- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

గురుపౌర్ణమి అనేది హిందూ సంప్రదాయంలో గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించే ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున వ్యాస మహర్షి జన్మించాడని నమ్ముతారు, అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగానూ, సామాజికంగానూ ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
గురుపౌర్ణమి రోజున చేయవలసినవి
గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడం: మీ జీవితంలో మార్గనిర్దేశం చేసిన గురువులను, ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను, తల్లిదండ్రులను లేదా మీకు ఏదైనా జ్ఞానాన్ని అందించిన పెద్దలను సందర్శించి వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచండి. వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ముఖ్యం.
గురు పూజ: మీ ఆధ్యాత్మిక గురువులు లేదా మీకు మార్గనిర్దేశం చేసేవారి పాదాలను కడిగి, గంధం, కుంకుమ, పూలతో పూజించి, వారికి నైవేద్యం సమర్పించండి.
దానధర్మాలు: శక్తికొలది దానధర్మాలు చేయడం పుణ్యప్రదం. అన్నదానం, వస్త్రదానం వంటివి చేయవచ్చు.
ఆధ్యాత్మిక అభ్యాసాలు: ఈ రోజున జపతపాలు, ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక గురువుల బోధనలను స్మరించుకొని వాటిని ఆచరించేందుకు ప్రయత్నించాలి.
మంత్ర పఠనం: గురు మంత్రాలను లేదా మీకు ఇష్టమైన దేవతా మంత్రాలను పఠించడం మంచిది.
గ్రంథ పఠనం: వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, గురువుల బోధనలు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది.
ఆలయ సందర్శన: వీలైతే ఆలయాలను సందర్శించి దేవతలకు ప్రత్యేక పూజలు చేయండి.
సాత్విక ఆహారం: ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం, ఉపవాసం పాటించడం మంచిది.
గురుపౌర్ణమి రోజున చేయకూడనివి
గురువులను అగౌరవపరచడం: గురువులను లేదా పెద్దలను ఎట్టిపరిస్థితిలోనూ అగౌరవపరచకూడదు, వారిని విమర్శించకూడదు.
చెడు పనులు: ఈ రోజున చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకూడదు.
అహింస పాటించాలి: ఏ ప్రాణినీ హింసించకూడదు.
తామసిక ఆహారం: మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోకూడదు.
వివాదాలు: వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి.
అలసత్వం: ఆధ్యాత్మిక అభ్యాసాలలో అలసత్వం చూపకూడదు.
గురుపౌర్ణమి రోజున గురువుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం, వారి బోధనలను జీవితంలో ఆచరించడం, సాత్వికంగా ఉండటం ముఖ్యం. ఈ రోజు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని ప్రభావితం చేసిన జ్ఞాన ప్రదాతలను స్మరించుకొని వారికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప అవకాశం.

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ తుక్కుతుక్కు అయిపోయింది. ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం ఉదయం కడలూరులోని సెమ్మన్ కుప్పం దగ్గర ఈ ఘటన జరిగింది. గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. రైలు వస్తున్న సమాచారం తెలిసి కూడా రైల్వే గేటు మూయకుండా నిద్రపోయాడు. రైలు రావడం లేదేమో అనుకుని స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతోంది. కానీ ఇంతలోనే ట్రైన్ వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ను ఈడ్చుకుపోయింది. ఇక గేట్ కీపర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు చితకబాదారు.

పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దేశంలోని మధ్య ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు నిద్రలోనే ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:54 గంటలకు ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 150 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 30.25 ఉత్తర అక్షాంశం, 69.82 తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఎన్సీఎస్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
పాకిస్థాన్ భౌగోళికంగా భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో ఉంది. యూరేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఈ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు భారీ భూఫలకాలు నిరంతరం ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా వంటి రాష్ట్రాలు యూరేషియన్ ప్లేట్పై ఉండగా, పంజాబ్, సింధ్ రాష్ట్రాలు ఇండియన్ ప్లేట్పై ఉన్నాయి. ఈ కారణంగానే పాకిస్థాన్ ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు నమోదయ్యే దేశాల్లో ఒకటిగా నిలిచింది.

ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు సహకరించారన్న ఆరోపణలపై దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులకు ఇరాన్ బుధవారం మరణశిక్ష అమలు చేసింది. ఆ దేశంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై సుమారు 700 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అనుబంధ నూర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ ముగ్గురి ఉరిశిక్ష విషయాన్ని ధ్రువీకరించింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 12 రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగిన అనంతరం, అమెరికా జోక్యంతో ఇరు పక్షాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి.
అయితే, ఈ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవకముందే మొసాద్ కోసం గూఢచర్యం చేశారన్న అభియోగాలపై ముగ్గురికి మరణశిక్ష విధించడం, యూదు దేశంతో సంబంధాలున్నాయనే నెపంతో వందల సంఖ్యలో ప్రజలను అరెస్టు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పాకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానాలకు మన గగనతల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. జూలై 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విమానాలకు గగనతల నిషేధాన్ని విధిస్తూ ఏప్రిల్ 30న కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని పొడిగిస్తూ వస్తున్నది. మరోవైపు, పాకిస్థాన్ కూడా భారత విమానాలకు తమ గగగతల నిషేధాన్ని పొడిగించింది. జూలై 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఏప్రిల్ 24న గగనతల నిషేధాన్ని విధించింది

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా ఖుడోసోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్పూరె అనే 25 ఏళ్ల యువకుడు ఒక కారు మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి కుటుంబానికి ఒక పొలం కూడా ఉంది. గత గురువారం అంటే జూన్ 19 ఉదయం సచిన్ తన పొలానికి ఉదయాన్నే వెళ్లినప్పుడు అక్కడ నడుస్తూ ఉండగా.. మొక్కల మధ్య నిద్రిస్తున్న ఒక నల్లని విషపూరితమైన పాముపై సచిన్ తెలియక కాలుమోపాడు. దీంతో ఒక్కసారిగా లేచిన ఆ సర్పం సచిన్ కాలుపై బలంగా కాటేసింది. సాధారణంగా విషసర్పం కాటేస్తే మనిషి చనిపోతారు. కానీ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖుద్సోడి గ్రామంలో విషపూరిత పాము కాటేసినా అతడికి ఏం కాలేదు. అంతేకాక కాటేసిన సర్పమే చనిపోయింది. బలంగా కాటేసినప్పుడు పాము కూరలపై ఒత్తిడి ప్రభావంతో అది మరణించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఔషధ మూలికలతో పళ్లు తోముకుంటానని, అందుకే ఇలా జరిగి ఉండొచ్చని సచిన్ భావిస్తూన్నాడు. ఈ పాము చాలా ప్రమాదకరమని..కాటు తరువాత మనిషి చనిపోయే అవకాశం ఎక్కువని చెప్పారు.

అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 215 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేశ్ జోషి తెలిపారు. ఇప్పటి వరకూ 198 మంది డెడ్బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కేసుల పెరుగుదలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 24 గంటల్లో 101 మందికి పాజిటివ్గా తేలింది. నిన్న ఒక్కరోజే 11 మంది మరణించారు.
అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,920 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,433, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్లో 275, రాజస్థాన్లో 222, తమిళనాడులో 220 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,264కి పెరిగింది. నిన్న కేరళలో ఏడుగురు, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 108కి పెరిగింది.

పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తాజాగా వెల్లడించారు. మిడిల్ స్కూల్లో 14 ఏండ్ల ఓ విద్యార్థి స్కూల్ సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడిన ఘటన ఫ్రాన్స్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మాక్రాన్ నుంచి పై ప్రకటన వెలువడటం గమనార్హం. యువతలో హింసాత్మక ప్రవృత్తి పెంచడానికి సోషల్ మీడియా ఆజ్యం పోస్తున్నదని, పర్యవేక్షణ లేకుండా పిల్లల సోషల్ మీడియా వాడకం హానికరమని ఆయన అన్నారు.
ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సంచలన ప్రతిపాదన చేశారు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే.. కొన్ని నెలల్లోనే ఫ్రాన్స్ స్వతంత్రంగా ఈ విధానాన్ని అమలు చేస్తుందని ప్రకటించారు. తూర్పు ఫ్రాన్స్లోని నోజెంట్ అనే ప్రాంతంలోని ఒక మధ్య పాఠశాలలో ఇటీవల జరిగిన విషాదకరమైన ఘటన తర్వాత మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. అక్కడ 14 ఏళ్ల విద్యార్థి బ్యాగును సిబ్బంది తనిఖీ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఏమాత్రం నచ్చని విద్యార్థి.. 31 ఏళ్ల పాఠశాల సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడు.
అయితే కత్తితో దాడి చేసిన బాలుడు ఆన్లైన్ కంటెంట్ ద్వారానే ప్రభావితం అయి చేశాడా లేదా అనే అశంపై దర్యాప్తు అధికారులు నిర్ధారణకు రానప్పటికీ.. యువతలో దూడుకు స్వభావం పెరగడానికి సామాజిక మాధ్యమాలే కారణం అని మెక్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిరంతరం, నిఘా లేకుండా ఉపయోగించడం వల్ల హింసాత్మక ధోరణి పెరుగుతోందని అన్నారు. చిన్నారులు, టీనేజర్లపై సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే మెక్రాన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా తన ఇంటర్వ్యూ తర్వాత మెక్రాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో కూడా టెక్ కంపెనీలు తమ బాధ్యతను మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డిని నియమించింది. ఈ రోజు నుంచి రెండేళ్ళ పాటు “జాతీయ భద్రతా సలహా మండలి” సభ్యుడిగా జి. సతీష్ రెడ్డి కొనసాగనున్నారు. నియామక ఉత్తర్వులను కేంద్రం జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జాతీయ భద్రతా సలహా మండలి పనిచేయనున్నది. డాక్టర్ జి. సతీశ్రెడ్డి భారత ప్రభుత్వం డీ.ఆర్.డీ.ఓ. (భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) మాజీ చైర్మన్. భారత రక్షణమంత్రి సాంకేతిక సలహాదారు. 2025 మార్చి 19న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయననను విమానయానం, రక్షణ రంగాలలో గౌరవసలహాదారుగా నియమించింది. ఆయన రాష్ట్ర క్యాబినెట్ హోదాలో రెండేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ద్వారకా ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అపార్ట్మెంట్లోని ఆరో అంతస్తు నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిప్రమాదంతో భయాందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు భవనంపై నుంచి కిందపడిపోయినట్లు తెలిసింది. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు, పలువురు నివాసితులు ఈ మంటల్లో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ఎనిమిది ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేస్తున్నారు. భవనంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రపంచానికి చీడ పురుగుగా పాకిస్తాన్ మారింది. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద సంఘటన జరిగినా, దాని మూలాలు పాకిస్తాన్లో కనిపిస్తాయి. అల్ ఖైదాతో పాటు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సహా అనేక ఉగ్రవాద సంస్థలకు పాక్ గడ్డపై నుంచి కార్యకలాపాలకు పాల్పడుతుంటాయి. ఇండియాపైకి ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతున్నాయి. ఒక్క భారతదేశం మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే పలు ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నారు.
తాజాగా, ఆఫ్రికాలోని కరుడుగట్టిన తీవ్రవాద సంస్థ బోకో హరామ్, ఐఎస్ఐఎస్ లో లింకులు ఉన్న ISWAPలకు పాక్ జాతీయులు శిక్షణ ఇస్తున్నట్లు తేలింది. నలుగురు పాకిస్తాన్ జాతీయులను నైజీరియా సైన్యం అరెస్ట్ చేసింది. వీరు ఉగ్రవాదులకు ఆయుధాల అక్రమ రవాణాలో కూడా సహకరించారు. దీంతో పాటు ఆఫ్రికా ఉగ్ర సంస్థలకు ప్రమాదకరమైన దాడులు చేయడం, గూఢచర్యం, డ్రోన్ శిక్షణ వంటిని నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కిరాయి సైనికులు ఉగ్రవాదులకు వ్యూహాత్మక నైపుణ్యాలను నేర్పుతున్నట్లు తేలింది.

రాజకీయంగా అస్థిరత నెలకొన్న బంగ్లాదేశ్లో ఎన్నికల నిర్వహణ డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య కాలంలో ఎన్నికలు జరగవచ్చని ఆయన తెలిపారు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
"కొన్ని సంస్కరణలు చేపడుతున్నామని, అవి పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని" యూనస్ చెప్పారు. గత ఏడాది రిజర్వేషన్ల అంశంపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో వందలాది మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ఆమె దేశం విడిచి, ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.

ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్లోని వడోదరలో రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో సమయంలో.. ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషికి చెందిన కుటుంబం.. మోదీపై పూలు చల్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ గుజరాత్ చేరుకున్నారు. మే 8వ తేదీన ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాతో కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. అయితే ఆ సైనిక చర్యపై కల్నల్ సోఫియా అప్డేట్స్ ఇచ్చారు. గుజరాత్ రోడ్షోకు చెందిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.

