- Home
- /
- చిట్టి న్యూస్
చిట్టి న్యూస్

ఒక వృద్ధుడు 45 ఏండ్ల క్రితం తాను చేసిన దొంగతనాన్ని మరచిపోయి సాధారణ జీవితం గడుపుతున్నాడు. అయితే చట్టం మాత్రం ఆ కేసును జ్ఞాపకం పెట్టుకొని తాజాగా అతడిని అరెస్ట్ చేసింది. పోలీస్ అధికారి శ్వేతా శుక్లా కథనం ప్రకారం.. సలీమ్, మరో ఆరుగురు కలిసి 1980లో బల్సాముంద్ కాకడ్ ప్రాంతంలోని పొలాల నుంచి రూ.100 విలువైన గోధుమలను దొంగిలించారు. ఆ తర్వాత సలీమ్ పక్కనే ఉన్న ధార్ జిల్లాలోని బాగ్ పట్టణానికి పారిపోయి అక్కడ ఒక కిరాణా దుకాణం నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. సలీమ్పై వారెంట్ ఉండటంతో ఈ దొంగతనం కేసు కోర్టులో అలాగే పెండింగ్లో ఉంది. ఇటీవల మరో నిందితుడి కోసం సైబర్ విభాగం గాలిస్తుండగా సలీమ్ ఆచూకీ తెలిసింది.

ఢిల్లీకి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు.. అల్ ఫలాహ్ యూనివర్సిటీ(Al Falah University) చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు. చైర్మెన్ సిద్ధిక్పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్ల ఘటన తర్వాత యూజీసీ ఆ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఫోర్జరీ కోణంలో విచారణ సాగుతున్నది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని, ఆ వర్సిటీ చైర్మెన్ ఫోర్జరీకి పాల్పడినట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధిక్ని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ కేసులో విచారణ కోసం నాలుగు రోజుల కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఈ కేసులో మరింత సమాచారం అందాల్సి ఉన్నది.

ఉత్తర జపాన్లోని దాదాపు 15 ప్రాంతాలను రెండు వారాలుగా భారీ హిమపాతం ముంచెత్తుతోంది. మంచు ధాటికి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తమ ఇంటిపై పేరుకుపోయిన మంచును తొలగించే క్రమంలో కిందికి జారిపడటం, హఠాత్తుగా గుండెపోటుకు గురవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు గాయపడ్డారని పేర్కొన్నారు. సుమారు 2 మీటర్ల మేర మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రైళ్లు, రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. 1,700కు పైగా ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు చెప్పారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు టాక్సీ వేలో ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ప్రయాణికులు క్షేంగా ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రెండు విమానాల రెక్కలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబై నుంచి కోయంబత్తూర్ బయలుదేరాల్సిన AI 2732 విమానం టాక్సీవేపై నిలిచివున్న సమయంలో, ఎదురుగా వచ్చిన ఇండిగో విమానం దాని వింగ్ టిప్ను తాకింది. దీంతో ఎయిర్ ఇండియా విమానం రెక్క చివరి భాగం దెబ్బతింది. దీంతో విమానాన్ని నిలిపేసి, సాంకేతిక పరిశీలన ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
ఇండిగో సంస్థ ప్రకారం.. ఇండిగో విమానం 6E 791 హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చింది. టాక్సీ చేస్తుండగా మరో విమాన రెక్కని తాకినట్లు సంస్థ ప్రకటించింది. ఇండిగోలోని ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని, విమానాన్ని పరిశీలన కోసం పంపినట్లు చెప్పింది. సంఘటన తర్వాత రెండు విమాన సంస్థలు వెంటనే భద్రతా ప్రోటోకాల్స్ పాటించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మధ్యప్రదేశ్లోని మైహర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రత్యేక భోజనాన్ని కంచాలకు బదులుగా పేపర్లలో వడ్డించారు. భతిగ్వాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. వీడియోలో విద్యార్థులు నేలపై కూర్చుని పాత పుస్తకాల నుంచి తీసిన పేపర్లలో తమకు వడ్డించిన హల్వా-పూరీని తింటున్నారు. దీనిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు సత్నా, మైహర్ జిల్లాల ప్రజా సంబంధాల అధికారి రాజేశ్ సింగ్ తెలిపారు.

