చిట్టి న్యూస్

Pakistani Nationals:  పాక్ పౌరులు దేశం వీడేందుకు నేడే చివరి రోజు..

కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దేశిత‌ గడువులోపు దాయాది దేశ పౌరులు భారత్ విడిచి వెళ్లాలని తెలిపింది. పాకిస్తాన్ దేశస్థులు భారత్ ను వీడేందుకు ఈ రోజు (ఏప్రిల్ 29) చివరి రోజు.. మెడికల్ వీసాలపై వచ్చిన వారికి కూడా ఇవాళ డెడ్ లైన్.. దేశం విడిచి వెళ్ళిపోవాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లిపోతున్నారు.

CRIME: ఆస్తి కోసం తల్లిదండ్రుల హత్య

ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ఓ కిరాతక కొడుకు దారుణంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో ఈ దారుణం జరిగింది. తన తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్‌ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై కుమారుడితో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అప్పలనాయుడు (55), జయ (45)లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు.

భర్తను చంపిన భార్య

రంగారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది. ధన్నారానికి చెందిన ప్రవీణ్ భార్య ప్రమీల కొంత కాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో శుక్రవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి ప్రవీణ్‌కు ఉరివేసి హత్య చేసింది. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.


Badminton Star Gutta Jwala : పెళ్లి రోజే ఆడబిడ్డకు జన్మనిచ్చిన బ్యాడ్మింటన్ స్టార్

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి రోజునే పాప పుట్టడం చాలా ఆనందంగా ఉందని జ్వాల-విశాల్ సోషల్ మీడియాలో అభిమానులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమిళ నటుడు విష్ణు విశాల్‌తో జ్వాలకు 2021 ఏప్రిల్ 22న వివాహం జరిగింది. మొదటి భార్య రజినీ నాయర్‌తో ఆయనకు ఇప్పటికే ఓ కొడుకు (ఆర్యన్) ఉన్నాడు. కాగా విశాల్-రజినీ 2010లో పెళ్లి చేసుకుని 2018లో విడిపోయారు.

క్రికెట్‌లో కొంతకాలం కెరీర్‌ తర్వాత 2009లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విష్ణు విశాల్‌. ‘ఎఫ్‌ఐఆర్‌’ సినిమాతో తెలుగువారికి దగ్గరయ్యారు. గతేడాది విడుదలైన ‘లాల్‌ సలాం’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించారు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్‌ గుత్తా జ్వాలా కూడా నితిన్‌ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ఒక స్పెషల్‌ సాంగ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan: కూటమి నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూటమి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే జిల్లాల పర్యటనకు వస్తానని, భూదందాల బాధితులను నుంచి ఆర్జీలు స్వీకరించి, వాటిని స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే తెలిస్తే కూటమి నేతలైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి పాలన పారదర్శకంగా, నిష్ఫక్షపాతంగా సాగుతోందని, దానికి అలానే కంటిన్యూ చేసేలా నేతలు వ్యవహరించాలన్నారు. ఇక నుంచి భూ సమస్యలపై స్వయంగా తానే జిల్లాలకు వెళ్లి అర్జీలు స్వీకరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. అలాగే కబ్జాలకు పాల్పడిన ఎవరినైనా సరే శిక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారులతో జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌ లో పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.ఇటీవల ఉగాది పర్వదినం సందర్భంగా పిఠాపురంలో 10వేల మంది మ‌హిళ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ చీరలను పంపిణీ చేశారు. త‌న‌ను ఆద‌రించి గెలిపించినందుకు కుటుంబానికి ప‌సుపు కుంకుమ కింద వీటిని పంపిస్తున్న‌ట్టు తెలిపారు.

