Paris Olympics-2024: వెలిగిన ఒలింపిక్స్‌ క్రీడాజ్యోతి

Paris Olympics-2024:  వెలిగిన ఒలింపిక్స్‌ క్రీడాజ్యోతి
వివిధ దేశాల గుండా ప్రయాణించి పారిస్ చేరుకోనున్న ఒలింపిక్ జ్యోతి

పారిస్ ఒలింపిక్స్-2024 కోసం పశ్చిమ గ్రీస్ లోని ఒలింపియా ప్రాంతంలో లాంఛనంగా జ్యోతిని వెలిగించారు. ఇక్కడి పురాతన స్టేడియంలో గ్రీకు సంప్రదాయం ప్రకారం ఒలిపింక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన పూజారి పాత్రను పోషించిన మేరీ మినా పురాతన క్రీడల ప్రదేశంలో ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు. ఈ ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలనం సందర్భంగా మహిళా మతగురువులు చేసిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది.

"సూర్య భగవానుడా (అపోలో గాడ్)... పారిస్ ఒలింపిక్స్ జ్యోతిని మండించేందుకు మీ కిరణాలను పంపండి... ఇక, సర్వశక్తిమంతుడైన జ్యూస్... భూమిపై ఉన్న ప్రజలందరికీ శాంతిని, పవిత్ర క్రీడల విజేతలకు ఆశీస్సులు అందజేయండి" అంటూ ఈ సందర్భంగా మహిళా మతగురువులు ప్రార్థించారు.

క్రీస్తు పూర్వం 776వ సంవత్సరంలో ఒలింపియా గ్రామంలో పుట్టిన పురాతన క్రీడా పోటీలే కాలక్రమంలో ఒలింపిక్స్ గా విశ్వవ్యాప్తం అయ్యాయి. ఇక్కడి వెలిగించిన ఒలింపిక్ జ్యోతి అనేక దేశాల గుండా ప్రయాణం చేసి ఈ ఏడాది విశ్వ క్రీడా సంరంభానికి ఆతిథ్యమిస్తున్న పారిస్ నగరానికి చేరుకుంటుంది. కాగా, తొలిగా ఈ జ్యోతిని అందుకునే అవకాశం గ్రీస్ గోల్డ్ మెడల్ రోయర్ స్టెఫానోస్ ఎన్ టోస్కాస్ కు లభించింది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ ఏడాది జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. 32 క్రీడాంశాల్లో 329 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఈ భారీ క్రీడోత్సవాల్లో 10,500 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.

అయితే ఒలింపిక్స్‌ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవాన్ని స్టేడియంలో కాకుండా ఆరుబయట నిర్వహించేందుకు పారిస్‌ సిద్ధమైంది. ఫ్రాన్స్‌లో ప్రవహించే సెన్‌ నది ఈ వేడుకలకు వేదిక కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ వేదికను మారుస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నదిలోనే నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. నదిలో 6 కిలోమీటర్ల దూరం పాటు సుమారు 10,500 మంది అథ్లెట్లు పడవల్లో పరేడ్‌ నిర్వహించనున్నారు. నదికి రెండు వైపుల ఉండి జులై 26న జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు మొదట 6 లక్షల మంది ప్రజలను అనుమతించాలని అనుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story