ఆమె కాళ్లు కలం పట్టాయి.. ఆత్మహత్యలపై కవితలు రాశాయి
ఆమె కాళ్లు కలం పట్టాయి. కవితలు రాశాయి. పట్టుదలతో కృషి చేస్తే వైకల్యాన్ని కూడా జయించవచ్చని నిరూపించింది. చేతులు పనిచేయకపోయినా, కాళ్లతో కలాన్ని పట్టి 700 కవితలు రాసింది. ఎంతో మంది ప్రశంసలు అందుకుంది.. తనలాంటి మరెందరికో ఆదర్శంగా నిలుస్తోంది..
ఈమె పేరు రాజేశ్వరి. స్వస్థలం సిరిసిల్ల . ఈమె చాలా మందికి సిరిసిల్ల రాజేశ్వరిగానే తెలుసు. తల్లిదండ్రులు బూర సాంబయ్య, అనసూర్య..! వీరిది చేనేత కుటుంబం. రాజేశ్వరికి పుట్టుకతోనే వైకల్యం ఉంది. మెడలు నిలబడవు. చేతులు వడితిరిగాయి. సరిగా నిల్చోలేదు. కానీ ఈమె పట్టుదల చూస్తే ఔరా అనాల్సిందే..
కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు బూర రాజేశ్వరి. తన 40వ ఏట ఇంటర్మీడియట్ పాసై అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఇంకా చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా కవితలపై దృష్టి పెట్టారు రాజేశ్వరి. చేతులు పనిచేయకపోయినా కాళ్లతో కలాన్ని పట్టి 700 కవితలు రాశారు.
కాళ్ళతోనే ల్యాప్ టాప్ నూ ఆపరేట్ చేస్తోంది రాజేశ్వరి. ఆమె ప్రతిభను చాలా మంది ప్రముఖులు అభినందించారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు..
నేత కార్మికుల ఆత్మహత్యలు రాజేశ్వరిని కలిచివేశాయి. తన ఆవేదనను కవితల రూపంలోవెల్లడించారు. అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నానని.. నేత కార్మికులు కూడా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.రాజేశ్వరి ప్రతిభను గుర్తించిన ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ... తన తండ్రి పేరుతో నెలకొల్పిన సుద్దాల హనుమంత జానకమ్మ రాష్ట్రస్థాయి అవార్డును ప్రదానం చేశారు.. అంతే కాదు రాజేశ్వరి రాసిన కవితలను కూడా పుస్తకరూపంలో తీసుకొచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com