Hardeep Singh Nijjar నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌:

నిందితులు భారత్‌ హిట్‌స్వాడ్‌లో సభ్యులని చెబుతున్న స్థానిక మీడియా

ఖలిస్థాన్‌ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారత పౌరులను కెనడా పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నిజ్జర్‌ హత్య కోసం భారత్‌ ఏర్పాటుచేసినట్టుగా చెబుతున్న హిట్‌స్వాడ్‌లో వీరు సభ్యులని అక్కడి మీడియా నివేదికలు వెల్లడించాయి. గత ఏడాది జూన్‌ 18న సాయంత్రం సర్రేలోని సిక్కు గురుద్వార్‌లో ప్రార్థనలు చేసి వస్తున్న నిజ్జర్‌ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

నిజ్జర్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందని, భారత్‌ ఏజెంట్లే అతడిని హతమార్చారంటూ గత ఏడాది కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించిన క్రమంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెనడా ఆరోపణలు అర్థం లేనివి, ప్రేరేపితమైనవని భారత్‌ ఖండించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్న రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు నిజ్జర్‌ హత్యకు కుట్ర పన్నిన హిట్‌ స్కాడ్‌ సభ్యులను గుర్తించి కొందరిని శుక్రవారం అరెస్ట్‌ చేసినట్టు కెనడా బీబీసీ ప్రకటించింది. నిందితులను కొన్ని నెలల క్రితమే గుర్తించినా వారి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలు సేకరించినట్టు తెలిపింది.

ఇక, టొరొంటోలో జరిగిన ఖల్సా డే కార్యక్రమంలోనూ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నిజ్జర్ హత్య గురించి స్పందించారు. ఈ హత్య కెనడా అంతర్గత భద్రతకు ఓ సవాలన్నారు. నిజ్జర్ హత్య వెనక భారతకు చెందిన RAW ఏజెంట్ల హస్తం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, కెనడా ప్రధాని ట్రూడో కామెంట్స్ పై భారత్ ఘాటుగా స్పందించింది. ట్రూడోకు ఈలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదన్నారు. కెనడాలో వేర్పాటువాదానికి, హింసకు, తీవ్రవాదానికి రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉందని కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌దీప్ జైశ్వాల్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, భారత్‌లోని కెనడా డిప్యూటీ హైకమిషనర్‌ను పిలిపించుకుని కేంద్ర ప్రభుత్వం తన నిరసన వ్యక్తం చేశారు. జస్టిస్ ట్రూడో హాజరైన కార్యక్రమంలో ఖలిస్థానీ అనుకూల నినాదాలు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story