- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ఆకాశంలో ఓ అద్భుతమైన ఖగోళ పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు కొన్నిచోట్ల పూర్తి ఎరుపు రంగులో దర్శనమివ్వనుండటం విశేషం. దీన్నే ఖగోళ శాస్త్ర పరిభాషలో 'బ్లడ్ మూన్' అని పిలుస్తారు. ఈ అరుదైన దృశ్యం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే, భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాలకు ఈ చంద్రగ్రహణం మొదలైంది. ఇది అర్ధరాత్రి దాటి సోమవారం తెల్లవారుజామున 1 గంట 31 నిమిషాల వరకు కొనసా గింది. సుమారు మూడున్నర గంటల పాటు ఈ గ్రహణం వీక్షించేందుకు అవకాశం కలిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా బ్లడ్ మూన్ దృశ్యంపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ నెల 7వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 8:58 గంటలకు మొదలై 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడి, తెల్లవారుజామున 2:25 గంటలకు గ్రహణం విడవనుంది. నార్త్, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా దేశాల ప్రజలు నేరుగా గ్రహణాన్ని చూడొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఆకాశం మేఘావృతమై ఉండకపోతే కనుక, డాబాపైకి ఎక్కి ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలీస్కోప్ కానీ, బైనాక్యులర్ కానీ అందుబాటులో ఉంటే గ్రహణాన్ని మరింత చక్కగా చూడవచ్చని తెలిపారు. రాత్రి 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని వివరించారు.

