భార్య మృతదేహాన్ని నూతిలో పాతిపెట్టి కాంక్రీట్తో కప్పేసిన భర్త

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భీమడోలు మండలం పొలసానిపల్లిలో ఓ మహిళ మృతి అనుమానస్పందంగా మారింది. మృతదేహాన్ని నూతిలో పాతి పెట్టి కాంక్రీట్ తో పూడ్చేశాడు ఆమె భర్త. మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పొలసానిపల్లి గ్రామానికి చెందిన కోటా శ్రీను, రామలక్ష్మీకి పన్నెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే.. కొన్నాళ్లుగా వాళ్లిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవల కారణంగానే రామలక్ష్మీ ఉరి వేసుకొని చనిపోయినట్లు శ్రీను చెబుతున్నాడు. అయితే..భార్య మృతదేహాన్ని చూసి భయపడి..ఇంటి ప్రాంగణంలోని బావిలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నాడు. రామలక్ష్మీ కనిపించకపోవటంతో ఆమె బంధువులకు అనుమానం వచ్చింది. బావిలో కాంక్రీట్ తో పూడ్చిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో మృతదేహాన్ని వెలికి తీయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com