ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం... మాస్కులు ధరించాలనే నిబంధన ఎత్తివేత..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు మాస్కు లేకుండానే బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగవచ్చు. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న గత ఆదేశాలను ప్రభుత్వం ఆదివారమే రద్దు చేసింది.
ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది. దేశంలోని సగం మందికిపైగా వ్యాక్సినేషన్ పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాఠశాలలను పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ ఎంతో ముందుచూపుతో ప్రజలకు టీకాలు అందించి.. మహమ్మారిని ఎదుర్కోవడంలో పైచేయి సాధించిందని న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించింది.
ఇక ఇజ్రాయెల్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఒక్కడోసు టీకా తీసుకున్నవారు 60 శాతం మంది కాగా, రెండు డోసులు వేయించుకున్నవారు 56 శాతం మంది ఉన్నారు. ఇక్కడ ఫైజర్, బయోఎన్టెక్ టీకాలను అందిస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ ను 16 ఏళ్లలోపు వారిని మినహాయించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికి తాము మార్గదర్శకులమయ్యాం అని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతోషం వ్యక్తంచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com