ప్రజాధనంతో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ను మానసిక వైద్యశాలగా మార్చాలని గోవా గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజు సలహా ఇచ్చారు. క్షత్రియ సేవాసమితి ఆధ్వర్యంలో విశాఖలో సన్మాన సభ ఏర్పాటు చేశారు.‘‘అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం.. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలి. చాలా ఏళ్లు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాను. అప్పుడు సంక్షేమం కోసం అప్పులు చేసేవారు. కానీ, గత ప్రభుత్వంలో అన్ని తాకట్టులో పెట్టడం చూశా. విశాఖలో ప్రజాధనంతో కట్టిన రుషికొండ ప్యాలెస్ పెచ్చులు ఊడిపోయాయని తెలిసింది. అదే రూ.600 కోట్లు ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయ్యేది. ఈ ప్యాలెస్ను ఏం చేయాలని ప్రభుత్వం ప్రజలను అడుగుతోంది. దానిని పిచ్చి ఆసుపత్రి చేస్తే మంచిదని నా ఉచిత సలహా. కనీసం దానిని కట్టిన దుర్మార్గులకి ఆ సముద్ర గాలి తగులుతుంది. ఆ భవనాల ద్వారా ఎలాంటి ఆదాయం రాదు. ప్రజాధనాన్ని ప్రజా హితం కోసం వాడాలి. మన అందరినీ ఇబ్బంది పెట్టారు. మనో ధైర్యంతో నిలబడాలి.. లొంగిపోకూడదు. మన వీర సైనికులు ప్రపంచానికి మన సత్తా చూపించారు. అన్ని దేశాలకు ఒక పాఠం నేర్పించాం’’ అని అశోక్గజపతిరాజు అన్నారు.
కైలాసగిరిపై సిద్ధమైన గాజు వంతెన
విశాఖలో మరికొద్ది రోజుల్లో గాజు వంతెన పర్యాటకులకు థ్రిల్ పంచనుంది. మహా విశాఖ ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్లు పొడవు కలిగిన గాజు వంతెన నిర్మాణం పూర్తయింది. ఇది దేశంలోనే అతి పొడవైనది. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యంతో దీనిని నిర్మించినా.. భద్రత దృష్ట్యా ఒకసారికి కేవలం 40 మందికి మాత్రమే అనుమతిస్తారు. దీనిపైకి ఎక్కిచూస్తే చుట్టూ ఎత్తయిన కొండలు, కింది భాగంలో లోయ, కనుచూపు మేరలో సాగరం కనిపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, కొత్త లోకంలో విహరిస్తున్న భావన పర్యాటకులకు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
లిక్కర్ కేసులో సిట్ దూకుడు
ఏపీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ నేత విజయానందరెడ్డి ఇళ్లు, కంపెనీల్లో సిట్ తనిఖీలు చేసింది. చిత్తూరు బీవీరెడ్డి కాలనీలో, నలందానగర్లోని నిఖిలానంద అపార్టుమెంట్లో అధికారులు సోదాలు చేశారు. విజయానందరెడ్డి 2024లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ను రెండ్రోజుల క్రితం విజయవాడ సిట్ కార్యాలయానికి పిలిచి విచారించారు. విజయానందరెడ్డి ఇంటి అడ్రస్సుతో సీబీఆర్ ఇన్ఫ్రా కంపెనీ ఉండటంపై అధికారులు ఆరా తీస్తున్నారు. వైసీపీ నేత చెవిరెడ్డి రెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ ఫ్రా కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. అధికారులు చిత్తూరు వెళ్లి ఆయా కంపెనీల్లో తనిఖీలు చేశారు. ఇప్పటికే పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. మద్యం ముడుపులను కంపెనీల్లోకి మళ్లించినట్లుగా అధికారులకు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టారు. దీంతో ఆయా కంపెనీల్లో అధికారుల తనిఖీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. సమాచారం తెలుసుకున్న చిత్తూరు వైసీపీ శ్రేణులు ఆయా కంపెనీల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. సిట్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు. సిట్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. విరెడ్డి భాస్కర్రెడ్డికి సంబంధించి హైదరాబాద్లోనూ సిట్ తనిఖీలు సాగుతున్నాయి. తిరుపతిలో ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ కార్యాలయంలో, తిరుపతి గ్రామీణ మండలంలోని ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల తర్వాత సిట్ కీలక నేతలను అరెస్ట్ చేస్ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. దీంతో పిల్లలకు తాత, నానమ్మ, అమ్మమ్మల ఆప్యాయత, అనుబంధం దూరమవుతున్నాయి. ఈ సమస్యను గుర్తించిన ఆగ్రాలోని "రామ్లాల్ వృద్ధాశ్రమం" వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అద్దెకు తాతయ్య, అమ్మమ్మ' అనే సరికొత్త సర్వీసు ప్రారంభించింది. దీని ద్వారా అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, వారికి కుటుంబంతో ఉండే అనుభూతిని అందిస్తుంది.
ఈ కార్యక్రమం కింద వృద్ధాశ్రమంలోని వృద్ధులను నెల రోజుల పాటు కుటుంబాలు తమతో పాటు ఉంచుకోవచ్చు. దీని కోసం కుటుంబాలు రూ.11వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించిన మొత్తంలో సగం అద్దెకు వెళ్లిన వృద్ధుడికి, మిగిలిన సగం ఆశ్రమానికి కేటాయిస్తారు. ఇలా అద్దెకు వెళ్లే వృద్ధులకు కొంత ఆర్థిక సహాయం లభించడమే కాకుండా, వారు కుటుంబ సభ్యులతో గడిపిన అనుభూతిని పొందుతారు. ఇది వారికి ఒంటరితనం నుంచి ఉపశమనం ఇస్తుంది. అటు వైపు, ఈ కార్యక్రమం వల్ల పిల్లలకు తాతలు, నాయనమ్మల ప్రేమ, కథలు, అనుభవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇది జనరేషన్ మధ్య గ్యాప్ ఫిల్, చేయడానికి యువతలో పెద్దల పట్ల గౌరవాన్ని, సానుభూతిని పెంచుతుంది. ఈ సిస్టమ్ జపాన్లో ఉండటాన్ని చూసి.. తాము కూడా ప్రారంభించామని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం భారతదేశంలో వృద్ధులకు మద్దతు ఇచ్చే వ్యవస్థపై మరింత చర్చను లేవనెత్తుతుంది.

వినియోగదారులకు గుడ్ న్యూస్. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఈరోజు నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను 51.50 రూపాయలు తగ్గించాయి. సవరణ తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ. 1,580 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. అయితే, 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. తాజా నెలవారీ సవరణ తర్వాత ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల సర్దుబాటు ఈ LPG సిలిండర్లను రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, మార్కెట్ పరిస్థితుల ప్రకారం ప్రతి నెలా గ్యాస్ ధరలు నిర్ణయించబడతాయి.