జార్ఖండ్ లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. సుమారు 22 మందిని చంపింది. రోజుకు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. గుంపు నుంచి వేరుపడిన ఆ ఏనుగు మహాభీకరంగా ప్రవర్తిస్తోంది. పశ్చిమ సింగభుమ్ జిల్లాలో ఆ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జార్ఖండ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆ జంతువును పట్టుకునేందుకు అటవీశాఖ 100 మందిని రంగంలోకి దింపింది. మూడుసార్లు ఆ ఏనుగుకు మత్తు మందు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని అదుపు చేయలేకపోయారు. బహుశా ఆ ఏనుడు మదంతో ప్రవర్తించి ఉంటుందని భావిస్తున్నారు. టెస్టెస్టరోన్ లెవల్స్ పెరగడం వల్ల ఆ ఏనుగు ప్రమాదకరంగా మారినట్లు కూడా అంచనా వేస్తున్నారు. మొదటిసారి ఓ మగ ఏనుగు ఈ స్థాయి బీభత్సం సృష్టించి ఉంటుందని ఫారెస్ట్ ఆఫీసర్ కుల్దీప్ మీనా తెలిపారు.

ఉత్తర భారత్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీ, హర్యానాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 2.8గా నమోదైంది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. హర్యానాలోని సోనిపట్లోనూ భూప్రకంపనలు జరిగాయి. సోమవారం ఉదయం 8:44 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలు గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

అమెరికాలోని ఈస్టర్న్ మిసిసిపీలో శుక్రవారం రాత్రి జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అలబామా సరిహద్దుకు సమీపంలోని వెస్ట్ పాయింట్ పట్టణంలో ఈ దాడులు జరిగాయి. మొత్తం మూడు చోట్ల నిందితుడు కాల్పులు జరిపినట్లు స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. "హింస కారణంగా పలువురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు" అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాదాపు 20 వేల జనాభా కలిగిన క్లే కౌంటీలో ఈ దారుణం చోటుచేసుకుంది. గతేడాది అక్టోబర్లో కూడా మిసిసిపీలో ఇలాంటి కాల్పుల ఘటనలు జరిగాయి. అప్పట్లో లేల్యాండ్ నగరంలో జరిగిన దాడిలో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారు. తాజా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర దగ్గుతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. భారీ వాయు కాలుష్యం వల్లే సోనియాకు అనారోగ్యం కలిగినట్లు తెలుస్తోంది. సీనియర్ పల్మోనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి 2000లలో 16 రాష్ట్రాలను పరిపాలించింది. తదనంతరం ఆమె 2017లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు.

జమ్ముకశ్మీర్ లోని కశ్మీర్ లోయ లో మంచు దుప్పటి పరుచుకుంది. కశ్మీర్ వ్యాలీలోని ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ అయిన సోనామార్గ్లో తెల్లటి దూది వెదజల్లినట్టుగా మంచు పరుచుకున్నది. దాంతో కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా, ఆహ్లాదకరంగా, అద్భుతంగా కనిపిస్తున్నాయి.
ఆ సుందర దృశ్యాలను టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. కశ్మీర్ వ్యాలీలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో గత కొన్ని రోజుల నుంచి మంచు విపరీతంగా కురుస్తున్నది. సన్నని దూది పింజాల్లా రాలుతున్న మంచును యాత్రికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ తెల్లని మంచు పరుచుకోవడంతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కింది వీడియోలో ఆ మంచు దృశ్యాలను మీరు కూడా ఒకసారి చూడండి.

ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలో మంగళవారం ఉదయం ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. భికియాసైన్ – వినాయక్ రోడ్డులో ఒక ప్రయాణీకుల బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.
పలు నివేదికల ప్రకారం.. భికియాసైన్-వినాయక్-జలాలి మోటార్ రోడ్డులోని శిలాపాణి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ద్వారహత్ నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో బయలుదేరిన బస్సు భికియాసైన్ నుంచి రామ్నగర్కు వెళుతూ.. మార్గమధ్యలో నియంత్రణ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు భికియాసైన్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

