తాత పాడు బుద్ది.. మనవరాలిపై కన్నేసి.. అత్యాచారం చేసి..

తాత పాడు బుద్ది.. మనవరాలిపై కన్నేసి.. అత్యాచారం చేసి..

వయసు పెరిగినా బుద్ది పెరగలేదు. కాటికి కాళ్లు చాపుకునే వయసులో కామంతో రగిలిపోయాడు. అభం శుభం ఎరగని చిన్నారిని అత్యాచారం చేసి ఆపై ఏమీ ఎరగనట్టు ఆమెని చంపేసి కేసు తన మీద పడకుండా తప్పించుకుందామనుకున్నాడు. చేసిన పాపం ఊరికే పోదని పోలీసులు అతడిని కుళ్లబొడిచి కటకటాల వెనక్కు పంపించారు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరిగింది. పాతూరు గిరిజన కాలనీలో నివసిస్తున్న ఉప్పు వెంకటేశ్వర్లు(72)తో పాటు భార్య రమణమ్మ, కుమార్తె మంగమ్మ ఆమె కూతురు ఉంటున్నారు. వెంకటేశ్వర్లు నెల్లూరులోని ఓ లాడ్జిలో పని చేస్తున్నాడు. మంగమ్మ భర్త పోలయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా నెల్లూరులో పని చేస్తున్నాడు.

రెండ్రోజులకు ఒకసారి ఇంటికి వచ్చి వెళుతుంటాడు. 16 ఏళ్లు వచ్చిన కూతురికి పెళ్లి చేద్దామని భార్యతో అన్నాడు పోలయ్య. అప్పుడే పెళ్లంటావేంటి అని భర్తతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లి పోయింది మంగమ్మ. కూతురిని వెతుక్కుంటూ తల్లి రమణమ్మ వెళ్లింది. ఇంట్లో తాత, మనవరాలు ఇద్దరే ఉన్నారు. ఎప్పట్నించి మనవరాలి మీద కన్నేశాడో.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఒంటరిగా ఉన్న మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలిక ప్రతిఘటించడంతో తలపై బలంగా మోది అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారం చేశాడు. తీవ్ర పెనుగులాటలో బాలిక మృతి చెందింది. తాను చేసిన నీచమైన పనిని ఎవరూ ప్రశ్నించకూడదని బాలిక ఉరివేసుకుని మరణించిందని ఇరుగు పొరుగుని నమ్మించాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉరివేసుకున్న దాఖలాలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తాతపైనే నిఘా పెట్టారు. అతడే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడని తెలుసుకుని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story