Vizag: మ్యారేజ్ బ్యూరో ముసుగులో అత్యాచారాలు

విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరిట చేస్తున్న అరాచకాలు బహిర్గతమయ్యాయి. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి.. మత్తు మందు ఇచ్చి ట్రాప్ చేసి అత్యాచారాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. బాధితులు స్పృహలో లేని సమయంలో నగ్న వీడియోలు చిత్రీకరించి.. కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఓ బాధితురాలు పోలీసులకి ఫిర్యాదు చేసినా న్యాయం దక్కకపోవడంతో ఆమె మీడియాను ఆశ్రయించింది. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపీడో పేరిట అమ్మాయిల వివరాలను ముఠా సభ్యులు సేకరిస్తున్నారు. పెళ్లి కాని యువతులను టార్గెట్ చేసి, మత్తు మందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాళ్లను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గర్భం తీయించకపోతే రూ.20 వేలు సుపారీ ఇచ్చి పైకి పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సుమారు 30 మంది బాధితరాళ్ల నగ్న వీడియోలు చిత్రీకరించి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

Earthquake: అఫ్గాన్‌లో భూకంపం..

అఫ్గానిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.9 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు వచ్చాయి. బాగ్లాన్‌ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో 121 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తొలుత6.4 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చిందని ఈఎంఎస్‌ఈ ప్రకటించడం గమనార్హం. అఫ్గానిస్థాన్‌లో వచ్చిన భూకంపం ప్రభావం భారత్‌ వరకు చూపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోనూ భూప్రకంపనలు వచ్చాయి. కాగా, అఫ్గాన్‌లో వచ్చిన భూకంపానికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Wedding Dates : మళ్లీ పెళ్లి ముహూర్తాలు.. తేదీలు ఇవే!

రేపటి నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30, మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30, జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయన్నారు. జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని.. మళ్లీ JUL 25 నుంచి శ్రావణమాసంలో మంచిరోజులు ఉన్నాయన్నారు. కాగా ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.

ఇక పోతే.. జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢమాసంలో ముహుర్తాలు లేవని.. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసంలో మంచి రోజులు ఉన్నాయన్నారు. కాగా ఈ నెల(ఏప్రిల్) 30వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా వేల పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉందని పురోహితులు అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో మంచి ముహూర్తాలు అధికంగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు సిద్ధం అవుతున్నారు.

Sabarimala: శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్ల విక్రయలు ప్రారంభం

అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త తెలిపింది. దేవస్థానం బోర్డు ఇటీవల ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. పవిత్ర విషు పర్వదినం సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ సోమవారం లాకెట్ల విక్రయాలను ప్రారంభించారు. శబరిమల ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన బంగారు లాకెట్లను దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా భక్తులకు విక్రయిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన తొలి లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు అందుకున్నారు. అయ్యప్ప రెండు గ్రాముల లాకెట్ ధర రూ.19,300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ.38,600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ.77,200లుగా నిర్ణయించారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటన విడుదల చేసింది. 

US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. న్యూయార్క్‌లో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. న్యూయార్క్‌లో ఒక చిన్న విమానం కూలిపోవడంతో ఒకరు మరణించారు. అయితే, ఈ విమాన ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అల్బానీకి దక్షిణంగా శనివారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులతో వెళ్తున్న ఒక చిన్న విమానం కూలిపోయి, ఒకరు మృతి చెందారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు తెలిపారు.

మిత్సుబిషి MU-2B విమానం మసాచుసెట్స్ రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని న్యూయార్క్‌లోని కోపేక్‌లో మధ్యాహ్నం 12:15 గంటలకు (1615 GMT) బయలుదేరి, న్యూయార్క్‌లోని హడ్సన్ సమీపంలోని కొలంబియా కౌంటీ విమానాశ్రయానికి వెళుతోందని కొలంబియా కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం మరిన్ని వివరాలను అందిస్తారని FAA, స్థానిక షెరీఫ్ కార్యాలయం రెండూ తెలిపాయి. విమానం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Earthquake : పపువా న్యూ గినియాలో భూకంపం..

 పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశమైన పపువా న్యూ గునియాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.2గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే   తెలిపింది. కోకోపో  పట్టణానికి ఆగ్నేయంగా 115 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 72 కిలోమీటర్ల (44 మైళ్ల) లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ సునామీ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. కాగా, పపువా న్యూ గునియాలో భూకంపం సంభవించడం వారంలో ఇది రెండోసారి. గత వారం సరిగ్గా ఇదే రోజు అంటే శనివారం పశ్చిమ న్యూ బ్రిటన్‌ ప్రావిన్స్‌    లో భూమి కంపించింది. కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో అప్పుడు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి  . ఇలా వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Michelle Obama : ఒబామాతో విడాకుల రూమర్స్‌పై మిషెల్ స్పందన

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విడాకుల వార్తలను మిషెల్ ఒబామా ఖండించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ ప్రచారం మహిళల స్వేచ్ఛపై దాడేనని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఒబామాతో కలిసి మిషెల్ ఈవెంట్లకు హాజరు కాకపోవడంతో విడాకుల ప్రచారం జోరందుకుంది. అయితే ఆ కార్యక్రమాలకు వెళ్లడమనేది తన వ్యక్తిగత విషయమే తప్ప వైవాహిక బంధంలో ఏర్పడిన వివాదాల వల్ల కాదన్నారు. ఇతరులనుకునేది చేయడం తన పని కాదని తేల్చి చెప్పారు.

‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటోందని ఎవరూ గ్రహించడంలేదు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకుంటున్నారు. నేను మాత్రం నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది నేను చేయను’ అని మిషెల్‌ చెప్పుకొచ్చారు.

Pilot Dies :  విమానం ల్యాండ్‌ అవ్వగానే గుండెపోటుతో పైలట్‌ మృతి

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే.. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్‌ అర్మాన్  బుధవారం శ్రీనగర్‌  నుంచి ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. అయితే, అతడికి ఇదే చివరి విమాన ప్రయాణం అవుతుందని ఊహించలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన కాసేపటికే అర్మాన్‌ అస్వస్థతకు గురయ్యా డు. దీంతో తోటి సిబ్బంది అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అర్మాన్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అంతకుముందు విమానంలో కూడా అతను వాంతులు చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.

Renu Desai : అందుకే రెండో పెళ్లి చేసుకోలేదు: రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్‌తో విడాకుల అనంతరం తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం చేసుకోలేదని రేణు దేశాయ్ తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్‌షిప్‌కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15 సంవత్సరాలు . బహుశా ఆమెకు 18 సంవత్సరాలు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని పేర్కొన్నారు. ఇక మొత్తానికైతే మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఆలోచనను అభిమానులతో పంచుకోవడంతో చాలామంది అభిమానులు రేణూ దేశాయ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. సింగిల్ పేరెంట్ గా ఇద్దరు పిల్లల బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన పనేమీ కాదు. పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడిన వెంటనే మీరు మీ వ్యక్తిగతంగా ఆలోచించండి.. మీకంటూ ఒక తోడును వెతుక్కోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Dominican Republic : నైట్‌క్లబ్‌లో కూలిన పైకప్పు , మృతులు 124 మంది

కరేబియన్‌ దేశమైన డొమినికన్‌ రిపబ్లిక్‌ రాజధాని శాంటో డొమింగోలోని ఒక నైట్‌ క్లబ్‌ పైకప్పు కూలిన ప్రమాదంలో వంద మందికి పైగా మరణించగా, 155 మంది గాయపడ్డారు. ప్రమాదంలో 124 మంది మరణించారని, మృతులలో ఇద్దరు మేజర్‌ లీగ్‌ బాస్కెట్‌ బాల్‌ మాజీ క్రీడాకారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మంగళవారం ఒంటి గంటకు ఒక బ్యాండ్‌ ప్రదర్శనను తిలకిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో క్లబ్‌లో 300 మంది ఉన్నారు. ప్రదర్శన ఇస్తున్న మెరెంగ్యూ కళాకారుడు రూబీ పెరెజ్‌ జాడ కూడా తెలియరాలేదు. మృతులలో ఆయన కూడా ఉండి ఉంటారని భావిస్తున్నారు.

America : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వీసా రద్దు

 అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్‌ విధానాలతో గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక దినదిన గండంగా గడుపుతున్నారు. గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పుడు దానికి వీసా రద్దు చేయడం ద్వారా శిక్ష విధిస్తున్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు పెరిగినట్టు పలు అమెరికన్‌ కాలేజీలు వెల్లడించాయి. వీసా రద్దయిన విద్యార్థుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో సంబంధం లేని వారి వీసాలు కూడా రద్దవుతున్నట్టు తెలిపాయి. హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, యూసీఎల్‌ఏ, ఒహాయో స్టేట్‌ సహా పలు ప్రముఖ యూనివర్సిటీల అధికారులు తాము ఫెడరల్‌ ఇమిగ్రేషన్‌ డాటాబేస్‌ను చూసిన తరువాత ఈ విషయం తెలిసిందని అన్నారు.

APPSC: గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలు విడుదల

గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 905 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్స్‌ సహా సాధారణ కోటాతో కలిపి మొత్తం 2,517 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరికీ ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్‌ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు. గ్రూప్‌-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్‌ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టు ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతో పాటు మెయిన్‌ పరీక్ష ఫైనల్‌ ‘కీ’ని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

RJ Mahwash  : డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

పెళ్లి, డేటింగ్‌ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.

‘‘నా జీవితంలోకి ఏ అబ్బాయి అయితే వస్తాడో.. అతనే ఏకైక వ్యక్తి అవుతాడు. అతడే నాకు స్నేహితుడు. అతనే నా ప్రియుడు. అతనే నా భర్త. నా జీవితం అతడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నాకు అవసరం లేని వ్యక్తులు వద్దు. ఆ సమయంలో నేను ఇతర అబ్బాయిలతో మాట్లాడలేను’’ అని వీడియోను మహ్‌వశ్‌ షేర్ చేసింది. దానికి చాహల్‌ లైక్‌ చేశాడు. దీంతో ఓ అభిమాని స్పందిస్తూ.. ‘‘యుజీ భాయ్‌ ఆ మూల నుంచి నవ్వుతున్నాడు’’ అంటూ కామెంట్ పెట్టాడు. ‘ప్రతిదీ తాత్కాలికమే. చాహల్‌ ఇచ్చిన లైక్ శాశ్వతం’ అంటూ మరొకరు స్పందించారు. 

Zomato Lays Off : 500 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో

ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ జొమాటో 500 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్ గా విధులు నిర్వర్తిస్తున్న వీరిని ఉద్యోగం ఇచ్చిన సంవత్సరంలోగానే తొలగించింది. జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ (జడ పీ) పేరుతో సంవత్సరం క్రితం ఫుడ్ డెలివరీ స్టాట్ఫామ్ నియామకాలు చేపట్టింది. కస్టమర్ సపోర్ట్ విభాగం కింద 1500 మందిని నియమించింది. వీరిలో చాలా మంది పనితీరు ఆశించన మేర లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం. వంటి కారణాలు చూపి నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించింది. తొలగించిన వారికి నెలరోజుల వేతనం పరిహారంగా ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కస్టమర్ సపోర్ట్ విధానాలను ఆటోమేట్ చేయడంతో పాటు, ఖర్చులను నియంత్రించుకునేందుకు కృత్రిమ మేధను వినియోగించుకోవాలని జొమాటో నిర్ణయించింది. ఇందులో భాగం గానే జొమాటో లేఆఫ్ు చేపట్టింది. జోమా టో చర్య మూలంగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ డెలివరీ వ్యాపారంలో మందగమనం నెలకొందని జొమాటో ప్రకటించింది. క్విక్ కామర్స్ విభాగంలో పెరుగుతున్న పోటీ మూలంగా జొమాటో అనుబంధ సంస్థ బ్లింకిట్ నష్టాలను ఎదుర్కొంటోంది.