నా అన్వేషన అన్వేష్ వ్యూస్ కోసం దిగజారిపోతున్నాడు. సోషల్ మీడియాలో ఏ టాపిక్ మీద చర్చ జరుగుతున్నా సరే మధ్యలోకి వచ్చి దరిద్రమైన వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ల బట్టలు పద్ధతిగా ఉండాలి అని చెప్పే క్రమంలో రెండు పదాలు దొర్లాడు. దానికి ఆయన సారీ చెప్పాడు. మహిళా కమిషన్ ముందు హాజరయి అక్కడ కూడా సారీ చెప్పాడు. కానీ అనసూయ, చిన్మయి లాంటి వారు రెచ్చిపోయి వీడియోలు చేశారు. శివాజీని తిట్టారు. అయితే మధ్యలోకి నా అన్వేషన అన్వేష్ కూడా వచ్చి చేరాడు. ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే.. శివాజీని బూతులు తిట్టాడు. చెప్పలేని విధంగా మాటలు అన్నాడు. గరికపాటి నర్సింహారావును పట్టుకుని చాలా నీచమైన కామెంట్ చేశాడు. కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు అన్వేష్. మీ ప్రైవేట్ పార్టులు కట్ చేసుకోండి అంటూ శివాజీని, గరికపాటిని అనడం అంటే.. అన్వేష్ అహంకారానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.
ఆడవాళ్లు బట్టలు విప్పుకుని తిరిగినా సరే తప్పులేదు.. చూసేవాళ్లదే తప్పు అంటున్నాడు. పైగా పురాణాల్లో సీతాదేవి, ద్రౌపది ఏమైనా మాడ్రన్ బట్టలేసుకున్నారా. వాళ్లు చీరలు కట్టుకున్నాసరే వారిని ఎత్తుకెళ్లారు కదా అన్నాడు. ఇలా హిందూ దేవుళ్లను కూడా అవమానించాడు అన్వేష్. అన్వేష్ మీద సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తి పోస్తోంది. ఇంత ఘోరంగా మాట్లాడటంతో ఆయన్ను లక్షల మంది అన్ ఫాలో చేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా లక్షల మంది అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. అన్వేష్ ప్రవర్తన మితిమీరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంత అహంకారపూరితంగా.. కనీస గౌరవం లేకుండా మాట్లాడటం అంటే అన్వేష్ కు ఎంత అహంకారం ఎక్కువైందో అర్థమైంది అంటున్నారు నెటిజన్లు.
హిందూ దేవుళ్లను, పండితులను, సంప్రదాయాలను అవమానిస్తూ వీడియోలు చేసిన అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే హిందూ సంఘాలు, వీహెచ్ పీ లాంటివి కంప్లయింట్స్ కూడా చేశాయి. మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఉదయం నౌకాదళ జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరానికి చేరుకున్న రాష్ట్రపతి.. నేవీకి చెందిన కల్వరి క్లాస్ సబ్ మెరైన్ ‘ఐఎన్ఎస్ వాఘ్షీర్’ లో ప్రయాణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంట నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి కూడా ఉన్నారు. కల్వరి క్లాస్ సబ్మెరైన్ లో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. గతంలో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలో కల్వరి క్లాస్ సబ్మెరైన్ లో ప్రయాణించారు. ఇదిలా ఉండగా, ద్రౌపది ముర్ము ఇటీవల హర్యానాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం రాఫెల్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాణించారు.

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ముగిసింది. ఈ సమయంలో సుమారు 30.56 లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని ట్రావేన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు. మండల పూజ సమయంలో ఆలయానికి మొత్తం రూ.332.77 కోట్ల ఆదాయం లభించిందని ఆయన తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.35.70 కోట్లు పెరగడం విశేషమన్నారు. మొత్తం ఆదాయంలో భక్తులు సమర్పించిన కానుకల రూపంలోనే రూ.83.17 కోట్లు వచ్చాయని, మిగిలిన ఆదాయం ప్రసాదాల విక్రయం, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వివరించారు.

టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . ఓ హెలికాఫ్టర్ కుప్పకూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కిలిమంజారో పర్వతంపై ఉన్న బరాఫు క్యాంపు సమీపంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుందని టాంజానియా పౌర విమానయానశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పర్వతంపై ఉన్నవారిని వైద్యచికిత్స కోసం తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. మృతుల్లో ఇద్దరు విదేశీ పర్యాటకులతో పాటు డాక్టర్, టూరిస్ట్ గైడ్, పైలట్ ఉన్నట్లు వెల్లడించింది. అయితే, ఆ పర్యాటకులు ఏ దేశానికి చెందినవారనే వివరాలను మాత్రం తెలపలేదు. ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 18 వరకు మూడు విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్లో భాగంగా పర్యటన కొనసాగుతోంది. ఈ మూడు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనుంది. ద్వైపాక్షిక సంబంధాలతో దేశాలతో భారత్ సంబంధాలు బలపడనున్నాయి.
గత నెల నవంబర్ 21, 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్కు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమ్మిట్కు ట్రంప్ గైర్హాజరయ్యారు. సౌతాఫ్రికాలో శ్వేత జాతి రైతులపై దాడులు నిరసిస్తూ ట్రంప్ నిరసన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండగా, వాయు కాలుష్యం మాత్రం క్రమంగా పెరుగుతోంది. నగరం మొత్తం గ్యాస్ ఛాంబర్లా మారింది. దేశ రాజధానిలో AQI 400 పాయింట్లు దాటింది. కొన్ని హాట్ స్పాట్లలో 500 పాయింట్ల వరకు నమోదైంది. ఇక ఢిల్లీ- ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోయింది. అయితే, ఢిల్లీ ఎయిర్పోర్టులోనూ విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. నగరంలో కాలుష్యం పెరగడంతో అధికారులు గ్రేడ్–4 చర్యలు అమలు చేస్తున్నారు. ఢిల్లీలోని అన్ని పాఠశాలల్లో హైబ్రిడ్ (ఆన్లైన్, ఆఫ్లైన్) విధానంలో క్లాస్ లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సగం మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, మిగతా సగం మంది ఇంటి నుంచి పని చేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గుజరాత్లోని సూరత్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడంతస్తుల టెక్స్టైల్ భవంతులో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేస్తున్నట్లు సూరత్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పారిక్ తెలిపారు. సుమారు 20 నుంచి 22 అగ్నిమాపక యంత్రాలు మంటలు ఆర్పుతున్నట్లు వెల్లడించారు. మంటలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం బిల్డింగ్ పనులు జరుగుతున్నాయని.. అలాగే లోపల చాలా సామాగ్రి ఉందని తెలిపారు. 100-125 మంది అగ్నిమాపక అధికారుల, సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ జామర్ కారుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఓఆర్ఆర్ వద్ద ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని జామర్ టైర్ అకస్మాత్తుగా పేలిపోయింది. వెంటనే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని నియంత్రించటంతో ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు స్టెప్నీ టైర్ అమర్చటంతో వాహనం తిరిగి సీఎం కాన్వాయ్లో చేరింది. ఈ ఘటనతో కాన్వాయ్లోని భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు, జామర్ వాహనానికి స్టెప్నీ టైర్ను అమర్చి అవసరమైన మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం వాహనం తిరిగి సీఎం కాన్వాయ్లో చేరింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా, వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద కాన్వాయ్లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది.

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన హవాయి ద్వీపం లో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలవేయ మరోసారి విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికివస్తోంది. వెయ్యి అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతోంది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం అగ్నిపర్వతం బద్దలైనట్టు అధికారులు తెలిపారు. హవాయి జాతీయ ఉద్యానవనం లోపల ఉన్న కాల్డెరాలోనే లావా నిలిచిపోయిందని స్పష్టంచేశారు. అయినప్పటికీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కిలవేయ అగ్నిపర్వతం 38 సార్లు విస్ఫోటనం చెందింది.

కాల్పులతో దక్షిణాఫ్రికా దద్దరిల్లింది. హాస్టల్పై దుండగులు కాల్పులు జరిపారు. 11 మంది మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రిటోరియాలోని సాల్స్విల్లేలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో సాయుధులైన ముగ్గురు వ్యక్తులు హాస్టల్లోకి చొరబడ్డారు. 25 మందిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.కాగా, ఈ సంఘటనలో 11 మంది మరణించారు. 14 మంది గాయపడ్డారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 11 మంది మృతుల్లో మూడు, 12 ఏళ్ల వయస్సున్న బాలురు, 16 ఏళ్ల యువతి ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించే ప్రాంతంలో ఈ కాల్పుల సంఘటన జరిగినట్లు చెప్పారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

