Israel- Hamas War: గాజా ప్రజలకు 3 గంటలు డెడ్‌లైన్ పెంపు

Israel- Hamas War: గాజా ప్రజలకు  3 గంటలు డెడ్‌లైన్ పెంపు
గ్రౌండ్ ఆపరేషన్‌కి సిద్ధమవుతున్న ఇజ్రాయిల్

హమాస్ మిలిటెంట్లను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ఉత్తర గాజాలో భూతల దాడులు చేస్తోంది. ఇందుకోసం త్రివిధ దళాలను రంగంలోకి దించింది. అయితే దాడుల్లో సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు కలపెట్టవద్దని భావించిన ఇజ్రాయెల్ వారిని దక్షిణ గాజాకు వెళ్లాలని సూచించింది. ఇప్పటికే లక్షలాది మంది అక్కడి నుంచి వెళ్లిపోగా, మిగిలిన వారి కోసం ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. తరలి వెళ్లేందుకు ఇచ్చిన గడువు ముగియడం వల్ల ఇవాళ మరో 3 గంటలు పెంచింది. ఉదయం 10 నుంచి 1 గంట వరకు తాము నిర్దేశించిన సేఫ్టీ కారిడార్‌లో తరలి వెళ్లాలని ఎక్స్ వేదికగా పేర్కొంది. ఆ మార్గంలో వెళ్తే ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టం చేసింది.


మరోవైపు ఉత్తర గాజా నుంచి 24 గంటల్లో దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్‌ హెచ్చరికతో 11 లక్షల మంది ప్రజలు నానా కష్టాలు పడ్డారు. మొత్తం 40 కిలోమీటర్ల పొడవున్న గాజాలో 20 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయాల్సి ఉండగా రోడ్లు ధ్వంసం కావడం వల్ల నరకయాతన అనుభవించారు. వీటిని పరిగణలోకి తీసుకున్న ఇజ్రాయెల్ఓ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు బంధీలను రక్షణ కవచాలుగా మార్చుకుని హమాస్ మిలిటెంట్లు తప్పించుకునే ప్రమాదం ఉండటంతో ఇజ్రాయెల్ దళాలు వారిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి ప్రజలు వెళ్లకుండా హమాస్ మిలిటెంట్లు అడ్డుకుంటున్నారని... ఇంతకుముందు ఇజ్రాయెల్ కొన్ని ఫొటోలను విడుదల చేసింది.హమాస్‌కు ఇజ్రాయెల్ ఏయే ప్రాంతాల్లో దాడులు చేస్తుందో తెలుసునని అందుకే దాడులు జరిగే అవకాశం ఉన్నచోట బందీలను రక్షణ కవచంగా పెడుతోందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.


గాజాలో పలు చోట్ల మిలిటెంట్లపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ హమాస్‌కు చెందిన మరో కమాండర్‌ను చంపినట్లు తెలిపింది. ఇటీవల తమ దేశంలోని నిరిమ్‌ ప్రాంతంలో జరిపిన మారణకాండకు బాధ్యుడైన హమాస్‌ కీలక కమాండర్‌ బిలాల్‌ అల్‌ కేద్రాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్‌ వాయుసేన IAF వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను ఎక్స్‌ వేదికగా విడుదల చేసింది. బిలాల్‌తోపాటు పలువురు హమాస్‌, జిహాద్‌ ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలిపింది. నిన్న ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌ వైమానిక దళ కీలక కమాండర్‌ అబు మురద్‌ హతమయ్యాడు. ఇజ్రాయెల్‌, హమాస్‌ ఘర్షణల్లో మరణాల సంఖ్య 3 వేల 600 దాటింది.గాజాలో 2వేల 300మందికిపైగా మృత్యువాతపడగాఇజ్రాయెల్‌లో 13 వందల మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.

Tags

Read MoreRead Less
Next Story