PM Modi : మాస్కో ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ
రష్యా రాధాని మాస్కోలోని క్రాకస్ సిటీ హాల్పై జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు.
మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన ఐదుగురు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 60 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్నిక్ సంగీత కార్యక్రమంలో ఈ దాడి చోటుచేసుకున్నది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు బాధ్యతవహిస్తున్న ఐఎస్ఐఎస్ ప్రకటించింది.
ఒక్కసారిగా జరిగిన ఉగ్రదాడితో భయాందోళనలకు గురైన ప్రజలు హాలులో చైర్ల కింద దాక్కున్నారు. భవనంలో నుంచి బయటకు వస్తున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల దాడితో కన్సర్ట్ హాల్లో మంటలు చెలరేగాయి. ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో భారీఎత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ దాడిలో ఐదురుగు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా వారిలో ఒకరు పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు సంఘీభావం తెలియజేశారు.
మరోవైపు ఈ ఉగ్ర ఘటనపై తాము ముందుగానే రష్యాను హెచ్చరించినట్టు అమెరికా పేర్కొంది. మ్యూజిక్ కన్సర్ట్ వంటి పెద్ద ఎత్తున జనం గుమికూడే ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఈ నెల మొదట్లోనే రష్యాను హెచ్చరించినట్టు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రీన్ వాట్సన్ తెలిపారు.
‘డ్యూటీ టు వార్న్’ విధానంలో భాగంగా బైడెన్ ప్రభుత్వం తమకు అందే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకుంటుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కిడ్నాపులు, ఎక్కువమందిని హత్యచేయాలన్న పథకాలపై శీఘ్రంగా స్పందించి ఆయా దేశాలకు సమాచారం అందిస్తుందని వివరించారు. అమెరికా ముందుగానే హెచ్చరించినప్పటికీ పుతిన్ ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com