వరల్డ్ కప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫైట్.. ఇండియాను కంగారు పెడుతోన్న..

వరల్డ్ కప్ లో సెమీస్ బెర్తుపై కన్నేసిన టీమిండియా మరికాసేపట్లో వెస్టిండీస్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై తృటిలో ఓటమి తప్పించుకున్న కోహ్లీసేన విండీస్‌పై అప్రమత్తంగా ఆడాల్సిందే. సెమీస్ రేసుకు దాదాపు దూరమైన కరేబియన్ జట్టుపై గెలిస్తే... మిగిలిన మ్యాచ్‌లలో ఒక్కటి నెగ్గినా భారత్‌ నాకౌట్‌ స్టేజ్‌కు చేరుతుంది.

ప్రస్తుత ప్రపంచకప్‌లో మూడు పెద్ద జట్లపై గెలిచిన భారత్‌.. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌పై తడబాటు తప్పిస్తే... బ్యాట్స్‌మెన్ నిలకడగా రాణిస్తున్నా...మిడిలార్డర్‌ మాత్రం పూర్తి స్థాయి ప్రదర్శన కనబరచలేదు. దీంతో మరోసారి ఓపెనర్లు, టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కీలకం కానున్నారు. అటు బౌలింగ్‌లో మాత్రం భారత్‌కు తిరుగులేదు. పేసర్లతో పాటు స్పిన్నర్లూ పోటాపోటీగా వికెట్లు తీస్తున్నారు. గాయంతో విశ్రాంతి తీసుకుంటోన్న భువనేశ్వర్ స్థానంలో షమీని ఈ మ్యాచ్‌కు కూడా కొనసాగించే అవకాశాలున్నాయి.

మరోవైపు ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోతోన్న వెస్టిండీస్‌ సెమీస్‌ అవకాశాలు దాదాపుగా చేజార్చుకుంది. అద్భుతాలు జరిగితే తప్ప విండీస్ సెమీస్‌కు చేరడం అసాధ్యమనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన విండీస్‌కు భారత్‌ను నిలువరించడం పెద్ద సవాలే. బ్యాటింగ్‌లో నిలకడలేమితో పాటు బౌలింగ్‌లోనూ విండీస్ ప్రభావం చూపలేకపోతోంది. న్యూజిలాండ్‌పై గెలుపు ముంగిట బోల్తా పడిన కరేబియన్ టీమ్‌ బలమైన బౌలింగ్‌తో కూడిన టీమిండియాపై ఎలా ఆడుతుందో వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story