టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మళ్లీ విచారణ మొదలు.. 12 కేసులకు గాను 8 కేసులల్లో ఛార్జ్షీట్ దాఖలు..!
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై మళ్లీ విచారణ మొదలు కానుంది. ఈ కేసుకు సంబంధించి అభియోగ పత్రాలను కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత సినీ తారల డ్రగ్స్ కేసుపై మళ్లీ విచారణ మొదలవనుంది. ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసింది సిట్. ఈ కేసులో 30 మందిని అరెస్టు చేశారు, మరో 27 మందిని విచారించారు. 12 కేసులకు గాను 8 కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణకు హాజరైన వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించి రిపోర్ట్ తయారుచేశారు. ఈ కేసును మొత్తం 60 మంది అధికారులు విచారణ చేశారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఛార్జ్షీట్లో తెలిపారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం.. రిపోర్టును ఆమోదించడంతో త్వరలోనే మళ్లీ న్యాయ విచారణ ప్రారంభం కానుంది.
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సెన్సేషన్ సృష్టించిది. డ్రగ్స్ సరఫరాచేస్తున్న కెల్విన్, వహాబ్, ఖుద్దూస్ను పట్టుకుని విచారించగా.. తాము సినిమా యాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిట్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురిని సిట్ విచారించింది. హీరో రవితేజ, రవితేజ సోదరుడు భరత్, రవితేజ డ్రైవర్తో పాటు హీరోయిన్ ఛార్మి, తరుణ్, నవదీప్, తనీష్, ముమైత్ ఖాన్తో పాటు పలువురు సినీ ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారించారు. అయితే, డ్రగ్స్ కేసులో 11 మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు.
2017 జులై 2వ తేదీన పోలీసులు డ్రగ్స్ కేసులు నమోదు చేశారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ న్యాయ విచారణ ప్రారంభమవుతోంది. ఈ కేసులో చాలా మంది సినీ ప్రముఖులకు క్లీన్చిట్ ఇవ్వడంతో.. నిందితులు చెప్పినట్టు ఎవరికి డ్రగ్స్ ఇచ్చారో తేలాల్సి ఉంది. నిజంగానే టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com