ప్రపంచకప్.. పాకిస్థాన్ను చిత్తు చేసిన వెస్టిండీస్

ఐసీసీ వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెస్టిండీస్ చిత్తు చేసింది. పాక్ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. క్రిస్గేల్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించాడు. వెన్నునొప్పి వేధిస్తున్నా లెక్కచేయకుండా భారీ సిక్సర్లు బాదేశాడు. అతడికి తోడుగా నికోలస్ పూరన్ రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34 పరుగులు చేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ను విండీస్ బౌలర్లు విలవిల్లాడించారు. ఒక్కరు సైతం 30 స్కోరు చేయలేదు. ఫకర్ జమాన్ 22 పరుగులు, బాబర్ ఆజామ్ 22 పరుగులు చేశారు. వీరిద్దరే టాప్ స్కోరర్లు. జట్టు స్కోరు 17 వద్దే ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ను 2 పరుగుల వద్ద కాట్రెల్ బోల్తా కొట్టించాడు. దూకుడుగా ఆడుతున్న ఫకర్ జమాన్, హ్యారిస్ సొహైల్ను పది పరుగుల తేడాతో ఆండ్రీ రసెల్ పెవిలియన్ పంపించాడు. అప్పుడు పాక్ స్కోరు 45. కాస్త నిలకడగా ఆడుతున్న బాబర్ ఆజామ్ను 13.1వ బంతికి థామస్ ఔట్ చేశాడు. థామస్తో పాటు హోల్డర్ చెలరేగడంతో పాక్ 75 నుంచి 83 పరుగుల వ్యవధిలో సర్ఫరాజ్ , ఇమాద్ వసీమ్ , షాబాద్ ఖాన్ , హసన్ అలీ వికెట్లను కోల్పోయింది. విండీస్ బౌలర్ల షార్ట్పిచ్ బంతులకు పాక్ ఆటగాళ్లు బెంబేలెత్తారు. గతంలో ఎప్పుడూ ఆడనట్టే ప్రవర్తించారు. చివర్లో వహబ్ రియాజ్ రెండు సిక్సర్లు, ఓ బౌండరీ బాదడంతో 18 పరుగులు చేయడంతో పాక్ స్కోరు 100 దాటింది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com