాయుడు స్టూడియో చేరుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూర్లోని బుద్ధారాం గ్రామానికి చెందిన శ్రీనివాస్.. హీరో వెంకటేష్ కి పెద్ద వీరాభిమాని.. వెంకటేష్ అన్నా.. వెంకటేష్ సినిమాలన్నా శ్రీనివాస్ కి చాలా ఇష్టం.
దీనితో ఆయన్ని ఎలాగైనా కలవాలనే ఉద్దేశ్యంతో 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ రామానాయుడు స్టూడియోకు చేరుకున్నాడు. కానీ ప్రస్తుతం వెంకటేష్ నారప్ప షూటింగ్ లో బిజీగా ఉండడంతో కలవలేకపోయాడు. వెంకీ అభిమాని అయిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. తను ఏడేళ్ళ వయసు ఉన్నప్పుడు వెంకటేష్ నటించిన జయం మనదేరా సినిమాని చూశానని.. అప్పటి నుంచి వెంకటేష్ కి పెద్ద అభిమానిగా మారినట్టుగా వెల్లడించాడు. ప్రతి ఏడాది వెంకటేశ్ పుట్టిన రోజును కూడా గ్రాండ్గా చేస్తానని తెలిపాడు.
అయితే ఇప్పటికే వెంకీని కలిసేందుకు రెండు, మూడు సార్లు వచ్చాను, కానీ కలవలేకపోయానని, అందుకే ఈసారి పాదయాత్ర చేసుకుంటూ వచ్చానని తెలిపాడు. కానీ ఆయన నారప్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో కలవలేకపోయనని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా వెంకటేష్ ని కలుస్తానని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com