ఛత్తీస్ గఢ్ అడవులు మరోసారి తుపాకుల గర్జనతో దద్దరిల్లాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకంగా 28 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు సమాచారం. మరికొందరు మావోలు గాయపడినట్టు సమాచారం. మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు ఈ ఆపరేషన్ చేపట్టాయి. బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు ఆపరేషన్ లో పాల్గొన్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్, సైన్యాధక్షుడు వకర్-ఉజ్-జమాన్ మధ్య దూరం పెరిగిందా? అవుననే జవాబిస్తున్నాయి సైనిక వర్గాలు. ప్రజాస్వామిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కార్యాచరణను కనుగొనేందుకు బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడు మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో సాధ్యమైనంత త్వరలో ఎన్నికలను యూనస్ ప్రకటించాలని జమాన్ కోరుకుంటున్నారు. విదేశీ జోక్యం కారణంగా దేశంలో అస్థిరత పెరిగిపోతుందని ఆయన ఆందోళన చెతుతున్నారని, విదేశీ శక్తుల చేతిలో యూనుస్ కీలుబొమ్మగా మారిపోయారని కూడా ఆయన భావిస్తున్నారని వర్గాలు వెల్లడించాయి.

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుండె శస్త్రచికిత్స విభాగంలో రోగులతో మాట్లాడి, వారి సమస్యలు, ఆసుపత్రి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నమోదైన రోగులతో సంభాషించి, వైద్య సదుపాయాలను పరిశీలించారు. టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రి సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వీడియో-కాలింగ్ ప్లాట్ఫామ్ ‘స్కైప్’ సేవలు ఈ నెల 5 నుంచి నిలిచిపోనున్నాయి. స్కైప్కు వీడ్కోలు (ఫేర్వెల్) పలుకుతున్నామని, మే 5 తర్వాత యూజర్లకు ఈ అప్లికేషన్ అందుబాటులో ఉండదని మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. దీనిని వాడుతున్న యూజర్లు ‘టీమ్స్’కు మారాల్సి ఉంటుందని తెలిపింది.
స్కైప్ తన వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల్ని 2003లో తొలుత ప్రారంభించింది. అప్పట్నుంచీ దాదాపు 2 దశాబ్దాలుగా పాపులర్ ఫ్లాట్ఫామ్గా నిలిచింది. దీనిని 2011లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. 2017లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ను లాంచ్ చేసినప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటున్నది. ఆధునిక సమాచారం, సహకార వ్యవస్థకు ప్రైమరీ హబ్గా ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’ను నిలుపబోతున్నట్టు సంస్థ ప్రకటించింది. తమ యూజర్ల కమ్యునికేషన్ టూల్స్ అన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ‘స్కైప్’కు వీడ్కోలు పలుకుతున్నట్టు తెలిపింది.

కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు.. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా ఇవాళ డెడ్ లైన్.. దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోతున్నారు.

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ కిరాతక కొడుకు దారుణంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో ఈ దారుణం జరిగింది. తన తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై కుమారుడితో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అప్పలనాయుడు (55), జయ (45)లను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాడు.
భర్తను చంపిన భార్య
రంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. ధన్నారానికి చెందిన ప్రవీణ్ భార్య ప్రమీల కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో శుక్రవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి ప్రవీణ్కు ఉరివేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి రోజునే పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందని జ్వాల-విశాల్ సోషల్ మీడియాలో అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమిళ నటుడు విష్ణు విశాల్తో జ్వాలకు 2021 ఏప్రిల్ 22న వివాహం జరిగింది. మొదటి భార్య రజినీ నాయర్తో ఆయనకు ఇప్పటికే ఓ కొడుకు (ఆర్యన్) ఉన్నాడు. కాగా విశాల్-రజినీ 2010లో పెళ్లి చేసుకుని 2018లో విడిపోయారు.
క్రికెట్లో కొంతకాలం కెరీర్ తర్వాత 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విష్ణు విశాల్. ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యారు. గతేడాది విడుదలైన ‘లాల్ సలాం’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఒక స్పెషల్ సాంగ్లో కనిపించిన సంగతి తెలిసిందే.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు వస్తానని, భూదందాల బాధితులను నుంచి ఆర్జీలు స్వీకరించి, వాటిని స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే తెలిస్తే కూటమి నేతలైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలన పారదర్శకంగా, నిష్ఫక్షపాతంగా సాగుతోందని, దానికి అలానే కంటిన్యూ చేసేలా నేతలు వ్యవహరించాలన్నారు. ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్ లో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పిఠాపురంలో 10వేల మంది మహిళలకు పవన్ కల్యాణ్ చీరలను పంపిణీ చేశారు. తనను ఆదరించి గెలిపించినందుకు కుటుంబానికి పసుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్నట్టు తెలిపారు.

విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు బహిర్గతమయ్యాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి.. మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి.. కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపీడో పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నారు. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి, మత్తు మందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాళ్లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గర్భం తీయించకపోతే రూ.20 వేలు సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సుమారు 30 మంది బాధితరాళ్ల నగ్న వీడియోలు చిత్రీకరించి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అఫ్గానిస్థాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తొలుత6.4 మాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చిందని ఈఎంఎస్ఈ ప్రకటించడం గమనార్హం. అఫ్గానిస్థాన్లో వచ్చిన భూకంపం ప్రభావం భారత్ వరకు చూపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోనూ భూప్రకంపనలు వచ్చాయి. కాగా, అఫ్గాన్లో వచ్చిన భూకంపానికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రేపటి నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30, మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని.. మళ్లీ JUL 25 నుంచి శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నాయన్నారు. కాగా ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.
ఇక పోతే.. జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢమాసంలో ముహుర్తాలు లేవని.. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసంలో మంచి రోజులు ఉన్నాయన్నారు. కాగా ఈ నెల(ఏప్రిల్) 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మంచి ముహూర్తాలు అధికంగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు సిద్ధం అవుతున్నారు.

అయ్యప్ప భక్తులకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త తెలిపింది. దేవస్థానం బోర్డు ఇటీవల ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. పవిత్ర విషు పర్వదినం సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ సోమవారం లాకెట్ల విక్రయాలను ప్రారంభించారు. శబరిమల ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన బంగారు లాకెట్లను దేవస్థానం ఆన్లైన్ ద్వారా భక్తులకు విక్రయిస్తోంది. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన తొలి లాకెట్ను ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు అందుకున్నారు. అయ్యప్ప రెండు గ్రాముల లాకెట్ ధర రూ.19,300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ.38,600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ.77,200లుగా నిర్ణయించారు. ఈ మేరకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటన విడుదల చేసింది.

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. న్యూయార్క్లో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. న్యూయార్క్లో ఒక చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీకి దక్షిణంగా శనివారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయి, ఒకరు మృతి చెందారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు తెలిపారు.
మిత్సుబిషి MU-2B విమానం మసాచుసెట్స్ రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని న్యూయార్క్లోని కోపేక్లో మధ్యాహ్నం 12:15 గంటలకు (1615 GMT) బయలుదేరి, న్యూయార్క్లోని హడ్సన్ సమీపంలోని కొలంబియా కౌంటీ విమానాశ్రయానికి వెళుతోందని కొలంబియా కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం మరిన్ని వివరాలను అందిస్తారని FAA, స్థానిక షెరీఫ్ కార్యాలయం రెండూ తెలిపాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. కోకోపో పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. కాగా, పపువా న్యూ గునియాలో భూకంపం సంభవించడం వారంలో ఇది రెండోసారి. గత వారం సరిగ్గా ఇదే రోజు అంటే శనివారం పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లో భూమి కంపించింది. కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో అప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి . ఇలా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విడాకుల వార్తలను మిషెల్ ఒబామా ఖండించారు. ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఆమె ఈ ప్రచారం మహిళల స్వేచ్ఛపై దాడేనని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఒబామాతో కలిసి మిషెల్ ఈవెంట్లకు హాజరు కాకపోవడంతో విడాకుల ప్రచారం జోరందుకుంది. అయితే ఆ కార్యక్రమాలకు వెళ్లడమనేది తన వ్యక్తిగత విషయమే తప్ప వైవాహిక బంధంలో ఏర్పడిన వివాదాల వల్ల కాదన్నారు. ఇతరులనుకునేది చేయడం తన పని కాదని తేల్చి చెప్పారు.
‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటోందని ఎవరూ గ్రహించడంలేదు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకుంటున్నారు. నేను మాత్రం నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది నేను చేయను’ అని మిషెల్ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ ఎయిర్పోర్ట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విజయవంతంగా ల్యాండ్ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన పైలట్ అర్మాన్ బుధవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. అయితే, అతడికి ఇదే చివరి విమాన ప్రయాణం అవుతుందని ఊహించలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన కాసేపటికే అర్మాన్ అస్వస్థతకు గురయ్యా డు. దీంతో తోటి సిబ్బంది అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అర్మాన్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అంతకుముందు విమానంలో కూడా అతను వాంతులు చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.