Telangana : ఐదు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు

రానున్న అయిదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధ, గురు వారాల్లో ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడనుందని చెప్పింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో 40 నుంచి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. భూ ఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభా వంతో వర్షాలు కురవనున్నాయని అధి కారులు తెలిపారు.

వడగండ్ల వాన కురవనున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరాత్వాడ మరియు దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం ఈరోజు మధ్య మహారాష్ట్ర మరియు దాని పరిసర ప్రాంతాల్లో అదే ఎత్తులో కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మరాత్వాడ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణీ మంగళవారం దక్షిణ ఛత్తీస్ గడ్ నుండి మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం వరకు అదే ఎత్తులో కొన సాగుతోందని పేర్కొంది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. వర్షాల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుండి నాలుగు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Water Drone: వాటర్‌ డ్రోన్‌.. ట్రయల్‌ రన్‌ విజయవంతం

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్‌ డ్రోన్‌ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. నౌకాదళ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థ అభివృద్ధి చేస్తున్న హై ఎండ్యూరెన్స్‌ అటానమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్‌ ప్రయోగ పరీక్షను ఓ సరస్సులో నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా డీఆర్‌డీవో వెల్లడించింది. భూ ఉపరితలంపై, నీటిలోనూ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది. ఈ పరీక్షలో వెహికల్‌ సోనార్‌లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మెరుగ్గా పనిచేసినట్లు పేర్కొంది. భూతల, సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్, శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది. 6 టన్నులు బరువు ఉండే ఈ వాటర్‌ డ్రోన్‌ పొడవు 9.75 మీటర్లని తెలిపింది. గరిష్ఠంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యమున్న ఇది 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. 

Waqf bill : ఏప్రిల్ 2న లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..

 బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ బిల్లు ఏప్రిల్ 02న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఆగస్టు 2024లో జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపబడిన ఈ బిల్లు, లోక్‌సభ ముందుకు రాబోతోంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు బీజేపీ సీనియర్ మంత్రులు ఇండియా కూటమి నేతలతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ బిల్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఈ బిల్లు ద్వారా ముస్లింల హక్కుల్ని హరిస్తున్నారంటూ ఆ వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఇన్నా్ళ్లు వక్ఫ్ బోర్డుల ఇష్టారాజ్యానికి, అపరిమిత అధికారాలకు ఈ బిల్లు ద్వారా అడ్డుకట్ట వేస్తామని బీజేపీ చెబుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 04తో ముగియనున్నాయి. అయితే, ఈ బిల్లు చట్టంగా మారాలంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాలి.

RAJA SINGH: ఔరంగజేబ్ సమాధిని కూల్చేస్తాం: రాజాసింగ్

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబ్ సమాధిని కూల్చి వేస్తామని, సముద్రంలో పడేస్తామని అన్నారు. అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా తెలంగాణ హిందువులు వెళ్తారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశంతోనే అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. ఈసారి అనుమతి కోసం దరఖాస్తు కూడా వేయలేదని తెలిపారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, ఔరంగజేబు, బాబర్ వారసులు పరేషాన్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలోని మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ ఇటీవల డిమాండ్లు కొనసాగాయి. ఆ ప్రాంతంలో పోలీస్‌ భద్రతను కట్టుదిట్టం చేసింది. మహారాష్ట్రలోని శంభాజీనగర్‌ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది.

