Russian attack: ఉక్రెయిన్‌ పై రష్యా రాకెట్‌ దాడి.. 49 మంది మృతి

Russian attack: ఉక్రెయిన్‌ పై రష్యా రాకెట్‌ దాడి.. 49 మంది మృతి
పుతిన్‌ పైశాచికత్వం

తమ దేశంపై గురువారం రష్యా చేసిన రాకెట్‌ దాడిలో 50 మంది పౌరులు దుర్మరణం చెందారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. హ్రోజా గ్రామంలో ఓ దుకాణం, కేఫ్‌పై రష్యా దాడి చేసినట్టు వెల్లడించారు. ఈ దాడిని ఉద్దేశపూర్వక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని ఆయన గురువారం స్పెయిన్‌లో జరిగిన యూరోపియన్‌ నేతల సమావేశంలో పశ్చిమ దేశాలను కోరారు. దీనిపై ఆగ్రహంతోనే రష్యా రాకెట్‌ దాడికి పాల్పడిందని భావిస్తున్నారు.


ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలై ఏడాది దాటిపోయినా ఇంకా పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకీ ఉక్రెయిన్ లో పరిస్ధితులు దిగజారుతున్నాయి. అయినా సరే సర్వ శక్తులు ఒడ్డి ఉక్రెయిన్ పోరాడుతూనే ఉంది. రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే దీనావస్ధలోకి జారుకుంటున్న ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు సాయం చేస్తున్నా కోలుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మరోసారి ఉన్నట్లుండి ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఈ ఒక్క నగరంలోనే 50 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్‌లోని ఈశాన్య ఖార్కివ్ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఉన్న దుకాణంపై రష్యా చేసిన దాడి గురువారం డజన్ల కొద్దీ మంది ప్రాణాలు తీసింది. ఉక్రేనియన్ అధికారులు మాట్లాడుతూ కొన్ని నెలల్లో పౌరులపై జరిగిన ఘోరమైన దాడులలో ఇది ఒకటిగా అభివర్ణించారు. ఖార్కివ్ ప్రాంతంలో ఫ్రంట్ లైన్‌కు నైరుతి దిశలో దాదాపు 23 మైళ్ల దూరంలో ఉన్న హ్రోజా గ్రామంలో జరిగిన దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఖండించారు.

ఇది నిస్సందేహంగా ఓ క్రూరమైన రష్యా నేరమని జెలెన్ స్కీ తెలిపారు. రష్యా ఉగ్రవాదం అరికట్టాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. దాడిలో 50 మంది మరణించారని తెలిపింది. ఈ దాడిలో కనీసం ఏడుగురు గాయపడ్డారని వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత ఈ దాడి జరిగిందని ప్రకటించింది.



ఉక్రెయిన్ అధికారులు ఇవాళ రష్యా దాడికి సంబంధించిన మృతదేహాల ఫోటోల్ని కూడా విడుదల చేశారు. అలాగే కార్మికులు పేరుకుపోయిన శిధిలాల కుప్పల లోంచి మృతదేహాలు బయటకి తీస్తున్నట్టు గా కూడా ఇందులో కనిపించింది.. ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ గ్రామంలోని శిథిలాల కింద మరింతమంది ప్రజలు చిక్కుకుపోవచ్చని హెచ్చరించింది. ఇక్కడ మొత్తం 300 మంది నివసిస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ దాడులపై రష్యా ఇంతవరకు స్పందించలేదు.


Tags

Read MoreRead Less
Next Story