చికిత్సలో భాగంగా వైద్యులు ఇచ్చే మందుల చీటీ కచ్చితంగా అర్థమయ్యేలా ఉండాలని, స్పష్టమైన వైద్య ప్రిస్క్రిప్షన్, రోగ నిర్ధారణలు పొందడం రోగి హక్కని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పు చెప్పింది. రాజ్యాంగబద్ధమైన ఆరోగ్య హక్కులలో ఇది ఉందని స్పష్టం చేసింది. ‘మందుల చీటీ, రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య పత్రాలు, అందుతున్న చికిత్స గురించి తెలుసుకునే హక్కు ప్రతి రోగికి ఉంది.దీంతో ఆ డాక్యుమెంట్లు స్పష్టమైన రాతలో ఉండాలి. అందులోని విషయం రోగికి స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి’ అని జస్టిస్ జస్గురుప్రీత్ ఈనెల 27న తీర్పు చెప్పారు. ఒక కేసులో మెడికో లీగల్ నివేదిక అర్థం కాని రాతలో ఉండటంతో కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారించింది.

అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, సినీ నటుడు అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నమ్మ (94) వృద్ధాప్య కారణంగా అర్థరాత్రి కన్నుమూశారు. మధ్యాహ్నం కోకాపేలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్చరణ్ మైసూర్ నుంచి, బన్నీ ముంబై నుంచి చేరుకోనున్నారు. అరవింద్, చిరంజీవి అంత్యక్రియలు నిర్వర్తిస్తుండగా, పవన్ కళ్యాణ్, నాగబాబు రేపు విచ్చేసి కుటుంబానికి సంతాపం తెలియజేయనున్నారు. కనకరత్నమ్మ, రామ్చరణ్కు అమ్మమ్మ అవుతుంది. రాంచరణ్ మైసూర్ నుంచి , బన్నీ ముంబై నుంచి మధ్యాహ్ననికి హైదరాబాద్ చేరుకొంటారు . అల్లు అరవింద్, చిరంజీవి ఇప్పటికే భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పవన్ నాగబాబులు వైజాగ్ లో జరగనున్న పబ్లిక్ మీటింగ్ లో ఉన్నందున రేపు వచ్చి అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలుపుతారు.

మనిషి జీవితం రెప్ప పాటే అనే ధర్మానికి కడపలో స్మశానంలో ఏర్పాటు చేసిన రిజర్వ్డ్ బోర్డులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. భార్య చనిపోతే భర్త తమవారి సమాధి నిర్మించి పక్కనే తమ సమాధికి అవసరమైన స్థలాన్ని ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. మరణానంతరం మట్టిలో కలిసినా పక్కనే ఉండాలని ఇలా చేస్తున్నారట. కడప రిమ్స్ సమీపంలోని క్రైస్తవుల సమాధి తోటలో రిజర్వు చేసిన ప్రాంతాల్లో బోర్డులు పాతారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చర్చించుకుంటున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ త్వరలో భారత్ లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్ చుక్ తెలిపారు. జెలెన్ స్కీ పర్యటనకు సంబంధించి తేదీలను ఖరారు చేయడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కీవ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని భారత్ కు ఆహ్వానించారు.
ఉక్రెయిన్లో శాంతి కోసం ప్రధాని మోదీ ఒత్తిడి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి కోసం వాదిస్తూ “ఇది యుద్ధ యుగం కాదు” అని నొక్కి చెప్పారు. పుతిన్, జెలెన్ స్కీలతో టెలిఫోన్ సంభాషణలు జరిపారు. భారతదేశం రెండు దేశాల మధ్య శాంతిని కోరుకుంటుందని వెల్లడించారు. మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఈ ఏడాది చివరలో భారత్ కు రానున్నారు.

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సోదరి కావడంతో, దగ్గుబాటి కుటుంబంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతితో నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె కాసేపటి క్రితం కన్నుమూశారు. నందమూరి పద్మజ..మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి. అంత్యక్రియలపై నందమూరి కుటుంబం ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్పట్నం పరిధి ఉల్లూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. సోమవారం తెల్లవారుజామున జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు ఇంద్రావతి నేషనల్ పార్క్లో మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉల్లూరు సమీపంలో ఏర్పాటు చేసిన మందుపాతర ని మావోయిస్టులు పేల్చారు. దీంతో డీఆర్జీ జవాన్ దినేశ్ నాగ్ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని దవాఖానకు తరలించారు. ఈమేరకు ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.