పవన్ కళ్యాణ్తో విడాకుల అనంతరం తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్షిప్కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15 సంవత్సరాలు . బహుశా ఆమెకు 18 సంవత్సరాలు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని పేర్కొన్నారు. ఇక మొత్తానికైతే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆలోచనను అభిమానులతో పంచుకోవడంతో చాలామంది అభిమానులు రేణూ దేశాయ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. సింగిల్ పేరెంట్ గా ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడిన వెంటనే మీరు మీ వ్యక్తిగతంగా ఆలోచించండి.. మీకంటూ ఒక తోడును వెతుక్కోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

కరేబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్ క్లబ్ పైకప్పు కూలిన ప్రమాదంలో వంద మందికి పైగా మరణించగా, 155 మంది గాయపడ్డారు. ప్రమాదంలో 124 మంది మరణించారని, మృతులలో ఇద్దరు మేజర్ లీగ్ బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మంగళవారం ఒంటి గంటకు ఒక బ్యాండ్ ప్రదర్శనను తిలకిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో క్లబ్లో 300 మంది ఉన్నారు. ప్రదర్శన ఇస్తున్న మెరెంగ్యూ కళాకారుడు రూబీ పెరెజ్ జాడ కూడా తెలియరాలేదు. మృతులలో ఆయన కూడా ఉండి ఉంటారని భావిస్తున్నారు.

అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్ విధానాలతో గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక దినదిన గండంగా గడుపుతున్నారు. గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పుడు దానికి వీసా రద్దు చేయడం ద్వారా శిక్ష విధిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు పెరిగినట్టు పలు అమెరికన్ కాలేజీలు వెల్లడించాయి. వీసా రద్దయిన విద్యార్థుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో సంబంధం లేని వారి వీసాలు కూడా రద్దవుతున్నట్టు తెలిపాయి. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, యూసీఎల్ఏ, ఒహాయో స్టేట్ సహా పలు ప్రముఖ యూనివర్సిటీల అధికారులు తాము ఫెడరల్ ఇమిగ్రేషన్ డాటాబేస్ను చూసిన తరువాత ఈ విషయం తెలిసిందని అన్నారు.

గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్ పరీక్ష ఫైనల్ ‘కీ’ని కూడా అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు.

పెళ్లి, డేటింగ్ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్గా డేట్స్కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్కాస్ట్లో ఆమె చెప్పుకొచ్చారు.
‘‘నా జీవితంలోకి ఏ అబ్బాయి అయితే వస్తాడో.. అతనే ఏకైక వ్యక్తి అవుతాడు. అతడే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో మాట్లాడలేను’’ అని వీడియోను మహ్వశ్ షేర్ చేసింది. దానికి చాహల్ లైక్ చేశాడు. దీంతో ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘యుజీ భాయ్ ఆ మూల నుంచి నవ్వుతున్నాడు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘ప్రతిదీ తాత్కాలికమే. చాహల్ ఇచ్చిన లైక్ శాశ్వతం’ అంటూ మరొకరు స్పందించారు.

ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో 500 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ గా విధులు నిర్వర్తిస్తున్న వీరిని ఉద్యోగం ఇచ్చిన సంవత్సరంలోగానే తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జడ పీ) పేరుతో సంవత్సరం క్రితం ఫుడ్ డెలివరీ స్టాట్ఫామ్ నియామకాలు చేపట్టింది. కస్టమర్ సపోర్ట్ విభాగం కింద 1500 మందిని నియమించింది. వీరిలో చాలా మంది పనితీరు ఆశించన మేర లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం. వంటి కారణాలు చూపి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించింది. తొలగించిన వారికి నెలరోజుల వేతనం పరిహారంగా ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కస్టమర్ సపోర్ట్ విధానాలను ఆటోమేట్ చేయడంతో పాటు, ఖర్చులను నియంత్రించుకునేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని జొమాటో నిర్ణయించింది. ఇందులో భాగం గానే జొమాటో లేఆఫ్ు చేపట్టింది. జోమా టో చర్య మూలంగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మందగమనం నెలకొందని జొమాటో ప్రకటించింది. క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ మూలంగా జొమాటో అనుబంధ సంస్థ బ్లింకిట్ నష్టాలను ఎదుర్కొంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com