Vodafone Idea:  వొడాఫోన్ ఐడియాలో మరింత పెరగనున్న కేంద్ర ప్రభుత్వ వాటా

రుణ భారంతో కుదేలైన మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (విఐ)లో వాటాను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే కంపెనీలో 22.6 శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉండగా, కంపెనీ బకాయిపడిన స్పెక్ట్రమ్ వేలం మొత్తాన్ని తన వాటాగా మార్చుకోనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం దాదాపు రూ.37 వేల కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఈ విషయాన్ని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 2021 టెలికాం రంగ సంస్కరణలు, మద్దతు ప్యాకేజీకి అనుగుణంగా వేలం బకాయిలను ఈక్విటీ షేర్లుగా మార్చుకునేందుకు నిర్ణయించినట్లు టెలికాం మంత్రిత్వ శాఖ ఫైలింగ్‌లో వెల్లడించింది.

 

PM Modi: ఆర్ఎస్ఎస్ ప్రముఖులకు నివాళులు అర్పించిన ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హెడ్గేవార్‌ స్మృతి మందిరాన్ని దర్శించిన ప్రధాని ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్‌కి, ఆర్ఎస్ఎస్ రెండో సర్సంఘ్‌చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్‌ స్మారక చిహ్నాల వద్ద నివాళులు అర్పించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలిసి ప్రధాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ప్రధాని మోడీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ బౌద్ధాన్ని తీసుకున్న దీక్షాభూమిని సందర్శించారు. అంబేద్కర్‌ని నివాళులు అర్పించారు.

HYD: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని మెట్రో రైల్ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. మెట్రో రైల్ చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:00 గంటలకు బదులుగా 11:45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు. ఈ మార్పు వల్ల రాత్రివేళ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. విద్యార్థులు మెట్రో సేవలను మరింతగా వినియోగించుకునేలా 20 ట్రిప్పుల టికెట్ కొనుగోలు చేస్తే 30 ట్రిప్పులు ప్రయాణించే ఆఫర్‌ను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో హైదరాబాద్ మెట్రో కీలక పాత్ర పోషిస్తోందని హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి,శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. 

KL Rahul : తండ్రైన కేఎల్ రాహుల్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆతియా

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతడి భార్య ఆతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను రాహుల్, ఆతియా జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. వీరికి అభిమానులు, సినీ ప్రముఖులు,క్రికెటర్ల నుంచి భారీ స్థాయిలో అభినందనలు వెలువెత్తాయి. రాహుల్, ఆతియా జంటకు సోషల్ మీడియాలో అందరూ శుభకాంక్షలు తెలుపుతున్నారు. రాహుల్ భారత క్రికెటర్కాగా.. ఆతియా శెట్టి ప్రముఖ బాలీవుడ్ హీరో సునిల్ శెట్టి కూతురు. వీరిద్దరూ 2023లో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ జంటకు పండంటి పాప పుట్టింది. ఇక ఐపీఎల్-2025 సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆతియా ప్రసవానికి సిద్ధంగా ఉండటంతో రాహుల్ సోమవారం ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు.

Samsung Co-CEO : గుండెపోటుతో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-సీఈవో మృతి

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కో-సీఈవో హాన్ జోంగ్-హీ (63) గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. శామ్‌సంగ్‌లోని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ & మొబైల్ డివైజెస్ విభాగానికి హాన్ బాధ్యత వహిస్తుండగా, మరో కో-సీఈవో జున్ యంగ్-హ్యూన్ చిప్ బిజినెస్‌ను పర్యవేక్షిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో, అలాగే దాని టీవీ మరియు ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలలో చైనా ప్రత్యర్థుల నుండి శామ్‌సంగ్ పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటున్న తరుణంలో హాన్ మరణ వార్త వెలువడింది. ఉదయం ట్రేడింగ్‌లో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు స్థిరంగా ఉన్నాయి. హాన్ 2022లో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ మరియు CEOగా, కంపెనీ బోర్డు సభ్యులలో ఒకరిగా నియమితులయ్యారు.

