ట్విస్ట్‌లపై ట్విస్టులు.. క్షణ క్షణం మలుపులు.. ఉత్కంఠభరిత పోరులో డెమొక్రాట్లదే విజయం

ట్విస్ట్‌లపై ట్విస్టులు.. క్షణ క్షణం మలుపులు.. ఉత్కంఠభరిత పోరులో డెమొక్రాట్లదే విజయం

అగ్రరాజ్యం అధినేతగా జో బైడెన్‌కు అమెరికా జేజేలు పలికింది.. క్షణ క్షణం మలుపులు.. ట్విస్ట్‌లపై ట్విస్టులు.. కోర్టు కేసులతో నాలుగు రోజులు పాటు నెలకొన్న ఉత్కంఠ వీడింది. దోబూచులాడిన విజయం డెమొక్రాట్లనే వరించింది. గెలుపుపై ఇప్పటికి మెట్టు దిగేది లేదంటున్న ట్రంప్‌ ను గద్దె దింపింది. హోరాహోరీ పోరు అనుకుంటే.. ట్రంప్‌ విజయానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయారు. బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు ఆయన చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా 77 ఏళ్ల జో బైడెన్‌ గద్దెనెక్కబోతున్నారు. భారత సంతతికి చెందిన 56 ఏళ్ల కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి మహిళ, మొట్టమొదటి శ్వేతజాతీయేతరురాలు. అమెరికా ఎన్నికల చరిత్రలో ఇదో సరికొత్త రికార్డు, అరుదైన ఘనత.

ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా సాగుతుండటంతో.. ప్రపంచం మొత్తం నాలుగు రోజులుగా ఊపిరి బిగబట్టి ఎదురుచూసింది. ప్రత్యర్థి శిబిరాల అనుకూల, వ్యతిరేక నిరసనలతో అగ్రరాజ్యం అట్టుడికింది. వీటన్నింటినీ చిరునవ్వుతోనే చిత్తుచేశారు జో బైడెన్‌. చివరికి శనివారం పెన్సిల్వేనియా, నెవాడాల్లోనూ విజయదుందుభి మోగించారు. అగ్రరాజ్యానికి కాబోయే అధినేతగా అవతరించారు. జో బైడెన్‌ తాను పుట్టిన గడ్డ పెన్సిల్వేనియాలో జెండా ఎగరేసిన బైడెన్‌.. అగ్ర రాజ్యానికి 46వ అధ్యక్షుడిగా తన స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. ఉత్కంఠభరిత పోరులో డొనాల్డ్‌ ట్రంప్‌పై పూర్తి ఆధిక్యాన్ని సంపాదించారు. రెండోసారి విజయం సాధించని నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచిపోయారు. వచ్చే ఏడాది జనవరి 20న బైడెన్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కమలా హారిస్‌ దేశ ఉపాధ్యక్షురాలు కానున్నారు. అంతేనా, 77 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టబోతున్న అతి పెద్ద వయస్కుడు బైడెన్‌ అయితే.. 56 ఏళ్ల వయసులో అతి పిన్నవయస్కురాలిగా కమలా హ్యారిస్‌ ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.

అమెరికా ఎన్నికల ఫలితాల్లో తొలి రోజే 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన బైడెన్‌.. అక్కడ నుంచి నాలుగు రోజుల పాటు విజయానికి ఆరు అడుగు దూరంలో నిలిచారు. దీంతో ఉత‌్కంఠ పెరిగింది. నాలుగు రోజులుగా కౌంటింగ్‌ కొనసాగుతూ రావడంతో విజేత ఎవరనేది తేలలేదు. చివరికి అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం 11.30 గంటలకు పెన్సిల్వేనియాలో కౌంటింగ్‌ ముగిసింది. జో బైడెన్‌ 33లక్షల 45 వేల 906ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ట్రంప్‌ 3లక్షల11 వేల 448 ఓట్లను మాత్రమే సాధించారు. దాంతో, డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించినట్లు ప్రకటించారు.

అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాలంటే 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాలి. పెన్సిల్వేనియాలో విజయం సాధించడం ద్వారా బైడెన్‌ 284 ఓట్లు సాధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే నెవడలోనూ డెమొక్రటిక్‌ పార్టీ విజయ ఢంకా మోగించింది. దాంతో, శనివారం తుది ఫలితాలు వెలువడే సమయానికి డెమొక్రటిక్‌ పార్టీ 290 ఎలక్టోరల్‌ సీట్లను సాధించినట్లయింది. డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ మాత్రం 214 ఎలక్టోరల్‌ ఓట్లకే పరిమితమైంది. దాంతో, బైడెన్‌ విజయం సాధించినట్లు అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలన్నీ ప్రకటించాయి.

అమెరికాకు కొత్త అధ్యక్షుడిని తానేనని జొ బైడెన్ ప్రకటించుకున్నారు. ఒక్క ట్రంప్‌ మాత్రమే ఇంకా ఫలితాలను జీర్ణించుకోలేదు. ఇప్పటికీ విజేతను తానే అంటూ ఆయన ట్వీట్లు చేస్తున్నారు. నార్త్‌ కరోలినా, జార్జియా రాష్ట్రాల ఫలితాలు మాత్రమే వెలువడాల్సి ఉంది. వీటిలో, నార్త్‌ కరోలినాలో రిపబ్లికన్లు, జార్జియాలో డెమొక్రాట్లు ముందంజలో ఉన్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన బైడెన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story