దిత్వా తుఫాన్ ద్వీప దేశం శ్రీలంకను కుదిపేసింది. తుఫాను బీభత్సానికి కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి. ఇళ్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. అనేక పట్టణాలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 20 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. దిత్వా తుఫాను బీభత్సానికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. నవంబర్ 16 నుంచి ఇప్పటి వరకూ 486 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 341 మంది ఆచూకీ గల్లంతయింది. ఈ సంక్షోభ సమయంలో భారత దేశం శ్రీలంకకు అండగా నిలుస్తోంది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో మానవతా సాయాన్ని అందజేస్తోంది. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), భారత వాయు సేన ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని స్టాక్ టన్ నగరంలో శనివారం రాత్రి కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ బాంక్వెట్ హాల్ లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా చొరబడ్డ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో నలుగురు మరణించగా, పది మందికి బుల్లెట్ గాయాలయ్యాయని పేర్కొంది.
దుండగుల కాల్పుల్లో గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ కాల్పులకు కారణమేంటనేది తెలియరాలేదని వివరించారు. మృతులను గుర్తించాల్సి ఉందని చెప్పారు.

డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ కు పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈనెల 30వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. సభ సజావుగా సాగడంతో పాటు ముఖ్యమైన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు కొనసాగనున్నాయి. ఈ మూడు వారాల సెషన్లో మొత్తం 15 సిట్టింగ్లు ఉంటాయి. ఈ సమావేశాలు కీలకమైన సమయంలో జరుగుతుండటం వల్ల చర్చలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా, 12 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) పై పలు ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.

దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడ నొప్పితో బాధపడుతుండగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు కేఎల్ రాహుల్కు అప్పగించారు. ఈనెల 30 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జాబితాను ఆదివారం వెల్లడించారు. ఇటీవల ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లిన వన్డే జట్టు నుంచి నాలుగు మార్పులు చేశారు. కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో దూరం కావడంతో రాహుల్కు డిప్యూటీగా పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మకు చోటు దక్కింది. రెండేళ్ల క్రితం తను భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు.
గిల్ దూరం
మెడ నొప్పితో బాధపడుతున్న భారత కెప్టెన్ శుభ్మన్ గిల్కు మరింత విశ్రాంతి అవసరమున్నట్టు తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీ్సకు అతను దూరం కానున్నాడు. అయితే సఫారీలతోనే జరిగే టీ20 సిరీ్సకల్లా గిల్ బరిలోకి దిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్తో పాటు కీపర్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండో టెస్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్ ఏడాది కాలంగా ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. ఈ ఫార్మాట్లో ప్రధాన కీపర్గా రాహుల్నే పరిగణిస్తుండడం గమనార్హం. ఓపెనర్లుగా జైస్వాల్, వెటరన్ రోహిత్తో పాటు టాపార్డర్లో కోహ్లీ ఆడనున్నాడు. హర్షిత్, సిరాజ్, అర్ష్దీప్ పేసర్లుగా ఉండే చాన్సుంది. బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వచ్చు. స్పిన్నర్ కుల్దీప్ వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు కానుండగా అక్షర్, సుందర్, వరుణ్ జట్టులో ఉంటారు.
అయ్యర్ ఆటకు దూరం
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో గాయపడ్డ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో తిరిగి మైదానంలో కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ.. అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకొనే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. అంతర్గత రక్తస్రావం అయింది. ఆ తర్వాత అతడిని ఐసీయూలో చేర్పించి, చికిత్స అందించారు. ప్రస్తుతం రీహాబ్లో ఉన్న అయ్యర్.. కోలుకునేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టే ప్రయత్నంలో డైవ్ చేయగా.. అతడి కడుపులో తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో రెండు రోజులు ఐసీయూలో ఉండి చికిత్స చేయించుకున్న అతను.. అక్కడి నుంచి డిశ్చార్జి అయి స్వదేశానాకి వచ్చాడు. లోపల గాయం పూర్తిగా మాని, శ్రేయస్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి రెండు నెలలకు పైగానే సమయం పడుతుందట. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు కూడా అతను అందుబాటులోకి రాడట. ఫిట్నెస్ సాధించినా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఎంపికకు శ్రేయస్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం కష్టమే.

