Flight crash: ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన విమానం మనది కాదు.. స్పష్టం చేసిన డీజీసీఏ

Flight crash: ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన  విమానం మనది కాదు.. స్పష్టం చేసిన డీజీసీఏ
అది మొరాకో రిజస్టర్డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ అని వెల్లడి

ఆదివారం ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌లో కుప్పకూలిన ప్రయాణికుల విమానం భారత్‌కు చెందినది కాదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ స్పష్టం చేసింది. అది మొరాకో రిజస్టర్డ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ అని, చిన్న విమానమని తెలిపింది. బదాక్షన్‌ ప్రావిన్స్‌లో చిన్న విమానం కూలిందని ఆఫ్ఘన్‌ సమాచార శాఖ స్పష్టం చేసింది. కాగా, ముందుగా ఆఫ్ఘనిస్థాన్ కూలింది భారత విమానమేనని వార్తలు ప్రసారమయ్యాయి. ఆప్ఘనిస్థాన్‌కు చెందిన ఓ వార్తా సంస్థ భారత విమానం తోప్‌ఖానా పర్వతాల్లో కూలిందనే వార్తను ప్రసారం చేయడంతో.. దేశంలోని మీడియా సంస్థలన్నింటిలో ఆదే వార్త మార్మోగింది. చివరకు అది భారత విమానం కాదని డీజీసీఏ తేల్చేసింది.

బాదక్షన్ ప్రావిన్స్‌లోని కురాన్-ముంజన్, జిబాక్ జిల్లాలతో పాటు తోప్‌ఖానా పర్వతాల సమీపంలో భారతీయ ప్రయాణీకుల విమానం కూలిపోయిందని బదాక్షన్ సమాచార, సంస్కృతి విభాగం అధిపతి జబిహుల్లా అమిరి తెలిపారు. ఘటనపై విచారణకు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపినట్లు ఆయన చెప్పారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం విమానం కూలిపోయిందని టోలో న్యూస్ పేర్కొంది.

అయితే, ఈ ప్రమాదంపై స్పందించిన డీజీసీఏ.. భారతీయ విమానం ఏదీ కూలిపోలేదని ధ్రువీకరించింది. మొరాకో రిజిస్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయిందని, భారతీయ విమానం కాదని స్పష్టం చేసింది. అది చిన్న విమానమని పేర్కొంది. కానీ, విమానంలో ఎంత మంది ఉన్నారు.. ప్రాణనష్ఠం గురించి మాత్రం అఫ్గన్ అధికారులు ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story