మా అక్క చావుకి కారణం ఆయనే.. : బుల్లితెర నటి శ్రావణి తమ్ముడు
వేధింపులకు బుల్లితెర నటి బలైంది.. మౌనరాగాలు.. మనసు మమత లాంటి సీరియల్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రావణి బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని మధురానగర్లో తన నివాసంలో నిన్న రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు..
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధుర నగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్ ఫ్లోర్లో శ్రావణి ఉంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్ టాక్లో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడని తెలుస్తోంది. అక్కడ నుంచి తరచూ డబ్బులు ఇవ్వమని శ్రావణిని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని వేధింపులు భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వారు ఆరోపిస్తున్నారు. శ్రావణిని ప్రేమించినట్లు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగినట్టు బంధువులు తెలిపారు. ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
వేధింపులు అధికం కావడంతో శ్రావణి ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయినా ఆ వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రావణి మృతదేహాన్నీ పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తన అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com