రష్యాను ఏ రకంగానూ లొంగదీసుకోలేకపోతున్న అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర దేశాలపై బెదిరింపులకు దిగుతున్నది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ‘అతి తీవ్రమైన ఆంక్షలు’ విధిస్తామని హెచ్చరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ మేరకు మాస్కోను లక్ష్యంగా చేసుకొని రిపబ్లికన్ ప్రజాప్రతినిదులు ఒక కఠినమైన చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. రష్యా, దాని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికన్ కాంగ్రెస్ ఏమైనా చర్యలు తీసుకుంటున్నదా? అన్న ప్రశ్నకు అధ్యక్షుడు ట్రంప్ సమాధానమిస్తూ.. ‘రిపబ్లికన్లు ఓ చట్టాన్ని రూపొందించనున్నారు.
అది నాకు సమ్మతమే. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై అతి తీవ్రమైన ఆంక్షలు విధించనున్నారు. ఇరాన్ను కూడా జతచేయమని నేను చెప్పాను’ అని అన్నారు. రష్యాతోపాటు ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై అమెరికా మరిన్ని కఠిన ఆంక్షలకు దిగనున్నది. ఈ మేరకు సెనెటర్ లిండ్సే గ్రాహం సెనేట్ విదేశీ సంబంధాల కమిటీకి ప్రతిపాదించిన బిల్లు ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించే దేశాలపై 500 శాతం టారిఫ్ విధించనున్నారు.

బన్హమ్స్ సంస్థ మంగళవారం లండన్లో నిర్వహించిన వేలంలో గాంధీ అరుదైన ఆయిల్ పెయింటింగ్కు ఊహించిన దాని కంటే మూడింతల ధర లభించింది. ఏకంగా రూ.1.76 కోట్లకు ఇది అమ్ముడుపోయింది. చిత్రకారిణి క్లేర్ లిగ్హ్టన్ దీనిని గీశారు. 1931లో గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్కు వెళ్లినప్పుడు గాంధీజీకి ఆమె పరిచయమయ్యారు. ‘ఒక ఆయిల్ పెయింటింగ్ కోసం గాంధీ కూర్చోవడం బహుశా ఇదొక్కటే కావొచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన పెయింటింగ్’ అని బన్హమ్స్ సంస్థ అమ్మకాల అధిపతి డెమెరి తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీబీసీని తీవ్రంగా హెచ్చరించారు. తన ప్రసంగాన్ని వక్రీకరించినందుకు 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.44 వేల కోట్లు) పరిహారం చెల్లించాలని దావా వేస్తానని చెప్పారు. వివరాల్లోకి వెళితే, 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 2021 జనవరి 6న వాషింగ్టన్లోని కేపిటల్ హిల్పై ఆయన మద్దతుదారులు దాడి చేశారు. ఆ సందర్భంగా ట్రంప్ దాదాపు గంటసేపు ప్రసంగించారు. దీనిపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీలో తన ప్రసంగాన్ని వక్రీకరించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ రాజకీయంగా బీబీసీపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ, న్యూస్ చీఫ్ టర్నెస్ డెబోరా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విషయమై బీబీసీ ట్రంప్కు క్షమాపణ చెప్పినా ట్రంప్ శాంతించలేదు. ట్రంప్కు 1 బిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలని ట్రంప్ తరపు న్యాయ బృందం బీబీసీకి లేఖ రాసింది.

ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా పలువురు వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్ర గాయాలతో అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చుతున్నాయి రోడ్డు ప్రమాదాలు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలో ఓ ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 8 మంది సజీవదహనమయ్యారు.
పూణేలోని నవాలే వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు ఐదు నుండి ఆరు వాహనాలను ఢీకొట్టిందని సమాచారం. బలంగా ఢీకొట్టడంతో వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక విభాగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీ బ్లాస్ట్పై దర్యాప్తు సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు.. తాజాగా బ్లాస్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఫరీదాబాద్లో అరెస్టైన డాక్టర్ ముజమ్మిల్ నుంచి కీలక విషయాలను రాబట్టాయి. ఎర్రకోట దగ్గర జరిగిన దాడి దీపావళి నాడు ప్లాన్ చేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి నాడు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దాడి చేయాలని ప్లాన్ చేశామని.. అనంతరం ఆ ప్లాన్ రద్దు చేసుకున్నట్లుగా ముజమ్మిల్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లుగా సమాచారం. ఇక ఈ ప్లాన్ను జనవరి 26, 2026న అమలు చేయాలని ప్రణాళిక వేసుకున్నామని.. ఇందులో భాగంగానే ఎర్రకోట చుట్టు పక్కల ప్రాంతాలను గుర్తించినట్లుగా ముజమ్మిల్ పోలీసులకు తెలియజేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. సామవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబ్ పేలుడులో 12 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు.

