Nikhil Gupta: అమెరికాకు నిఖిల్ గుప్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం జరిగింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఇండియన్ నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు చెక్ రిపబ్లిక్ కోర్టు అనుమతించింది. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని ఆ దేశ న్యాయ మంత్రిత్వ శాఖకు వదిలేసింది. కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారతీయుల హస్తం ఉందని ఆ దేశం ఆరోపించిన క్రమంలో.. అమెరికా కూడా తమ గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని వెల్లడించింది.
కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్ గుప్తా ప్రమేయం ఉందని పేర్కొని.. అభియోగం మోపింది. ఈ నేపథ్యంలో గుప్తాను గతేడాది జూన్ లో చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేసి ప్రాగ్ లోని జైల్లో ఉంచారు. నిఖిల్ ను తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే చెక్ రిపబ్లిక్ కోర్టు నుంచి అనుమతి లభించింది. దీనిపై న్యాయమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. గుప్తా తరపు లాయర్లు అప్పగింతకు వ్యతిరేకంగా న్యాయమార్గాలను ఆశ్రయించవచ్చని కోర్టు తెలిపింది.
అమెరికాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర జరిగిందని.. కుట్రలో భారత్కు చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి పాత్ర ఉందని అమెరికా అటార్నీ కార్యాలయం సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుట్రలో నిందితుడికి భారత అదికారి నుంచి ఆదేశాలు అందాయని అమెరికా అభియోగాలు నమోదుచేసింది. అమెరికా ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని, దీనిపై తాము ఉన్నతస్థాయి విచారణ చేపట్టామని భారత ప్రభుత్వం వెల్లడించింది. పన్నూ హత్య కోసం నిఖిల్కు భారత్ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని స్పష్టం చేసింది.
గత జూన్లో నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతుడు జైలులో ఉన్నాడు.అయితే, గుప్తాను తమకు అప్పగించాలని చెక్ రిపబ్లిక్ పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో చెక్ రిపబ్లిక్ కోర్టు.. గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు అనుమతించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com