CHINA: హౌతీలకు చైనా పరోక్ష హెచ్చరికలు

CHINA: హౌతీలకు చైనా పరోక్ష  హెచ్చరికలు
ఇరాన్‌ను హెచ్చరించిన చైనా... ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధం!

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులను అడ్డుకునేందుకు అమెరికా, బ్రిటన్‌లు తీవ్రంగా యత్నిస్తుండగా ఈ జాబితాలోకి పరోక్షంగా చైనా చేరింది. యెమెన్‌లోని హౌతీలతో పాటు పలు మిలింట్ గ్రూప్‌లను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌ను చైనా హెచ్చరించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నౌకలపై దాడులు ఆపకపోతే ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు తెంచుకునేందుకు డ్రాగన్ సిద్ధపడినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాల కోసం కాకపోయినా తన స్వలాభం కోసం చైనా ఈ మేరకు యోచిస్తున్నట్టు సమాచారం.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో గాజాకు మద్దతు ఇస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో కొన్ని రోజులుగా వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్నారు. హౌతీలను నియంత్రించేందుకు అమెరికా, బ్రిటన్‌ తీవ్రంగా యత్రిస్తున్నాయి. వారి స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇన్ని రోజులు హౌతీల అంశాన్ని తేలికగా తీసుకున్న చైనా తమ వాణిజ్యంపై హౌతీ దాడులు ప్రభావం చూపుతుండటంతో చర్యలు తీసుకునేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హౌతీలను ప్రోత్సహిస్తున్న ఇరాన్‌తో ఇటీవల బీజింగ్, టెహ్రాన్‌లలో జరిగిన పలు సమావేశాల్లో వాణిజ్య నౌకలపై దాడుల అంశం వచ్చినట్టు ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా, ఐరోపాలకు గల్ఫ్-ఆఫ్‌-ఎడెన్‌ కీలక వాణిజ్య మార్గం. ఈ మార్గం నుంచే చైనా నౌకలు విస్తృతంగా సరకు రవాణా చేస్తుంటాయి. అంతర్జాతీయ సాగర వాణిజ్యంలో 12 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుంది.

చమురు, ఆహార ధాన్యాలు, సహజవాయువు దగ్గర నుంచి బొమ్మలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల వరకూ ఈ మార్గంలో రవాణా అవుతుంటాయి. హౌతీల దాడులతో ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్‌ కంపెనీలు ఈ మార్గాన్ని వీడుతున్నాయి. షిప్పింగ్ , బీమా ఖర్చులు భారీగా పెరగడంతో డ్రాగన్‌కు నష్టం వాటిల్లుతోంది . దీంతో హౌతీ రెబెన్స్‌కు మద్దతుఇస్తున్న ఇరాన్‌పై చైనా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య విశ్లేషణ సంస్థ K.P.L.E.R ట్యాంకర్ ట్రాకింగ్ డేటా ప్రకారం గతేడాది ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో 90 శాతం చైనాకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇరాన్‌పై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించిన క్రమంలో....డ్రాగన్ దేశం మాత్రం భారీగా డిస్కౌంట్లు పొంది లాభపడింది. తాజాగా పరిస్థితులు మారడంతో ఎర్రసముద్రంలోని పరిణామాలపై ఆ దేశ విదేశాంగ మంత్రి "వ్యాంగ్ యీ" పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్-ఆఫ్-ఎడెన్‌లో దాడులు చేస్తున్న వారు ఆపాలని.....ఇరాన్, హౌతీల పేరు చెప్పకుండా హెచ్చరించారు. నౌక దాడులపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ.... మధ్యప్రాచ్య దేశాలకు చైనా నిజాయితీగల స్నేహితుడనీ...ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఉమ్మడి అభివృద్ధి ,శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నట్టు చెప్పింది.

Tags

Read MoreRead Less
Next Story