న్యూయార్క్ నగరంలోని అప్పర్ ఈస్ట్ సైడ్ శుక్రవారం ఉదయం పెద్ద పేలుడు ధాటికి కుదేలైంది. ఈ ఘటనలో మాన్హాటన్ పక్క ప్రాంతం మొత్తాన్ని దట్టమైన నల్ల పొగ కప్పేసింది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈస్ట్ 95వ స్ట్రీట్, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. దీని తర్వాత అక్కడే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించాయి. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని నియంత్రించడానికి భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అమెరికాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకున్నది. మోంటానా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ చిన్న విమానం.. ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలముకున్నాయి. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం అప్పటికే ఆగి ఉన్న ప్రయాణికులు లేని విమానాన్ని ఢీకొట్టిందని అధికారులు చెప్పారు. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ కమ్మేసిందని తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్, ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. అయితే ఇద్దరు ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి ఎయిర్పోర్టులోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. ఆ విమానాన్ని 2011లో తయారు చేశారని పేర్కొన్నారు.

ఆఫ్రికా దేశమైన ఈక్వెడార్లో కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నైట్క్లబ్ వద్ద ఆదివారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. గయా ప్రావిన్స్లోని శాంటా లూసియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీన్ని ఈక్వెడార్లోనే అత్యంత భయంకర ప్రాంతంగా పేర్కొంటారు. బాధితులందరూ 20 నుంచి 40 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన సాయుధులైన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పరారయ్యారని అక్కడి మీడియా పేర్కొంది. ఇటీవల కాలంలో ఈక్వెడార్లో వరుస అల్లర్లు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటనకు కారణాలు మాత్రం తెలియరాలేదు. మొత్తం 1.8 కోట్ల జనాభా ఉన్న ఈక్వెడార్లో ఈ ఏడాదిలో మొత్తం 4600 మంది అల్లర్లలో చనిపోయారు. గతేడాది 7,000 మంది చనిపోయారు.

జమ్ము కశ్మీర్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్ జిల్లా కద్వా బసంత్గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. సుమారు 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఉదంపూర్ అడిషనల్ ఎస్పీ సందీప్ భట్ తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది జవాన్లు ఉన్నట్లు చెప్పారు.

జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు. ఓ జవాన్ గాయపడ్డారు. ఆపరేషన్ అఖల్ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు ఆగస్టు 1న గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య శనివారం రోజంతా కాల్పులు కొనసాగాయాయి. ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరోవైపు ముష్కరుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడ్డారు. మృతులు ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు (TRF) చెందినవారని అధికారులు తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించారు.

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17వేల కోట్ల విలువైన రుణాల మోసానికి సంబంధించిన కేసులో చర్యలకు ఉపక్రమించిన ఈడీ.. ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, జులై 24న అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది వ్యాపార భాగస్వాముల ఇళ్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన 35కు పైగా కార్యాలయాల్లో ఈడీ ఆకస్మిక సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వాణిజ్య అవసారలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి తగ్గింది. ప్రతి నెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ కంపెనీలు.. తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను రూ.33.50 తగ్గించాయి. తగ్గిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. తగ్గించిన ధరతో ఢిల్లీలో రూ.1665గా వాణిజ్య సిలిండర్ రూ.1631.50గా ఉంది. కోల్కతాలో రూ.1735.50, ముంబైలో రూ.1616.50, చెన్నై రూ.1790 కు తగ్గింది. రాష్ట్రాల వారీగా ఈ తగ్గింపులో మార్పు ఉంటుంది.
ఇక గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.853గా ఉండగా, కోల్కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, హైదరాబాద్లో రూ.905గా ఉన్నది. ఈ ఏడాది ఏప్రిల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. యూపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు ఈ పదవిలో ఉన్నారు, కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న గోవింద్ వల్లభ్ పంత్ రికార్డును యోగి అధిగమించారు. పంత్ యూపీకి ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 127 రోజులను యోగి అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ మొదట మార్చి 19, 2017న ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వరసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్లో వరసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రికార్డు కూడా యోగి, బీజేపీ పార్టీకి ఉంది. తన పాలనలో మాఫియా డాన్లు, నేరస్తులను అణిచివేయడంతో యోగి మార్క్ కనిపించింది.

ఆంధ్రప్రదేశ్కు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. గోవా గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి లోకేశ్తోపాటు టీడీపీ ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. ఈనెల 14న గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు నియమితులైన విషయం తెలిసిందే. పీఎస్ శ్రీధరన్ పిళ్లై స్థానంలో గవర్నర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అశోక్ 2014 నుంచి 2018 వరకు మోదీ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఏపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా వ్యవహరించారు.

