వరల్డ్కప్లో కనిపించని జోష్ ..ఇండియా మ్యాచ్ లేటుకు కారణం అదే

వన్డే ప్రపంచకప్ అంటే ఒకప్పుడు మామూలు హంగామా కాదు… టోర్నీ ఆరంభానికి ముందే ఆయా దేశాల్లో క్రికెట్ సందడి ఒక రేంజ్లో కనిపించేది. ఆతిథ్య దేశమైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు… టోర్నీ జరిగినన్ని రోజులూ కార్నివాల్ వాతావరణమే. అలాంటిది ప్రస్తుతం జరుగుతోన్న వరల్డ్కప్లో సందడి అంతంత మాత్రంగానే ఉంది. టోర్నీ మొదలై నాలుగు రోజులు గడిచినా… అభిమానుల్లో జోష్
మాత్రం మిస్సైనట్టు కనిపిస్తోంది. మ్యాచ్లు వన్సైడ్గా జరుగుతుండడం ఒక కారణమైతే… క్రికెట్ను మతంలా భావించే టీమిండియా ఇంకా తమ వేట మొదలుపెట్టకపోవడం మరో కారణం. వరల్డ్కప్ షెడ్యూల్లో కోహ్లీసేన తొలి మ్యాచ్ టోర్నీ మొదలైన వారం రోజులకు ఆడబోతోంది. ఈ ఆలస్యానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్. షెడ్యూల్ ప్రిపరేషన్ టైమ్లోనే బీసిసిఐ , ఐసిసిని భారత్ ఆడే మ్యాచ్లను రెండో వారంలో పెట్టమని కోరినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే టైటిల్ హాట్ ఫేవరెట్గా ఉన్న టీమిండియా బుధవారం తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. ప్రస్తుతానికి ఆటగాళ్ళంతా నెట్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నారు. అయితే భారత జట్టు ఇంకా తొలి మ్యాచ్ ఆడకపోవడంతో టోర్నీకి వరల్డ్కప్ జోష్ కనిపించడం లేదు. సఫారీలతో మ్యాచ్ మొదలైతే తప్ప టోర్నీకి అసలైన కళ వచ్చే అవకాశాలు లేవు.
మరోవైపు ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్లన్నీ దాదాపు వన్సైడ్గానే ముగిసిపోయాయి. పరుగుల వరద ఖాయమనుకున్న పిచ్లలో భారీస్కోర్లు నమోదు కాకపోవడం కూడా అభిమానులను నిరాశపరుస్తోంది. అయితే ఆదివారం జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్తో కాస్త ఊపొచ్చినట్టు చెప్పొచ్చు. ఫేవరెట్గా బరిలోకి దిగిన సఫారీలకు బంగ్లాదేశ్ షాకివ్వడంతో టోర్నీలో తొలి సంచలనం నమోదైంది. అటు భారత్ మ్యాచ్ ఆలస్యంగా ఉండటం ఆటగాళ్లకు కలిసొచ్చేదే కానీ.. ప్రపంచకప్లో ఇంకా భారత్ మైదానంలో అడుగు పెట్టకపోవడం అభిమానులకు కాసింత నిరాశ కలిగించేదే. ఐతే కోహ్లీసేన ఎప్పుడు ఆట మొదలుపెడితే అప్పట్నుంచి ప్రపంచకప్లో జోష్ రావడం ఖాయం.
చప్పగా సాగుతోన్న ప్రపంచకప్లో తొలి సంచలనం నమోదైంది. ప్రతీసారీ టోర్నీలో సంచలనాలు సృష్టించే బంగ్లాదేశ్ , సౌతాఫ్రికాకు షాకిచ్చింది. బ్యాట్స్మెన్ ఆధిపత్యం కనబరిచిన పోరులో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో 330 పరుగులు చేసింది. ఛేజింగ్లో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. మిడిలార్డర్లో డుమ్నీ, మిల్లర్ పోరాడినా… సాధించాల్సిన రన్రేట్ ఎక్కువగా ఉండడంతో సఫారీలకు ఓటమి తప్పలేదు. స్లాగ్ ఓవర్స్లో బంగ్లా పేసర్ ముస్తిఫిజర్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఇది వరుసగా రెండో ఓటమి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com