Nigeria : కిడ్నాప్ గురైన 300 మంది విద్యార్థుల విడుదల
ఇటీవల ఆఫ్రికాలోని నైజీరియాలో దాదాపు 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కావడం సంచలనం రేపింది. దాదాపు రెండు వారాలా తర్వాత ఈ వ్యవహారం సుఖాంతమైంది. విద్యార్థులను అపహరించిన కిడ్నాపర్లు వారిని సురక్షితంగా విడిచిపెట్టారని అధికారులు తెలిపారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు. అలాగే కిడ్నాపైన పిల్లను సురక్షితంగా వెనక్కితీసుకొచ్చేందుకు నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు చొరవ చూపినట్లు తెలిపారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మార్చి 7వ తేదీన కడునా రాష్ట్రంలోని కురిగా అనే పట్టణంలో ఓ పాఠశాలకు అకస్మాత్తుగా సాయుధులు వచ్చారు. ఆ తర్వాత 300 పిల్లల్ని కిడ్నాప్ చేసి వారి వెంట తీసుకెళ్లారు. దుండగులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. అయితే ఆ సాయుధులు.. విద్యార్థులను తమతో పాటు సమీపంలో ఉన్న అడవులకు తీసుకుపోయారు. చిన్నారుల్లో 12 ఏళ్ల లోపు ఉన్నవారే దాదాపు 100 మంది వరకు ఉన్నారు. వాళ్లని విడుదల చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని లేకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు.
కుడునా గవర్నర్ టినుబు తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా ఏజెన్సీలు తీసుకున్న వ్యూహాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నైజీరియా భద్రతా సలహాదారు దగ్గరుండి ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారని కొనియాడారు. వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు.
ఉత్తర నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్నా.. ఇంత భారీసంఖ్యలో జరగడం కలకలం రేకెత్తించింది. ఇటీవల ఈ కిడ్నాప్లు దేశంలోని వాయువ్య, సెంట్రల్ ప్రాంతాలకు కూడా పాకాయి. సాయుధ దుండుగులు నగదు కోసం గ్రామస్థులను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు 1,400 మంది విద్యార్థులు కిడ్నాప్ అయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com