అమెరికాలో కాల్పుల కలకలం..ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి
అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్లోని ఓ నివాసంలో పొరుగింటి వారిపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారు. ఇంటి ఆవరణలో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పొరుగింటివారు అడ్డు చెప్పారు. ఇంట్లో చిన్న పిల్లలు నిద్రిస్తున్నారని, శబ్దాలకు వారు భయపడతారని.. కాల్పులు జరపవద్దని కోరారు. ఈ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన దుండగుడు పక్కింట్లోకి చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన సమయంలో ఆ ఇంట్లో 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దుండగుడు ఏఆర్-15 తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులంతా 8 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సువారే. వీరిని తల భాగంలోనే తుపాకీతో కాల్చినట్లు కనిపిస్తోంది. ఈఘటనలో కాల్పులకు గురైన ఇద్దరు మహిళలు చిన్నారులపై పడి ఉండిపోవడంతో.. ఆ చిన్నారులిద్దరికీ ప్రాణహాని తప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com