Peru : లోయలో పడిన బస్సు, 25 మంది మృతి

Peru : లోయలో పడిన బస్సు,  25 మంది మృతి
34 మందికి తీవ్ర గాయాలు

దక్షిణ అమెరికా దేశమైన పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి 200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులోని 25 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది తీవ్రంగా గాయలవ్వగా.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటాకు వెళ్లేదారిలో బస్సు అదుపుతప్పి 200 మీటర్ల (656 అడుగుల) లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మృతులు, క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే గత నెల ఇదే ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఇప్పుడు అదే స్థలంలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. పెరూవైన్ జాతీయ రహదార్లపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, అతివేగం, రహదారి దెబ్బతినడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story