రానా కంటతడి.. 'చుట్టూ జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా'..
ఆరడుగుల పైనే ఉన్న ఆజానుబాహుడు.. భల్లాలదేవుడి పాత్రకు సరిగ్గా సరిపోయిన నటుడు దగ్గుబాటి రానా. ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు. ఇటీవలే మిహికా బజాజ్ను పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన రానా తాజాగా సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్జామ్' కార్యక్రమానికి హాజరయ్యారు. తనకున్న అనారోగ్య సమస్యలను వివరిస్తూ కంటతడిపెట్టారు. చిన్నవాళ్లైనా, పెద్దవాళ్లైనా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోక తప్పదు.. కానీ దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ముందుకు సాగలేమని తెలిసి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు..
తన సహచరి భాగస్వామ్యలో సేదతీరుతున్న రానా తనను బాధించే విషయాలను సామ్తో షేర్ చేశారు. జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చిందని, పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుందని వైద్యులు వివరించినట్లు రానా చెప్పారు. బీపీ కారణంగా కిడ్నీలు కూడా పాడవుతాయి. స్ట్రోక్ హెమరేజ్ (మెదడులో నరాలు చిట్లిపోవడం) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందని వైద్యులు తెలిపినట్లు రానా పేర్కొన్నారు.
ఈ విషయాలు చెబుతూ రానా కంటతడి పెట్టుకున్నారు. వెంటనే సమంత స్పందిస్తూ.. మీ చుట్టూ జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని స్వయంగా చూశాను. మీరు నిజంగా సూపర్ హీరో అని ఆయన్ని ఊరడించే ప్రయత్నం చేసింది. కాగా, ఈ కార్యక్రమంలో రానాతోపాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com