శ్రీలంకకు సాయం చేస్తాం :మోదీ
ఇటీవల ఉగ్రవాది దాడితో తీవ్రంగా వణికిపోయిన శ్రీలంకకు భారత ప్రధాని మోదీ బాసటగా నిలిచారు. ఉగ్రభూతంపై పోరాటంలో సాయం చేస్తానని హామీ ఇచ్చారు. భారతీయుల హృదయాల్లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు.
ప్రధానిగా రెండో సారి బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనలో భాగంగా మాల్దివులతో పాటు శ్రీలంకను సందర్శించారు. విమానాశ్రయం నుంచి నేరుగా కొచ్చికాడోలోని సెయింట్ ఆంథోని చర్చికి వెళ్లారు. గతంలో ఈస్టర్ ప్రార్థనల సమయంలో ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.ఉగ్రవాదుల పిరికి చర్యలు శ్రీలంక స్ఫూర్తిని ఓడించలేవన్నారు. ఉగ్ర గాయం నుంచి లంక త్వరగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయుల హృదయాల్లో శ్రీలంకకు ప్రత్యేక స్థానం ఉందని, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈస్టర్ దాడులు తర్వాత శ్రీలంకలో పర్యటించిన తొలి విదేశీ నేత ప్రధాని మోదీయే. ఆయనకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఘనస్వాగతం పలికారు. ప్రధాని మోదీ లంక సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అధ్యక్ష కార్యాలయంలోని విజిటర్స్ బుక్ లో సంతకం చేసిన మోదీ...ఆ తర్వాత మైత్రిపాల సిరిసేనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత శ్రీలంకలోని ప్రవాస భారతీయుల ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేస్తున్నారని వారిని అభినందించారు.
తక్కువ సమయమే అయినా శ్రీలంక పర్యటన చాలా చక్కగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. ఆదేశ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారాయన.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com