అందుకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి

గతకొద్ది రోజులుగా కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడం ఖాయమైయ్యింది. బీజేపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న ఆయన మునుగోడు నియోజకవర్గం ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం పెద్ద అంబర్ పేట్లో సమావేశం నిర్వహించిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్కు కాలం చెల్లిందన్నారు. భవిష్యత్తు బీజేపీ దేనని అందుకే తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. కార్యకర్తలంతా తమ అభిప్రాయాలు చెప్పి.. తనతో కలిసి రావాలని పిలపు ఇచ్చారు.
రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే.. ఆయన ప్రసంగాన్ని కార్యకర్తలు అడ్డుకున్నారు. జై కాంగ్రెస్ అంటూ నినాదాలు ప్రారంభించారు. సమావేశమంతా జై కాంగ్రెస్ నినాదాలతో మార్మోగడంతో రాజగోపాల్ రెడ్డి షాక్కు గురైయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారవద్దంటూ నినాదాలు చేశారు. పార్టీ మారే విషయంలో తనతో కలిసి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఎంతో కష్టపడి గెలిపించుకుంటే ఇలా ద్రోహం చేస్తారా అని నిలదీశారు. రాజగోపాల్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకున్న కార్యకర్తలు .. ఒక దశలో ఆయన కాళ్ళు పట్టుకొని పార్టీ మారొద్దని వేడుకున్నారు.
అంతకు ముందు తన ప్రసంగంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను టార్గెట్ చేశారు. రాష్ట్ర నాయకత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తన సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాడాన్ని తాను తప్పు బట్టబోనన్నారు. ఆర్థిక పరమైన అంశాలతో తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు.
ఎంతో ఉత్సాహంతో రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న ముఖ్యనేతల సమావేశంలో సీన్ రివర్స్ కావడంతో ఆయన ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చేసేదేమీ లేక .. తాను ఎవ్వరిని పార్టీ మారమని బలవంతం చేయడం లేదన్నారు. సమావేశంలో జై కాంగ్రెస్ నినాదాలు మారుమోగడంతో... అర్ధరాత్రి వరకు నిర్వహించాలని భావించిన సమావేశాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

