Pm modi in Egypt: నేతలతో చర్చలు- స్థానికులతో ముచ్చట్లు
ఈజిప్టు దేశ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్ట్ ప్రధాని మోస్తఫా మడ్ బౌలితో కలిసి భారత్ తో వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఈజిప్ట్ అధ్యక్షుడు మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్ లో పర్యటిస్తున్నారు. 26 ఏళ్లలో భారత ప్రధాని ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.
నాలుగు రోజుల అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ ఈజిప్టులో రెండు రోజుల పర్యటనకు గాను కైరో చేరుకున్నారు. కైరో విమానాశ్రయంలో మోదీకి ఈజిప్టు ప్రధానమంత్రి మొస్తాఫా మద్బౌలీ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక దళాల గౌరవ వందనం స్వీకరించారు.
ఆయనకు బస ఏర్పాటు చేసిన హోటల్ వద్ద..భారత సంతతి ప్రజలు త్రివర్ణ పతాకాలతో చేబూని, మోదీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. చీర ధరించిన ఈజిప్టు మహిళ ఒకరు హిందీ సినిమా షోలే లోని ‘యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే’పాట పాడుతూ మోదీకి స్వాగతం పలికారు. ఆ గీతం వినగానే ఆశ్చర్యానికి లోనైన మోదీ ఆమెను ప్రశంసించారు.
అనంతరం ప్రవాస భారతీయులతో సంభాషించిన మోదీ బోహ్రో కమ్యూనిటీ సభ్యులను కూడా కలిశారు.
ప్రధాని మద్బౌలీ కేబినెట్ సభ్యులతో మోదీ రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తి డాక్టర్ షౌకి ఇబ్రహీం అబ్దెల్ కరీం అల్లాం సహా పలువురు ప్రముఖులతో ప్రధాని చర్చలు జరి పారు. వాణిజ్యము, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, డిజిటల్ చెల్లింపు ప్లాట్ ఫామ్, ఫార్మా లతో పాటుగా ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇక ఆదివారం ప్రధాని మోదీ కైరోలోని చారిత్రక అల్–హకీం మసీదును సందర్శిస్తారని ఈజిప్టులో భారత్ రాయబారి తెలిపారు. భారత్లోని దావూది బోహ్రా తెగ ముస్లింలు ఈజిప్టుకు చెందిన వారే. వీరితో మోడీకి సత్ సంబంధాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో ఈజిప్టును పాలించిన ఫతిమిద్ వంశస్తులు అల్ హకీం మసీదును నిర్మించారు. బోహ్రా ముస్లింలు, ఈజిప్టు ప్రభుత్వంతో కలిసి చేపట్టిన మసీదు పునరుద్ధరణ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com