దొంగతనానికి వచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు

దొంగతనానికి వచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయాలనుకున్నాడు. పనీ పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆదుకున్నాడు.. ఆశ్రయం ఇచ్చాడు. అయినా ఆ విశ్వాసం ఇసుమంతైనా లేకుండా, పని చేయడానికి ఇష్టపడని అతడు కష్టపడకుండా కాసులు వచ్చే మార్గం ఎంచుకున్నాడు. అది కాస్తా బెడిసి కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాకు చెందిన బాలాంజనేయులు అలియాస్ బాలు బతుకు దెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. పుప్పాలగూడ దుర్గా కాలనీ ప్రాంతంలోని రవీందర్ అనే వ్యక్తి వద్ద కొంతకాలం బాలు పనిచేశాడు. ఆ తరువాత కొద్ది రోజులకే అతడి వద్దకు పనికి వెళ్లడం మానేశాడు. ఈ మధ్య ఖాళీగా ఉంటున్నాడు. తినడానికి, రూమ్ రెంట్ కట్టడానికి పైసల్లేవు. దాంతో అక్రమంగా డబ్బు సంపాదించే మార్గం గురించి ఆలోచించాడు. అందుకోసం అతడు ఇంతకు ముందు పనికి వెళ్లి మానేసిన యజమాని రవీందర్ ఇంటికే కన్నం వేశాడు. అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో రవీందర్ ఇంటికి వెళ్లాడు బాలు. ఆ సమయంలో రవీందర్ కుటుంబసభ్యులు మేడపైన పడుకుని ఉన్నారు. దీంతో బాలు తన పని మరింత సులువు అవుతుందని భావించాడు. రవీందర్ ఇంటి తాళాలు పగులగొట్టి బాలు వారి ఇంటిలోకి వెళ్తుండగా.. ఇది గమనించిన మూడో అంతస్తులోని వ్యక్తి బాలుని చూసి దొంగ దొంగ అని కేకలు వేశాడు. అంతే బాలు ఒక్కసారిగా వణికిపోయాడు. తప్పించుకునేందుకు అక్కడి నుంచి దూకేశాడు. మూడవఅంతస్థు నుంచి కిందపడడంతో తలకు తీవ్రంగా గాయాలవడంతో.. బాలు తల పగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Tags

Read MoreRead Less
Next Story