Russia: ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడిన రష్యా

Russia:  ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై విరుచుకుపడిన రష్యా
షాహెద్ డ్రోన్లతో అతి పెద్ద దాడి

ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. ఏకంగా 75 డ్రోన్లు ప్రయోగించింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలుపెట్టిన తర్వాత మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే నని ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి. దేశ రాజధాని కీవ్ ప్రధాన లక్షంగా ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మైకోలా ఒలేష్‌చుక్ తెలిపారు. మొత్తం 75 ఇరానియన్ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. రష్యా బలగాల ప్రధాన లక్ష్యం కీవ్ నగరమేనని వెల్లడించారు.

కీవ్‌తో పాటుగా సుమీ, ద్నిప్రో పెట్రోవ్, జపోరిజియా, మైకోలోవ్ తదితర ప్రాంతాలపైనా రష్యా సేనలు డ్రొన్ దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి. కీవ్‌పై ప్రయోగించిన 60కి పైగా రష్యా డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లు నగర పాలనా యంత్రాంగం వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలనుంచి ఉదయం 10 గంటలవరకుఈ డ్రోన్ దాడులు వెల్లువెత్తినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా 77 నివాస భవనాలు,120 కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.


డ్రోన్ల ద్వారా కీవ్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని వారు తెలిపారు. ఈ దాడుల్లో ఐదుగురు పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్షో చెప్పారు. బాధితుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉందని చెప్పారు. 1932 33లో ఉక్రెయిన్‌లో లక్షలాది మంది మరణానికి కారణమైన కరవు విషాదాన్ని గుర్తు చేసుకునే ‘హోలోదోమోర్ సంస్మరణ దినం’ రోజునే ఈ దాడి జరగడం గమనార్హం.‘ మన సైనికులు చాలావరకు డ్రోన్లను కూల్చివేశారు. కానీ కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.గగనతల రక్షణను మరింత పటిష్ఠం చేసి మరిన్ని లక్షాలను కూలుస్తామని తెలిపారు. అంతకు ముందు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్ సైతం డోన్ దాడి చేసింది. గత 21 నెలల్లో ఉద్రెయిన్ చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని మాస్కో పేర్కొంది.

ఈ దాడులపై కీవ్ నగర పాలకుడు సెర్హీ పోప్కో స్పందించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయ్యాక ఇంత భీకర స్థాయిలో దాడులు ఎప్పుడూ జరగలేదని తెలిపారు. ఈ దాడుల్లో కీవ్ నగరంలోనే అనేక భవనాలు ధ్వంసం అయ్యాయి. ఐదుగురు పౌరులకు గాయాలయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

17 వేల మంది అంధకారంలో ఉన్నట్టు ఉక్రెయిన్ ఇంధన శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేకువ జామున నాలుగు గంటల నుంచి రష్యా దాడులు జరగ్గా... దాదాపు 6 గంటల పాటు విధ్వంసం కొనసాగినట్టు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు వెల్లడించాయి.


Tags

Read MoreRead Less
Next Story