అమెరికా పౌరులంతా తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలన్న నిబంధనేమీ ఉండబోదు : జో బైడెన్
అమెరికా పౌరులంతా తప్పనిసరిగా కరోనా టీకా తీసుకోవాలన్న నిబంధనేమీ ఉండబోదని అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ ప్రకటించారు. తాను మాత్రం బహిరంగంగా అందరి ముందు టీకా తీసుకుంటానని తెలిపారు. అయితే.. మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే మాస్కు ధరించడం అత్యవసరమని.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. టీకా అందరికీ ఉచితంగా అందజేయడంతో పాటు తర్వాత ఎటువంటి సమస్యలు తలెత్తినా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. మాస్కు ధరించడం, టీకా కూడా అందుబాటులోకి రానుండటంతో మరణాలు, కొత్త కేసులు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తనతో పాటు ముగ్గురు మాజీ అధ్యక్షులు బహిరంగంగా టీకా తీసుకోనున్నారని వెల్లడించారు. ఎవరిలోనైనా అనుమానాలుంటే తొలగిపోతాయని తెలిపారు. కరోనా మహమ్మారితో ప్రభావితమైన ప్రజలు, వ్యాపారాలకు దన్నుగా నిలిచేందుకు 900 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి ఆమోదం తెలపాలని కాంగ్రెస్ను బైడెన్ విజ్ఞప్తి చేశారు. ఇక.. తాను బాధ్యతలు స్వీకరించబోయే రోజు జనవరి 20న వేడుక వర్చువల్గా జరిగే అవకాశమే ఎక్కువగా ఉందని తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com