భారత్‌ను నిలువరించటం ఆ జట్టుకు అంత ఈజీ కాదు!

వరల్డ్ కప్ ఈవెంట్‌లో మరో బిగ్ మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్‌ గ్రౌండ్‌లో నేడు ఇంగ్లండ్‌తో తలబడబోతోంది. ఇప్పటివరకు సిరీస్‌లో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకుపోతున్న భారత్‌ను నిలువరించటం ఇంగ్లండ్‌కు అంత ఈజీగా కనిపించటం లేదు. వరుస పరాజయాల ఒత్తిడిలో ఉన్న ఇంగ్లండ్‌పై సత్తా చాటేందుకు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతోంది భారత్.

సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆరంభంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది ఇంగ్లండ్. ప్రతిమ్యాచ్‌లో 300కు పైగానే స్కోరు సాధిస్తూ చెలరేగిపోయింది. ఎదురే లేదన్నట్లుగా వరుసగా నాలుగు విజయాలు సాధించి వరల్ట్ కప్ ఫేవరేట్ టీమ్‌గా మారింది. అయితే, ఇంగ్లండ్ గ్రాఫ్ పతనం కూడా అంతే స్పీడుగా జరిగిపోయింది. వరుసగా మూడు ఓటములతో ఒత్తిడిలో కూరుకుపోయింది. ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్తాన్ చేతిలో ఓటమి పాలైన ఇంగ్లండ్ ఈరోజు భారత్ తో ఫైట్‌కు రెడీ అయింది. ఇంగ్లండ్ కు బ్యాటింగ్ లైనప్ శ్రీరామరక్షగా మారింది. ఓపెనర్లు రాయ్‌, బెయిర్‌ స్టో, రూట్‌, స్టోక్స్, మోర్గాన్, ఆరో వికెట్ బట్లర్ జట్టుకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. జట్టు తక్కువ స్కోరు సాధించనప్పుడు మాత్రం బౌలర్లు డిఫెండ్ చేయలేకపోతున్నారు. దీంతో సిరీస్ ఆరంభంలో టైటిల్ ఫేవరేట్‌ గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ ప్రస్తుతం సెమీస్‌కు చేరుతుందో లేదో అనే సందేహాలున్నాయి. శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓడటం, ఆసీస్‌ ముందు తలవంచడంతో ప్రస్తుతం ఇంగ్లాండ్‌ ఆత్మరక్షణలో పడింది. రన్‌రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరాలంటే న్యూజిలాండ్‌, భారత్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఇక భారత్ విషయానికి వస్తే అన్ని డిపార్ట్ మెంట్లో ఫవర్ ఫుల్ స్టామినాతో కనిపిస్తోంది. అయినా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయని మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు. వరుస విజయాలతో లోపాలు హైలెట్ కావటం లేదని అంటున్నారు. అయితే..ఓపెనర్లు అందిస్తున్న శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మలుచుకోవటంలో మాత్రం విఫలం అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పాకిస్తాన్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ఆకట్టుకునే ఇన్నింగ్స్ అందించలేకపోయాడు. నాలుగో స్థానంలో విజయ్ శంకర్ కు ఇంగ్లండ్ తో మ్యాచ్ ఆఖరి అవకాశంగా మారొచ్చు. అతని స్థానంలో రిషబ్ పంత్ ను బరిలోకి దింపాలని కూడా సీనియర్లు అడ్వైజ్ ఇస్తున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, షమీ పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నారు. బ్యాట్స్ మెన్ తడబడినా.. తక్కువ స్కోరుతోనూ ఫైట్ చేసి విజయాలను అందిస్తున్నారు. హార్ధిక్ పాండ్యా పేసర్లకు సపోర్ట్ ఇవ్వటంలో సక్సెస్ అవుతున్నారు. స్పిన్నర్లు కుల్‌దీప్‌, చాహల్‌ కీలకమైన సమాయాల్లో వికెట్లు రాబడుతున్నారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా గెలిచినా పోయేదేం లేదు. మహా అద్భుతాలు జరిగి రన్ రేట్ తారుమారు అయితే తప్ప భారత్ ను సెమీస్ చేరే అవకాశాలకు ఢోకా లేదు.

మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా కొత్త జెర్సీతో కనిపించబోతోంది. ముదురు నీలం, నారింజ రంగులోని జెర్సీలను ధరించనుంది. ఆరంజ్‌ జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు కొత్త లుక్‌తో కనిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story