మట్టిని ముట్టుకోవడం అసహ్యం.. నాలాంటి స్వార్థపరులు..: వర్మ
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ముందుకు తీసుకెళుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రామ్ చరణ్.. ఇటీవల తన ఇంట్లో మొక్కలు నాటారు. అనంతరం ఈ ఛాలెంజ్కు ఎస్.ఎస్.రాజమౌళి, RRR టీమ్ను నామినేట్ చేశారు.
రామ్ చరణ్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన రాజమౌళి, RRR టీమ్ సభ్యులు బుధవారం సామూహికంగా మొక్కలు నాటారు. అయితే, రాజమౌళి తదనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వివివినాయక్, పూరీ జగన్నాథ్కు విసిరారు. ఈ మేరకు రాజమౌళి ట్వీట్ చేశారు. దానికి వర్మ వెంటనే తనదైన శైలిలో స్పందించారు. తనకు మట్టిని మట్టుకోవడం ఇష్టం ఉండదని, అసహ్యమని కాబట్టి మొక్కలు నాటలేనని చెప్పారు.
రాజమౌళిగారు.. పచ్చదనానికి, సవాళ్లకు నేను దూరం. మట్టిని ముట్టుకోవడమంటే నాకు అసహ్యం. నాకన్నా గొప్ప వ్యక్తి మొక్కలు నాటితే వాటికి గౌరవం. నాలాంటి స్వార్థపరుడు మొక్కలు నాటకూడదు.. మీకు, మీ మొక్కలకి మంచి జరగాలని కోరుకుంటున్నా అని వర్మ తన ట్వీట్లో పేర్కొన్నారు. వర్మ నుంచి ఇలాంటి సమాధానమే ఊహించామని నెటిజన్స్ అంటున్నారు.. మాములుగా మాట్లాడితే ఆయన రాంగోపాల్ వర్మ ఎలా అవుతారు.. మాట్లాడినా, సినిమా తీసినా ఏదో ఒక కాంట్రావర్సీ ఉండాల్సిందే.. నలుగురి నోళ్లలో నానాల్సిందే.. లేకపోతే ఆయనకు నిద్ర పట్టదు సుమా అని సోషల్ మీడియా ద్వారా ఆయనపై కామెంట్లు విసురుతున్నారు.
Sir @ssrajamouli I am neither into green nor into challenges and I hate touching mud ..The plants deserve a much better person and not a selfish B like me ..Wish u and ur plants all the best 🙏 https://t.co/xusQ1a1ftR
— Ram Gopal Varma (@RGVzoomin) November 11, 2020
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com