చదివేది ఇంజినీరింగ్.. చేసేది స్మగ్లింగ్..
కృష్ణా జిల్లాలో బీటెక్ విద్యార్థులు గంజాయి విక్రేతలుగా మారిపోవడం కలకలం రేపుతోంది. విశాఖ నుంచి గంజాయి తెప్పించి.. బెజవాడ.. పరిసర ప్రాంతాల్లోని కాలేజీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్నామని బయటకు ఫోజు కొట్టినా.. వీరు చేస్తున్నది మాత్రం పక్కా స్మగ్లింగ్. ఉంగుటూరు, గన్నవరం మండల ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తుండగా.. విజయవాడ టాస్క్ఫోర్స్ పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
టాస్క్ఫోర్స్ అదుపులో ఉన్న 10 మందిలో ఆరుగురు బీటెక్ విద్యార్థులే.. వీరు అరకు నుంచి నేరుగా గంజాయి తెప్పించి కాలేజీల్లో అమ్ముతుంటారు. బెజవాడలోని ఐదు కాలేజీల్లో.. గన్నవరం, తెల్లప్రోలు, కానూరు, మొగల్రాజపురం ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో పట్టుబడ్డ బీటెక్ విద్యార్థుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అటు.. నాలుగు నెలల కిందట నలుగురు బీటెక్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చినా.. వారు తమ నడత మార్చుకోలేదు. మళ్లీ గంజాయి అమ్మకాలు సాగిస్తున్నారు. ఐతే.. నేరుగా గంజాయి అమ్మేవారితో విద్యార్థులకున్న సంబంధాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com