శ్రావణి ఆత్మహత్య కేసులో మరో మలుపు.. సినీ నిర్మాతతో సహజీవనం చేయాలంటూ..

శ్రావణి ఆత్మహత్య కేసులో మరో మలుపు.. సినీ నిర్మాతతో సహజీవనం చేయాలంటూ..
ఓ సినీ నిర్మాతతో సహజీవనం చేయాలంటూ శ్రావణిపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె స్నేహితులు దేవరాజ్ రెడ్డి, సాయి చుట్టూనే తిరుగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగానే శ్రావణి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా సంపాదించారు. వారు మాట్లాడిన ఆడియో సంభాషణలు, టిక్ టాక్ వీడియోలు.. సాయి, శ్రావణిల మధ్య జరిగిన గొడవ సంబంధించిన సీసీటీవి ఫుటేజ్‌ని కూడా సేకరించారు. ప్రధాన నిందితుడు దేవరాజ్‌ నుంచి పోలీసులు విచారణలో కీలక సమాచారం రాబట్టారు. వీటి ఆధారంగా శ్రావణి, దేవరాజ్‌తోనూ, సాయితోనూ ప్రేమాయణం నడిపినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

టిక్ టాక్‌లో దేవరాజ్‌ రెడ్డి పరిచయం కావడంతో శ్రావణి, సాయిని దూరం పెట్టడంతో అతను ఆమెపై కోపం పెంచుకుని వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న దేవరాజ్‌, శ్రావణి లు ఎస్సార్‌నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి వెళ్లారు. అక్కడ వీరిద్దరిని చూసిన సాయి కోపంతో రగిలిపోతూ శ్రావణిపై భౌతిక దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుపడి వాగ్వాదానికి దిగాడు. ఇదంతా సీసీటీపీ పుటేజ్‌లో లభ్యమైంది. దేవరాజ్ తో కలిసి తిరుగుతున్న విషయాన్ని సాయి శ్రావణి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు శ్రావణినికొట్టి, దేవరాజ్‌ను బెదిరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో శ్రావణి.. దేవరాజ్‌కు ఫోన్‌ చేయగా ఆ గొడవను రికార్డు చేశాడు. ఆ తరవాత కొద్దిసేపటికే శ్రావణి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్‌ సంభాషణ కేసు దర్యాప్తులో కీలకంగా మారింది.

శ్రావణి తనకు దూరమవుతుందనుకున్న సాయి.. ఓ సినీ నిర్మాతతో సహాజీవనం చేయాలంటూ ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.ఈ కేసులో సాయితోపాటు సినీ నిర్మాత పాత్ర ఏమేరకు ఉందనే విషయాన్ని రాబట్టేందుకు పోలీసులు ఇవాళ వారిద్దని విచారించనున్నారు. మరోవైపు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్‌రెడ్డి వేధింపులే కారణమని సాయి ఆరోపిస్తున్నాడు. ఒక పథకం ప్రకారమే దేవరాజ్‌ తనవద్ద వీడియోలు, ఆడియో రికార్డింగ్‌లు పెట్టుకొని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ తమను ఇరికించాలని చూస్తున్నాడని సాయి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అయితే టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన దేవరాజ్‌తో సన్నిహితంగా ఉన్న శ్రావణి, అతడిపై ప్రేమతో ఓ సెల్ఫీ వీడియోను తీసుకోవడమే వీరి మధ్య వివాదాలకు కారణమైందని తెలుస్తోంది. అతడితో కలిసి దిగిన ఆ వీడియోను కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది. ఆ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు దేవరాజ్‌పై ఆగ్రహంతో రగిలిపోయారు. పలుమార్లు దేవరాజ్‌ కూడా శ్రావణి కుటుంబ సభ్యులను బెదిరించాడు. అవసరమైతే శ్రావణిని రోడ్డుపైకి ఈడుస్తా అంటూ బెదిరించాడు.



Tags

Read MoreRead Less
Next Story