ఎలుకల మందును రుచి చూసిన యువకుడు.. ఆపై జరిగింది చూస్తే..
నిర్లక్ష్యంగా ఎలుకల మందును రుచి చూసిన యువకుడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం గోపవరంలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. చత్తీష్గడ్ రాష్ర్టానికి చెందిన రాబర్ట్ క్రిస్పోటా రెండునెలల కిందట గోపవరంలో పాస్టర్ శిక్షణ పొందేందుకు వచ్చాడు. అర్పణాలయంలో శిక్షణ పొందుతున్న పాస్టర్లు కుందేళ్ళను పెంచుతుంటారు. కుందేళ్లను ఎలుకల నుంచి రక్షించేందుకు పేస్టురూపంలో ఉన్న ఎలుకల మందును వినియోగిస్తున్నారు.
ఈనెల తొమ్మిదో తేదీన రాబర్ట్ క్రిస్పోటా ఎలుకల నిర్మూలించేందుకు పెట్టే మందును.. పని చేస్తోందో లేదో చూద్దాం అనుకుని.. కొంచెం నోట్లో వేసుకున్నాడు. మూడురోజుల వరకు బాగానే ఉన్న రాబర్ట్, నాలుగోరోజు వాంతులు చేసుకున్నాడు. పాస్టర్లు ఆరా తీయగా విషయం తెలుసుకుని బాధితుడిని విజయవాడలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాబర్ట్ను శనివారం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతదేహానికి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com