మధ్యప్రదేశ్లోని పన్నాలో ఓ దినకూలీకి అదృష్టం తలుపుతట్టింది. అతనికి తాను పనిచేసే నిసార్ గనిలో ఒకటికాదు రెండుకాదు ఏకంగా 8 వజ్రాలు దొరికాయి. వాటి ధర సుమారు రూ. 12లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. పూర్తి వివరాల్లోకి వెళితే... ఛతర్పూర్ జిల్లాలోని కటియా గ్రామానికి చెందిన హర్గోవింద్, పవన్ దేవి దంపతులు గత ఐదేళ్లుగా పన్నాలోని నిసార్ గనిలో పనిచేస్తున్నారు.
వీరికి గనిలో ఒకేసారి 8 వజ్రాలు దొరికాయి. వాటి విలువను నిపుణులు నిర్ధారించాక, వేలంలో వచ్చిన మొత్తం నుంచి పన్నులు పోగా మిగతా డబ్బును గోవింద్ ఫ్యామిలీకి అందజేస్తారు. హర్గోవింద్ మాట్లాడుతూ... "భగవంతుడు ఈసారి మమ్మల్ని కనికరించాడు. గతంలోనూ ఓ వజ్రం దొరికింది. అప్పుడు తెలియక కేవలం రూ. లక్ష మాత్రమే నా చేతికి వచ్చింది" అని అన్నాడు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్కు భారత్ అండగా ఉంటుందని, సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా తెలిపారు. విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతుల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారని తెలిసి బాధ కలిగిందని పేర్కొన్నారు. ఈ దుర్ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్కు చెందిన శిక్షణ యుద్ధ విమానం ఢాకా సమీపంలోని పాఠశాలపై కూలిపోయిన ఘటనలో పైలట్తో పాటు 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 100 మందికి పైగా గాయపడ్డారు.

పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. Lashkar-e-Taiba Pahalgam Attack Pakistani terrorist TRFఈ మేరకు టీఆర్ఎఫ్ను ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా గుర్తిస్తున్నట్టు విదేశాంగ మంత్రి మార్కొ రుబియో ఒక ప్రకటన చేశారు. టీఆర్ఎఫ్ను లష్కరే తాయిబాపై ఆధారపడిన దుష్ట సంస్థగా ఆయన పిలిచారు. పహల్గాం దాడి ఘటనలో న్యాయం జరగాలని ట్రంప్ కోరారని రుబియో గుర్తు చేశారు.

ప్రపంచ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కారు భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఈరోజు టెస్లా కారును నడిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఆయన కారును స్వయంగా డ్రైవ్ చేశారు. టెస్లా కంపెనీ ముంబైలో తన షోరూమ్ ను ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏక్ నాథ్ షిండే మాట్లాడుతూ... ముంబైలో టెస్లా కంపెనీ షోరూమ్ ప్రారంభించడం సంతోషకరమైన విషయమని చెప్పారు. మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో గొప్ప మౌలికసదుపాయాలు ఉన్నాయని తెలిపారు. మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారని... తమ రాష్ట్రం ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా మారిందని చెప్పారు.

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ముని మనవడు, మరాఠీ భాష కేసరి పత్రిక ట్రస్టీ ఎడిటర్ దీపక్ తిలక్ (78) ఈరోజు కన్నుమూశారు. పుణెలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధ్యాప సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తిలక్వాడలో ఆయన పార్దీవదేహాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచనున్నారు. వైకుంఠ శ్మశానవాటికలో ఆయన పార్దీవదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. లోక్మాన్య తిలక్ 1881లో ప్రారంభించిన కేసరి పత్రికకు దీపక్ తిలక్ ట్రస్టీ ఎడిటర్గా పని చేస్తున్నారు.
దీపక్ తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠంలో వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే అకడెమిక్, జర్నలిస్టు సర్కిల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కాగా, దీపక్ తిలక్కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

