తెలుగు రాష్ట్రాలో వాతావరణం కూల్.. రేపటినుంచి భారీ వర్షాలు..

ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలో వాతావరణం కూల్ అయ్యింది. పలుచోట్ల చిరుజల్లులు కురిసాయి. దీంతో ఎండ నుంచి జనం ఉపశమనం పొందారు. అటు వాతావరణ శాఖ తెలుగు ప్రజలకు చల్లటి కబురు అదించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల కారణంగా.. 4 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. తెలంగాణతో పాటు.. ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
మరోవైపు రేపు కేరళ, తీరప్రాంత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అటు కేరళ, తీర ప్రాంత కర్ణాటక, దక్షిణ కర్ణాటక, గోవా, కొంకణ్ తీరం, ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తీరప్రాంత ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
జూన్ నెల మొదటి వారంలో కేరళను తాకిన రుతుపవనాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను కారణంగా మందకొడిగా మారాయి. తుఫాను తేమనంతా పీల్చేసుకోవడంతో రుతుపవనాల విస్తరణకు ప్రతికూలంగా మారింది. అందుకే అంచనా వేసిన దానికంటే 10రోజులు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో తేమశాతం పెరిగిందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com