samsung: శాంసంగ్ కో సీఈఓ హాన్‌ జోంగ్- హీ కన్నుమూత

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ శాంసంగ్‌  కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హన్‌ జోంగ్‌-హీ  (63) కన్నుమూశారు. కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా కంపెనీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. హాన్ జోంగ్-హీ శామ్సంగ్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్, మొబైల్ పరికరాల విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆ కంపెనీ మరో సహ-CEO జున్ యంగ్-హ్యూన్ దక్షిణ కొరియాలోని అతిపెద్ద కంపెనీలో కీలకమైన భాగమైన చిప్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కంపెనీ మరో సహ-CEO జున్ యంగ్-హ్యూన్ సెమీకండక్టర్ (చిప్) వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. హాన్ 2022లో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ఛైర్మన్ మరియు CEOగా నియమితులయ్యారు. ఆయన కంపెనీ బోర్డు సభ్యుడు కూడా.స్మార్ట్‌ఫోన్, టీవీ, ఇతర ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో చైనా కంపెనీల నుండి శామ్‌సంగ్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో హాన్ మరణం సంభవించింది. ఇటీవలి కాలంలో, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ తన మొదటి స్థానాన్ని ఆపిల్‌కు కోల్పోయింది.


Wedding Dates : ఏప్రిల్ నెలలో ముహూర్తాల జాతర

ఏప్రిల్ నెలలో ఏకంగా 9 పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఒకే నెలలో ఇన్ని మంచి రోజులు ఉండడం చాలా అరుదు. ఏప్రిల్ 1 నుంచి 13 వరకు మూఢాలు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. ఆ తర్వాత 9 ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాది వివాహాలు జరగనున్నాయి. ఏప్రిల్ నెలలో 13వ తేదీ నాటికి మూఢాలు వెళ్లిపోతాయి. సూర్యుడు కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఏప్రిల్ నెలలో 13 తేదీ వరకు అంటే దాదాపు సగం రోజులు పెళ్లి ముహూర్తాలు లేవు. కానీ ఆ తర్వాత మరో సగం రోజుల్లో అంటే కేవలం 16 రోజుల్లో 9 ముహూర్తాలు ఉన్నాయి.

Manipur :మణిపూర్‌లో సుప్రీంకోర్టు జడ్జిల పర్యటన

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో త్వరలో మంచిరోజులు వస్తాయని, దేశంలోని మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో తిరిగి శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు ప్రజలంతా కలిసి పని చేయాలని ఆయన కోరారు. జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రతినిధుల బృందం శనివారం మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో పర్యటించింది. ఈ బృందంలో జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ ఉన్నారు. తమ పర్యటనలో భాగంగా అల్లర్లలో నిర్వాసితులైన వారిని శనివారం న్యాయమూర్తులు పరామర్శించారు. చురాచాంద్‌పుర్‌ జిల్లా లమ్‌కాలో ఉన్న మినీ సచివాలయం నుంచి పలు న్యాయ, వైద్య శిబిరాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడుతూ.. ‘‘భిన్నత్వంలో ఏకత్వానికి మన దేశం ప్రతీక. మీరు క్లిష్ట సమయంలో ఉన్నారన్న విషయం మాకు తెలుసు. రాజ్యాంగంపై నమ్మకం ఉంచండి. తప్పకుండా మణిపుర్‌లో శాంతి నెలకొంటుంది’’ అని అన్నారు.

TGSPDCL: విద్యుత్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూకీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఛార్జీల పెంపునకు ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ ముందు టారిఫ్ ప్రతిపాదనలను ఉంచిన తర్వాత ఈ విషయాన్ని తెలిపారు.ఇవాళ విద్యుత్‌ నియంత్రణ భవన్‌లో ఈఆర్సీ చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ డి. నాగార్జున అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదని తెలిపారు. టీజీపీఎస్సీ డీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యుత్ సంస్థల నిర్ణయంతో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల్లో పెరుగుదల లేకపోవడం సామాన్య ప్రజలపై భారం తగ్గించనుంది.