హంగేరికి చెందిన బ్రిటీష్ రచయిత డేవిడ్ సాలే .. 2025 బూకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఫ్లెష్ అనే నవలకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. లండన్లో సోమవారం రాత్రి బూకర్ ప్రైజ్ వేడుక జరిగింది. భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ నవల తీవ్ర పోటీ ఇచ్చింది. కానీ చివరకు డేవిడ్ రాసిన నవలకు అవార్డు దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ సాలేకు సుమారు 50 వేల పౌండ్ల నగదు పురస్కారం అందజేశారు. గత ఏడాది విన్నర్ సమంతా హార్వే చేతుల మీదుగా ట్రోఫీని బహూకరించారు. కిరణ్ దేశాయ్ రెండోసారి ఈ అవార్డు కోసం పోటీపడ్డారు. 2006లో రాసిన ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ నవలకు ఆమెకు బూకర్ ప్రైజ్ వచ్చింది. అయితే ఈ సారి కూడా ఆ అవార్డు కోసం ఆమె తీవ్ర పోటీపడ్డారు.

పాకిస్థాన్ త్వరలోనే ఫీల్డ్ మార్షల్ దేశంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్గా ఉన్న అసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలు కల్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ 27వ రాజ్యాంగ సవరణ ముసాయిదాను సిద్ధం చేసింది. దీనికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.
ఈ రాజ్యాంగ సవరణ ఆర్మీ చీఫ్ను దేశ రక్షణ దళాల అధిపతిగా మారుస్తుంది. ఆ పదవిని మునీర్కే కట్టబెడతారన్నది అందరూ ఊహిస్తున్న విషయమే. అదే జరిగితే అతనికి సైన్యం, నేవీ, వైమానిక దళంపై ఏకపక్ష ఆధిపత్యాన్ని కల్పిస్తుంది. ఒక విధంగా దేశానికి ఆయనే సర్వాధికారి. అంతేకాకుండా ఈ రాజ్యాంగ సవరణతో పౌర పర్యవేక్షణ చివరి పొరను కూడా నిర్వీర్యం చేస్తుంది. పెళుసైన ప్రజాస్వామ్యాన్ని ఫీల్డ్ మార్షల్ దేశంగా మారుస్తుంది.

కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ గురువారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మీడియా కథనాల ప్రకారం తుపాను కారణంగా సుమారు 20 లక్షల మంది ప్రభావితమయ్యారు. 5.6 లక్షల మంది గ్రామస్థులు నిరాశ్రయులయ్యారు.

మెక్సికోలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఏకంగా ఆ దేశాధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ నడిరోడ్డుపై లైంగిక వేధింపులు ఎదుర్కోవడం కలకలం సృష్టించింది. మిచొకాన్లో ఆమె మంగళవారం ఓ బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ క్లాడియా ప్రజలతో మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేయి వేస్తూ.. ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది పడుతూ.. అతడి చేతిని పక్కకు నెట్టారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు క్లాడియా బుధవారం తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇండోనేషియా ని మరోసారి భారీ భూకంపం వణికించింది. సులవేసి ద్వీపం లో బుధవారం ఉదయం భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
ఈ భూకంపం ధాటికి ఉత్తర తీరంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిసింది. ప్రస్తుతానికి సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
వారం రోజుల్లో ఇండోనేషియాలో భూమి కంపించడం ఇది రెండోసారి. గతవారం మలుకు దీవుల సమీపంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. బండా సముద్రంలో దాదాపు 137 కిలోమీటర్ల లోతులో 6.6 తీవ్రతతో భూమి కంపించింది. తాజాగా బుధవారం కూడా మరోసారి అదే స్థాయిలో భూకంపం సంభవించింది. వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఆఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 21 మంది చనిపోగా, 30 మందికి పైగా గల్లంతయ్యారు. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని సదరు మంత్రి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


