అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఏ దేశాలు ఎవరికీ మద్దతు అంటే..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ఏ దేశాలు ఎవరికీ మద్దతు అంటే..

అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ..యావత్‌ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ట్రంప్‌ మరోసారి అధికారంలోకి రావాలని కొందరు కోరుకుంటుండగా మరికొన్ని దేశాలు మాత్రం అధ్యక్షుడి మార్పును కోరుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా జోబైడెన్ రావాలని కోరుకుంటోంది. ట్రంప్‌తో చైనాకు ఏమాత్రం పొసగడం లేదు. రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. అటు కరోనా విషయంలోనూ డ్రాగన్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. చైనా వైరస్‌గా అభివర్ణించారు. అంతర్జాతీయ సమాజం ముందు చైనాను దోషిగా చిత్రీకరించారు. అందుకే మళ్లీ ట్రంప్‌ రావాలని చైనా కోరుకోవడం లేదు..

బైడెన్‌ అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య సంప్రదింపులు, చర్చలకు ఆస్కారం ఉంటుందని చైనా నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇక చైనీస్‌ అమెరికన్లలో 56శాతం మంది బైడెన్‌కే జై కొడుతుండగా...కేవలం 20శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతు తెలుపినట్లు తెలుస్తోంది..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం యూరప్‌-అమెరికా వాణిజ్య సంబంధాలపై స్వల్ప ప్రభావమే చూపిస్తుందని ఫ్రాన్స్‌ మరోసారి స్పష్టంచేసింది. గడిచిన చాలా ఏళ్లుగా యురోపియన్‌ యూనియన్‌తో అమెరికా స్నేహపూర్వక భాగస్వామిగా లేదని ఫ్రాన్స్‌ చెబుతోంది.ట్రంప్‌ లేదా బైడెన్‌ ఎవరు గెలిచినా ప్రస్తుత వైఖరిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.. చైనా, ఆసియాతోనే అమెరికా ఎక్కువ సంబంధాలు కలిగి ఉందని స్పష్టం చేసింది.

అమెరికా రాజకీయ వ్యవస్థలో ద్వేషం ప్రవేశించిందని ఇకపై కేంద్రీకృత రాజకీయాలు ఉండవని జర్మన్‌ విదేశీ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది. లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ బైడెన్‌కే మద్దతు తెలిపారు. ఇక అమెరికా ప్రజాస్వామ్యం గందరగోళంలో పడిందని, ఎన్నికల తర్వాత నిరసనలు పెల్లుబికే అవకాశం ఉన్నట్లు రష్యా మీడియా పేర్కొంది.

ఇరాన్‌ కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగానే ఉంది. సొంత ఎన్నికల్లోనే అవకతవకలు జరిగాయంటూ ట్రంప్‌ వ్యాఖ్యానించడాన్ని ఇరాన్ అగ్రనాయకత్వం తప్పుబట్టింది. ఇక బ్రెజిల్ మాత్రం ట్రంప్‌ అధ్యక్షుడు కావాలని ఇప్పటికే స్పష్టం చేశారు. బైడెన్‌ అధికారంలోకి వస్తే అమెజాన్‌ అడవుల మీద బ్రెజిల్‌ ఆధిపత్యం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోసారి అట్రంప్ అధికారంలోకి రావాలని హాంగ్‌కాంగ్‌, నైజీరియా,హంగేరీ, ఫిలిప్పైన్స్‌, స్లొవేనియా వంటి దేశాలు కోరుకుంటున్నాయి.

అమెరికా ఎన్నికలపై భారత్‌ మిశ్రమంగా స్పందిస్తోంది. అమెరికా ఉపాధ్యక్ష పదవి పోటీలో కమలా హారిస్‌ ఉండడంతో చాలా ప్రాంతాల్లో ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు ట్రంప్‌ అభిమానులు మాత్రం రిపబ్లికన్‌ పార్టీనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. దీంతో భారత్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. అమెరికా చట్టసభల్లో భారతీయులు కూడా ఎక్కువగా ఉండడం, ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలకంగా ఉండడంతో యావత్‌ దేశం అమెరికా ఫలితాలను ఆసక్తిగా గమనిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story