Russia: ఈసారి ఓడరేవులే లక్ష్యం

Russia: ఈసారి ఓడరేవులే లక్ష్యం
డ్రోన్ దాడితో మంటల్లో చిక్కుకున్న ధాన్యం నిల్వలు

గత కొంతకాలంగా మాస్కో నగరంపై ఒక ఉక్రెయిన్‌ చేస్తున్న దాడులకు రష్యా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడ రేవు, ధాన్యం ఎగుమతులే లక్ష్యంగా షాహిద్‌ డ్రోన్లతో రష్యా దాడి చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కానీ ధాన్యం నిల్వలు మంటల్లో చిక్కుకున్నట్లు ఆ ప్రాంత గవర్నర్‌ ఒలేహ్‌ కీపర్‌ తెలిపారు.

ఆహార ధాన్యాల ఎగుమతుల ఒప్పందం నుంచి ఇటీవలే వైదొలిగిన రష్యా.... అప్పటి నుంచి ఉక్రెయిన్‌లోని వ్యవసాయ, మౌలిక వసతులు లక్ష్యంగా దాడులను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజా డ్రోన్‌ దాడి జరిగినట్లు ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. నల్ల సముద్రం మీదుగా వచ్చిన డ్రోన్లు డాన్‌బే నది తీరం వెంబడి ఇజ్మాయేల్‌ పోర్టు వైపు వెళ్లినట్లు ఉక్రెయిన్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ ఓడరేవు నుంచే రొమేనియాలోని నల్ల సముద్రం తీరంలో ఉన్న కాన్‌స్టాన్‌టా నగరానికి ఉక్రెయిన్‌ ధాన్యాన్ని తరలిస్తోంది. ధాన్యం రవాణా చేసే విదేశీ ఓడలు ఆదివారం నల్ల సముద్రం గుండా ఇజ్మాయేల్ పోర్టుకు చేరుకున్నాయని ఉక్రెయిన్ తెలిపింది. ఈ క్రమంలో రష్యా దాడులు చేసి వాటిని అడ్డుకోవాలని చూస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపించింది.


నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది. ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.

గత సంవత్సరం జూలైలో, ఐక్యరాజ్యసమితి మరియు టర్కీ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో ఉక్రెయిన్ నల్ల సముద్రం ద్వారా ధాన్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఈ ఒప్పందం ఉక్రెయిన్‌లోని యుజ్నీ, ఒడెసా మరియు చోర్నోమోర్స్క్ ఓడరేవుల నుండి బోస్పోరస్ వరకు దాడి చేయకుండా సురక్షితంగా ప్రయాణించడానికి నౌకలను అనుమతిస్తుంది. అక్టోబర్‌లో, రష్యా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినా మళ్ళీ నవంబరు లో ఒకసారి, మార్చిలో మరోసారి ఒప్పందంలో తన భాగస్వామ్యాన్ని పునరుద్ధరించింది. అయితే ఇప్పుడు మాత్రం ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా అంగీకరించలేదు.

తమ డిమాండ్లను పూర్తిగా నెరవేర్చినట్లయితే, ఉక్రెయిన్ ధాన్యం ఒప్పందానికి తిరిగి రావడాన్ని పరిశీలిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.ప్రపంచ మార్కెట్లకు రష్యన్ ధాన్యం మరియు ఎరువుల సరఫరాపై ఆంక్షలను ఉపసంహరించుకోవడం మరియు రష్యా యొక్క వ్యవసాయ బ్యాంకును ప్రపంచ చెల్లింపు వ్యవస్థకు తిరిగి కనెక్ట్ చేయడంతో సహా పలు షరతులు విధించారు. దీనిపై ఎవరూ సానుకూలంగా స్పందించక పోవడంతో రష్యా ఉక్రెయిన్ లోని వ్యవసాయ మౌలిక వసతుల లక్ష్యంగా దాడులు చేయడం ప్రారంభించింది.

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ కూడా మాస్కో పై డ్రోన్ దాడిని చేస్తోంది. ఒకసారి మాస్కో విమానాశ్రయం పైన, మరోసారి ప్రభుత్వ ఆఫీసులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే ఈ దాడులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని రష్యా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story