Tulsi Plant at Home : తులసి మెుక్క ఇంట్లో ఉంటే కలిగే లాభాలివే..!

హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మెుక్కను లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. దోమలు, కీటకాలు వంటివి ఇంట్లోకి రాకుండా రక్షణ కల్పిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఉంటే పాజిటివ్ ఎనర్జీ. తులసి ఆకుల్ని నమిలితే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు ఉపశమనం లభించడంతో పాటు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి, తద్వారా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. వీటి వాసన పీల్చుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యం, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఆయుర్వేదంలో కూడా తులసిని ఎన్నో ఔషధాలలో వాడతారు. ముఖ్యంగా తులసి రోజుకి 20 గంటలు ఆక్సీజన్‌ని విడుదల చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులని గ్రహిస్తుంది. ఇండోర్ గాలిని కూడా శుద్ధి చేయడానికి చాలా మంచిది.

New Zealand PM:  ఢిల్లీ గల్లీ లో   క్రికెట్‌ ఆడిన న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్‌

న్యూజిలాండ్ ప్ర‌ధాని క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్ ప్రస్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ వీధుల్లో అక్క‌డి పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతూ స‌ర‌దాగా గ‌డిపారు. ఆయ‌న‌తో పాటు కివీస్ మాజీ క్రికెట‌ర్ రాస్ టేల‌ర్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల‌ను ఏకం చేయ‌డంలో క్రికెట్‌ను మించిన‌ది లేదంటూ క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్‌ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోల‌ను పంచుకున్నారు.

కాగా, తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను న్యూజిలాండ్‌ ప్రధాని కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ  , క్రిస్టఫర్ లక్సన్ సోమవారం దిల్లీలో విస్తృత స్థాయి చర్చలు కూడా జరిపారు.

Ahmedabad: గుజరాత్‌లో వంద కోట్ల విలువైన బంగారం స్వాధీనం

గుజరాత్‌లో పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో కిలోల కొద్దీ బంగారం, డబ్బుల కట్టలు చూసి అధికారులు, పోలీసులు షాక్‌కు గురయ్యారు. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌ పల్దీ ప్రాంతంలో ఆవిష్కార్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌పై అధికారులు దాడులు చేపట్టగా, దాదాపు 90 కోట్ల రూపాయల విలువ జేసే బంగారం కడ్డీలు, ఆభరణాలు, నగదు లభ్యమైనట్టు గుజరాత్‌ పోలీసులు వెల్లడించారు. ఈ దాడులకు సంబంధించి మేఘ షా, అతడి తండ్రి మహేంద్ర షాలను పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. డీఆర్‌ఐ, ఏటీఎస్‌ అధికారులు ఫ్లాట్‌కు చేరుకునే ముందు, ఫ్లాట్‌కు తాళం వేసి నిందితులు ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారని పోలీసులు చెప్పారు. బంగారం మూలాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ‘సుమారుగా 95.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.60-70 లక్షల నగదు సీజ్‌ చేశాం. నిందితులు అక్రమంగా తరలించిన బంగారం, భారీగా నగదును ఫ్లాట్‌లో దాచిపెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి’ అని ఏటీఎస్‌ అధికారి ఎస్‌ఎల్‌ చౌదరీ చెప్పారు.


Israel-Hamas:   గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు,  59 మంది మృతి

ఇజ్రాయెల్‌- హమాస్‌  ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గాజా పై టెల్‌అవీవ్‌ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది. ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 44 మంది చనిపోయారు. అలాగే దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

AP: చిత్తూరు జిల్లాలో కాల్పుల కలకలం

చిత్తూరులో కాల్పులు కలకలం రేపాయి. గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి దుండగులు చొరబడి రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. అయితే యజమాని అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వెంటనే అప్రమత్తమైన యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. యజమాని నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో కాల్పులు జరిపిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.