కిట్టి పార్టీలలో 20 మందికి పైగా మహిళలతో స్నేహం చేసి రూ.30 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో సవిత అనే మహిళను అరెస్టు చేశారు బెంగళూరు పోలీసులు. నిందితురాలు ఈ పార్టీలలో ధనవంతులైన మహిళలకు తనను తాను పరిచయం చేసుకుని, వారి నమ్మకాన్ని సంపాదించి, వివిధ కారణాలు చెప్పి మోసం చేసేది.
బసవేశ్వరనగర్ పోలీసులు అరెస్టు చేసిన సవిత, మహిళల నేపథ్యం గురించి అడిగి, వారి నమ్మకాన్ని పొందడానికి వారికి ఆహారం, పానీయాలు అందించేదని ఆరోపించారు. మహిళలను మోసం చేయడానికి తనకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ వంటి ప్రభావవంతమైన రాజకీయ నాయకులను తెలుసని ఆమె చెబుతుండేది.
ఆ తర్వాత సవిత ఆ మహిళలను డబ్బు పెట్టుబడి పెట్టమని అడుగుతుంది, వారి పెట్టుబడిని రెట్టింపు చేస్తామని లేదా అమెరికా నుండి తక్కువ ధరకు బంగారం కొంటామని హామీ ఇస్తుంది. విదేశాలలో బంధువులు ఉన్నారని, వారు కూడా తమ డబ్బును తన దగ్గర పెట్టుబడి పెడతారని ఆమె చెప్పి నమ్మించేది. అయితే, తరువాత ఆమె వివిధ సాకులు చెబుతూ డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటుందనే విషయాన్ని బాధితులు గమనించారు.
మోసపోయిన మహిళలు ఆమెకు ఒక్కొక్కరు రూ.50 లక్షల నుండి రూ.2.5 కోట్ల వరకు ఇచ్చారు. సవిత ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదైంది. అప్పుడు ఆమె అరెస్టైంది బెయిల్ పై విడుదలైంది. అయినా తన మోసపూరిత బుద్దిని మార్చుకోలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తన కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ పోలీసుల చేతికి చిక్కింది.

గురుపౌర్ణమి అనేది హిందూ సంప్రదాయంలో గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను గౌరవించే ఒక పవిత్రమైన రోజు. ఈ రోజున వ్యాస మహర్షి జన్మించాడని నమ్ముతారు, అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగానూ, సామాజికంగానూ ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది.
గురుపౌర్ణమి రోజున చేయవలసినవి
గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడం: మీ జీవితంలో మార్గనిర్దేశం చేసిన గురువులను, ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను, తల్లిదండ్రులను లేదా మీకు ఏదైనా జ్ఞానాన్ని అందించిన పెద్దలను సందర్శించి వారి పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచండి. వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం ముఖ్యం.
గురు పూజ: మీ ఆధ్యాత్మిక గురువులు లేదా మీకు మార్గనిర్దేశం చేసేవారి పాదాలను కడిగి, గంధం, కుంకుమ, పూలతో పూజించి, వారికి నైవేద్యం సమర్పించండి.
దానధర్మాలు: శక్తికొలది దానధర్మాలు చేయడం పుణ్యప్రదం. అన్నదానం, వస్త్రదానం వంటివి చేయవచ్చు.
ఆధ్యాత్మిక అభ్యాసాలు: ఈ రోజున జపతపాలు, ధ్యానం, యోగా వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక గురువుల బోధనలను స్మరించుకొని వాటిని ఆచరించేందుకు ప్రయత్నించాలి.
మంత్ర పఠనం: గురు మంత్రాలను లేదా మీకు ఇష్టమైన దేవతా మంత్రాలను పఠించడం మంచిది.
గ్రంథ పఠనం: వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, గురువుల బోధనలు, ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది.
ఆలయ సందర్శన: వీలైతే ఆలయాలను సందర్శించి దేవతలకు ప్రత్యేక పూజలు చేయండి.
సాత్విక ఆహారం: ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవడం, ఉపవాసం పాటించడం మంచిది.
గురుపౌర్ణమి రోజున చేయకూడనివి
గురువులను అగౌరవపరచడం: గురువులను లేదా పెద్దలను ఎట్టిపరిస్థితిలోనూ అగౌరవపరచకూడదు, వారిని విమర్శించకూడదు.
చెడు పనులు: ఈ రోజున చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకూడదు.
అహింస పాటించాలి: ఏ ప్రాణినీ హింసించకూడదు.
తామసిక ఆహారం: మాంసాహారం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోకూడదు.
వివాదాలు: వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి.
అలసత్వం: ఆధ్యాత్మిక అభ్యాసాలలో అలసత్వం చూపకూడదు.
గురుపౌర్ణమి రోజున గురువుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండటం, వారి బోధనలను జీవితంలో ఆచరించడం, సాత్వికంగా ఉండటం ముఖ్యం. ఈ రోజు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన జీవితాన్ని ప్రభావితం చేసిన జ్ఞాన ప్రదాతలను స్మరించుకొని వారికి కృతజ్ఞతలు తెలిపే గొప్ప అవకాశం.

