America : పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం, మూడు కంపెనీలపై అమెరికా నిషేధం
మూడు చైనా కంపెనీలను, ఓ బెలాసర్ కంపెనీపై అమెరికా నిషేధించింది. పాకిస్థాన్కు బాలిస్టిక్ క్షిపణి విడిభాగాలను అందించినందుకు ఆయా కంపెనీలపై బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. నిషేధం విధించిన కంపెనీల జాబితాలో చైనాకు చెందిన లాంగ్డే టెక్నాలజీ డెవలప్మెంట్ కీ, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్, గ్రాన్పెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఉన్నాయి. మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ ఆఫ్ బెలారస్ ఉన్నది.
ఈ నాలుగు కంపెనీలు పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యకలాపాలకు సహాయం చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. విధ్వంసక ఆయుధాల విస్తరణలో ఈ కంపెనీలు పాల్గొన్నట్లు గుర్తించామని, దాంతో చర్యలు తీసుకున్నట్లు మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. బెలారస్ కంపెనీ మిన్స్క్ వీల్ ట్రాక్టర్ ప్లాంట్ కంపెనీ పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం కోసం స్పెషల్ వెహికిల్ ఛాసిస్ను అందజేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దీన్ని బాలిస్టిక్ క్షిపణుల్లో ఉపయోగిస్తారన్నారు. చైనా కంపెనీ గ్రాన్పెక్ట్ కంపెనీ లిమిటెడ్ ఫిలమెంట్ వైండింగ్ మెషీన్లను అందజేస్తోందని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.
వీటిని రాకెట్ మోటార్లో ఉపయోగిస్తారు. టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కంపెనీ లిమిటెడ్ వెల్డింగ్ సంబంధిత ఉపకరణాలు, యాక్సిలరేటర్ సిస్టమ్లను సరఫరా చేస్తుంది. టియాంజిన్ కంపెనీకి చైనా సైన్యంతో కూడా సంబంధాలున్నట్లు తేలింది. నిషేధం కింద అమెరికాలోని ఈ కంపెనీల ఆస్తులను జప్తు చేయనున్నారు. కంపెనీ యజమాని, ప్రధాన వాటాదారులపై సైతం నిషేధం ఉంటుంది.
తైవాన్కు ఆయుధ సాయం చేశాయన్న నెపంతో అమెరికాకు చెందిన రెండు రక్షణ సంస్థలపై బీజింగ్ ఇటీవల ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్, జనరల్ డైనమిక్స్ ల్యాండ్ సిస్టమ్స్కు సంబంధించిన చైనాలోని ఆస్తులను స్తంభింపజేసింది. దీంతోపాటు ఆయా కంపెనీల మేనేజ్మెంట్ను దేశంలోకి రాకుండా అడ్డుకట్ట వేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com