Pakistan: జోరుగా కిడ్నీల దందా.. 328 మంది కిడ్నీలు మాయం

Pakistan: జోరుగా కిడ్నీల దందా..  328 మంది కిడ్నీలు మాయం
పాకిస్థాన్‌లో కిడ్నీలు దోచుకుంటున్న ముఠా ఆటకట్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ అవయవాల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు. ఒక బాధితుడు తమవద్దకు వచ్చి కొందరు తనను బలవంతంగా ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించుకోమని వేధించారని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కూపీ మొత్తం లాగారు. ఊరు పేరు లేని ఓ డాక్టర్ ముఠాను ఏర్పరిచి.. కిడ్నీలు తీసి అమ్ముకుంటున్నట్టుగా తెలుసుకొని పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ధనికుల అవసరానికి తగ్గట్టుగా కిడ్నీలను సమకూర్చే క్రమంలో ఈ ముఠా వందల మందికి సర్జరీలు నిర్వహించి వారి కిడ్నీలను తొలగించారు. డాక్టర్ ఫవాద్ నేతృత్వంలో సాగుతున్న ఈ దందా గురించిన వివరాలు అక్కడి ముఖ్యమంత్రి మొహ్‌సిన్ నఖ్‌వీ బయటపెట్టారు.

డబ్బులు ఉన్న వారికి కావాల్సిన కిడ్నీలను అందించేందుకు పేదలు, సామాన్యులకు డబ్బుల ఆశ చూపించి, బెదిరించి బలవంతంగా ఆపరేషన్లు చేసి కిడ్నీలను తీసుకుంటున్న ఘటనలు వెలుగు చూశాయి. కిడ్నీ తీసుకునేందుకు ప్రయత్నించగా.. తప్పించుకున్న ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పంజాబ్ ప్రావిన్స్ పోలీసులకు దిమ్మ తిరిగిపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఫవాద్ అనే ఓ అనామక డాక్టర్ ఆధ్వర్యంలో ఈ కిడ్నీ రాకెట్ దందా సాగుతోందని పోలీసులు గుర్తించారు.


ఇప్పటివరకు ఈ డాక్టర్ మొత్తం 328 సర్జరీలు నిర్వహించి సుమారుగా 35 వేల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.28.27 లక్షలు సంపాదించినట్లు గుర్తించారు. పేదలు, అమాయకులు, డబ్బులు అవసరం ఉన్నవారిని గుర్తించి.. వారికి నమ్మించి, బెదిరించి.. ఆపరేషన్లు చేసి వారి కిడ్నీలను తీసుకున్నట్లు తెలిపారు. ఈ కిడ్నీ రాకెట్ ముఠాలో ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో ఉన్న ఓ కారు మెకానిక్ బాధితులకు మత్తు మందు ఇవ్వడంలో సహకరించేవాడు.

బాధితులను లాహోర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా ఆపరేషన్లు చేసేవారు. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ఎలాంటి చట్టాలు లేకపోవడంతో నిందితులు ఆ ప్రాంతాన్ని ఎంచుకుని బాధితులను అక్కడికి తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు సర్జరీలు నిర్వర్తించారని పేర్కొన్నారు. అయితే ఇలా ఆ ముఠా నిర్వహించిన ఆపరేషన్లు వికటించి ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. అయితే ఇదే కిడ్నీ రాకెట్ కేసులో నిందితుడు డాక్టర్ ఫవాద్‌.. గతంలో 5 సార్లు అరెస్ట్ అయినట్లు గుర్తించారు. ఆ సమయంలో చట్టంలో ఉన్న లొసుగులతో సులువుగా బయటికి వచ్చినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story