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ తుక్కుతుక్కు అయిపోయింది. ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా.. మరి కొందరు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం ఉదయం కడలూరులోని సెమ్మన్ కుప్పం దగ్గర ఈ ఘటన జరిగింది. గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. రైలు వస్తున్న సమాచారం తెలిసి కూడా రైల్వే గేటు మూయకుండా నిద్రపోయాడు. రైలు రావడం లేదేమో అనుకుని స్కూల్ వ్యాన్ పట్టాలు దాటుతోంది. కానీ ఇంతలోనే ట్రైన్ వచ్చేసింది. దీంతో స్కూల్ వ్యాన్ను ఈడ్చుకుపోయింది. ఇక గేట్ కీపర్ నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు చితకబాదారు.

పాకిస్థాన్లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దేశంలోని మధ్య ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు నిద్రలోనే ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:54 గంటలకు ఈ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 150 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 30.25 ఉత్తర అక్షాంశం, 69.82 తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఎన్సీఎస్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
పాకిస్థాన్ భౌగోళికంగా భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతంలో ఉంది. యూరేషియన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో ఈ దేశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు భారీ భూఫలకాలు నిరంతరం ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా వంటి రాష్ట్రాలు యూరేషియన్ ప్లేట్పై ఉండగా, పంజాబ్, సింధ్ రాష్ట్రాలు ఇండియన్ ప్లేట్పై ఉన్నాయి. ఈ కారణంగానే పాకిస్థాన్ ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు నమోదయ్యే దేశాల్లో ఒకటిగా నిలిచింది.

ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు సహకరించారన్న ఆరోపణలపై దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులకు ఇరాన్ బుధవారం మరణశిక్ష అమలు చేసింది. ఆ దేశంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై సుమారు 700 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అనుబంధ నూర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ ముగ్గురి ఉరిశిక్ష విషయాన్ని ధ్రువీకరించింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 12 రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగిన అనంతరం, అమెరికా జోక్యంతో ఇరు పక్షాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి.
అయితే, ఈ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవకముందే మొసాద్ కోసం గూఢచర్యం చేశారన్న అభియోగాలపై ముగ్గురికి మరణశిక్ష విధించడం, యూదు దేశంతో సంబంధాలున్నాయనే నెపంతో వందల సంఖ్యలో ప్రజలను అరెస్టు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పాకిస్థాన్ ఎయిర్లైన్స్ విమానాలకు మన గగనతల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నెల పాటు పొడిగించింది. జూలై 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విమానాలకు గగనతల నిషేధాన్ని విధిస్తూ ఏప్రిల్ 30న కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని పొడిగిస్తూ వస్తున్నది. మరోవైపు, పాకిస్థాన్ కూడా భారత విమానాలకు తమ గగగతల నిషేధాన్ని పొడిగించింది. జూలై 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. పాకిస్థాన్తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఏప్రిల్ 24న గగనతల నిషేధాన్ని విధించింది

మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ జిల్లా ఖుడోసోడి గ్రామానికి చెందిన సచిన్ నాగ్పూరె అనే 25 ఏళ్ల యువకుడు ఒక కారు మెకానిక్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతడి కుటుంబానికి ఒక పొలం కూడా ఉంది. గత గురువారం అంటే జూన్ 19 ఉదయం సచిన్ తన పొలానికి ఉదయాన్నే వెళ్లినప్పుడు అక్కడ నడుస్తూ ఉండగా.. మొక్కల మధ్య నిద్రిస్తున్న ఒక నల్లని విషపూరితమైన పాముపై సచిన్ తెలియక కాలుమోపాడు. దీంతో ఒక్కసారిగా లేచిన ఆ సర్పం సచిన్ కాలుపై బలంగా కాటేసింది. సాధారణంగా విషసర్పం కాటేస్తే మనిషి చనిపోతారు. కానీ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖుద్సోడి గ్రామంలో విషపూరిత పాము కాటేసినా అతడికి ఏం కాలేదు. అంతేకాక కాటేసిన సర్పమే చనిపోయింది. బలంగా కాటేసినప్పుడు పాము కూరలపై ఒత్తిడి ప్రభావంతో అది మరణించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఔషధ మూలికలతో పళ్లు తోముకుంటానని, అందుకే ఇలా జరిగి ఉండొచ్చని సచిన్ భావిస్తూన్నాడు. ఈ పాము చాలా ప్రమాదకరమని..కాటు తరువాత మనిషి చనిపోయే అవకాశం ఎక్కువని చెప్పారు.

అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, వారం రోజులు పూర్తైనా మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఇప్పటి వరకూ 215 మంది బాధితుల వివరాలను గుర్తించినట్లు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాకేశ్ జోషి తెలిపారు. ఇప్పటి వరకూ 198 మంది డెడ్బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. మిగతా మృతదేహాల అప్పగింత ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. మరోవైపు మృతదేహాలను గుర్తించడానికి అహ్మదాబాద్లో డీఎన్ఏ ప్రయోగశాల 24 గంటలూ పనిచేస్తోంది. ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న కేసుల పెరుగుదలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 24 గంటల్లో 101 మందికి పాజిటివ్గా తేలింది. నిన్న ఒక్కరోజే 11 మంది మరణించారు.
అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,920 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,433, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్లో 275, రాజస్థాన్లో 222, తమిళనాడులో 220 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,264కి పెరిగింది. నిన్న కేరళలో ఏడుగురు, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 108కి పెరిగింది.

పదిహేను ఏండ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఫ్రాన్స్ త్వరలో నిషేధం విధించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తాజాగా వెల్లడించారు. మిడిల్ స్కూల్లో 14 ఏండ్ల ఓ విద్యార్థి స్కూల్ సిబ్బందిపై పదునైన ఆయుధంతో దాడికి పాల్పడిన ఘటన ఫ్రాన్స్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే మాక్రాన్ నుంచి పై ప్రకటన వెలువడటం గమనార్హం. యువతలో హింసాత్మక ప్రవృత్తి పెంచడానికి సోషల్ మీడియా ఆజ్యం పోస్తున్నదని, పర్యవేక్షణ లేకుండా పిల్లల సోషల్ మీడియా వాడకం హానికరమని ఆయన అన్నారు.
ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సంచలన ప్రతిపాదన చేశారు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే.. కొన్ని నెలల్లోనే ఫ్రాన్స్ స్వతంత్రంగా ఈ విధానాన్ని అమలు చేస్తుందని ప్రకటించారు. తూర్పు ఫ్రాన్స్లోని నోజెంట్ అనే ప్రాంతంలోని ఒక మధ్య పాఠశాలలో ఇటీవల జరిగిన విషాదకరమైన ఘటన తర్వాత మాక్రాన్ ఈ ప్రకటన చేశారు. అక్కడ 14 ఏళ్ల విద్యార్థి బ్యాగును సిబ్బంది తనిఖీ చేసే ప్రయత్నం చేసింది. ఇది ఏమాత్రం నచ్చని విద్యార్థి.. 31 ఏళ్ల పాఠశాల సిబ్బందిని కత్తితో పొడిచి చంపాడు.
అయితే కత్తితో దాడి చేసిన బాలుడు ఆన్లైన్ కంటెంట్ ద్వారానే ప్రభావితం అయి చేశాడా లేదా అనే అశంపై దర్యాప్తు అధికారులు నిర్ధారణకు రానప్పటికీ.. యువతలో దూడుకు స్వభావం పెరగడానికి సామాజిక మాధ్యమాలే కారణం అని మెక్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిరంతరం, నిఘా లేకుండా ఉపయోగించడం వల్ల హింసాత్మక ధోరణి పెరుగుతోందని అన్నారు. చిన్నారులు, టీనేజర్లపై సామాజిక మాధ్యమాల ప్రభావం గురించి పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే మెక్రాన్ ఈ ప్రకటన చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా తన ఇంటర్వ్యూ తర్వాత మెక్రాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో కూడా టెక్ కంపెనీలు తమ బాధ్యతను మరింత పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com