Moscow : రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి.. 60మందికిపైగా మృతి..

Moscow : రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్రదాడి.. 60మందికిపైగా మృతి..
బాధ్యత వహించిన ఐసిస్

రష్యా రాజధాని మాస్కో సమీపంలోని ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ లో భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 60 మంది మరణించగా.. 100 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) తెలిపింది. ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఈ కన్సర్ట్ హాల్‌లో ప్రొగ్రాం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత హాల్‌లోకి ప్రవేశించిన సాయుధులు కాల్పులు జరుపుతూ, బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు.

మాస్కో పరిధిలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్ లో ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమంలో వేల మంది పాల్గొన్నారు. సంగీత కార్యక్రమం పూర్తయ్యి అందరూ బయటకు వెళ్తున్న క్రమంలో.. దుండగులు భవనంలోకి ప్రవేశించి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. భయాందోళనతో అక్కడున్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు. ఈ కాల్పుల సమయంలో హాల్ లో 5వేల మందికిపైగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరిలో అనేక మందికి తుపాకీ తూటాలు తగిలి అక్కడికక్కడే మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు.


దుండగులు కాల్పులు జరిపిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హాల్ లో చిక్కుకున్న వందలాది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో దుండగులు కాల్పులు జరపడం, పలువురు భయాందోళనతో ఘటనా స్థలం నుంచి పారిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. కాల్పులు జరిపింది ఐదుగురు దుండగులని స్థానిక పోలీసులు గుర్తించారు. అందులో ఒకరిని పట్టుకున్నారు. ఈ దాడి తామే చేసినట్లు ఐసిస్ ప్రకటించుకుంది.

మాస్కోలో ఉగ్రవాదుల దాడిలో 145 మంది వరకు గాయపడినట్లు, వారిని ఆస్పత్రికి తరలించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితుల్లో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని పేర్కొంది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ.. ప్రపంచ సమాజం మొత్తం ఈ దారుణమైన ఘటనను ఖండిస్తోంది. ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని పాకిస్థాన్, బెలారస్, టర్కీ, యూఏఈ, ఖతార్, ఉజ్బెకిస్థాన్, గ్రీస్, స్పెయిన్, మాంటెనెగ్రో, మాల్టా, చెక్ రిపబ్లిక్ వంటి దేశాలు ఖండించాయి. ఈ ఘటన తరువాత మాస్కోలోని విమానాశ్రయాలు, స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనపై అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది.. ఘటన దృశ్యాలు భయకరంగా ఉన్నాయని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జన్ కిర్బీ తెలిపారు. దాడి జరిగే అవకాశం ఉన్నట్లు తాము రష్యాను ముందే హెచ్చరించామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story